వెంకటాద్రికి నలభై ఏళ్ళుంటాయి. మహా తిండిపోతు. చిన్నపిల్లలు తింటున్న చిరుతిండ్లను సైతం లాక్కుని మరీ తినేవాడు. ఎదురు తిరిగితే పిల్లలను చావ బాదేవాడు. అంతే కాకుండా వాళ్ళను ఏడిపించటం అతనికున్న మరో అలవాటు.
ఒకరోజు వెంకటాద్రి తన యింటి అరుగు మీద కూర్చుని ఉండగా కిరణ్ అనే పదేళ్ళ కుర్రాడు వాళ్ళ అమ్మ యిచ్చిన చిల్లర డబ్బులతో కొనుక్కున్న చిరుతిండి తింటూ పాఠశాలకు వెళ్తున్నాడు. అది చూసిన వెంకటాద్రి ఆ ఛిరుతిండిలో తనకూ వాటా యిమ్మని కోరాడు. అందుకు కిరణ్ అంగీకరించకపోవటంతో వెంకటాద్రికి కోపం వచ్చి వాటిని బలవంతాన లాక్కోబోయాడు. అయినా కిరణ్ తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోయాడు వెంకటాద్రికి పిచ్చకోపం వచ్చింది. సాయంత్రం కిరణ్ తిరిగి పాఠశాలనుండి అదే దారిన తన యింటి ముందుకొచ్చేసరికి తినేసిన అరటిపండు తొక్కలను దారిలో వేసాడు. అది చూసుకోకుండా వాటి మీద కాలేసిన కిరణ్ అమాంతం క్రింద పడిపోయాడు. అది చూసి వెంకటాద్రి విరగబడి నవ్వుతూ “తిండిలో నేను వాటా అడిగితే యివ్వ నంటావా? ఇప్పుడు తెల్సిందా నేనంటే ఏంటో? ఇంకా బాగా ఏడు" అంటూ నవ్వసాగాడు. కిరణ్ ఏడ్చుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు.
అప్పటి నుండి కిరణ్కి వెంకటాద్రి అంటే చాలా అక్కసుగా ఉండేది. ఎలాగైనా సరే అతనికి బుద్ధి చెప్పాలనుకుని ఆ అవకాశం కోసం ఎదురు చూసేవాడు. ఓసారి ఆ అవకాశం రానే వచ్చింది! ఆ రోజు గ్రామధికారి కూతురి పెళ్ళి అవడంచేత ఊరందరిని భోజనాలకు పిలిచారు.
అప్పుడు కిరణ్ ఓ మూల కూర్చుని పెళ్ళి వారిచ్చిన గారెలను తింటున్నాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు వెంకటాద్రి. కిరణ్ గారెలను తినటం చూసి అవి ఎక్కడున్నాయో చెప్పమన్నాడు.
అది విన్న కిరణ్కు ఒక ఆలోచన వచ్చింది. వెంకటాద్రికి బుద్ధి చెప్పాలంటే ఇదే మంచి | సమయమనుకుని, "నీకు గారెలు కావాలి అంతే గదా? అదిగో! ఆ పాత్రలో ఉన్నాయి వెళ్ళి తీసుకో" అంటూ వెడల్పుగా, ఎత్తుగా ఉన్న ఒక క్యానుని చూపించాడు. అది చూసి వెంకటాద్రి ఉరుకులు, పరుగులుగా వెళ్ళి రెండు చేతులూ అందులో పెట్టాడు. అంతే కెవ్వుమని అరిచి భయంతో రెండు చేతులను బయటికి తీసేసాడు. తోళ్ళూడిపోయి ఎర్రగా భయంక రంగా ఉన్నాయతని చేతులు. ఆ క్యానులో ఉన్నవి గారెలు కాదు. ఆ గారెలను వండి మిగిలిన వేడి వేడి నూనెను వంటవాళ్ళు దాంట్లో పోశారు. జరిగిందది. బాధతో కేకలేస్తున్న వెంకటాద్రిని చూస్తుంటే కిరణ్కు జాలేసింది.
"తప్పు చేయడం మానవ సహజం. అయితే దాన్ని సరిదిద్దుకోగలగడం వివేకవంతుల లక్షణం.” స్కూల్లో మాష్టారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కిరణ్కి. అంతే వెంటనే వెంకటాద్రిని తనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయించాడు. అంతే కాకుండా వెంక టాద్రి పూర్తిగా కోలుకునే దాకా దగ్గర ఉండి సేవ చేసాడు. "నీ మీద కోపంతో నేను చాలా తప్పు చేసి నీకు చాలా బాధ కల్గించాను. నన్ను క్షమించు వెంకటాద్రి బాబాయ్” అన్నాడు కిరణ్. అప్పుడు వెంకటాద్రి “లేదురా కిరణ్! నీవే నన్ను క్షమించాలి. ఎప్పుడూ నా స్వార్ధమే చూసు కున్నాను గానీ మీ పసివాళ్ళ మనస్సులను అర్థం చేసుకోలేకపోయాను. ఆడుతూ పాడుతూ. తిరగాల్సిన మీకు నేనో శాపమైపోయాను. నా కళ్లు తెరిపించావ్. నా జీవితానికో అర్థం చెప్పావ్. ఇక ముందెప్పుడు చిన్నపిల్లలనే కాదు, మరెవ్వరికి బాధ కల్గించను." అంటూ కిరణ్ని ముద్దాడాడు మనస్సు మారిన వెంకటాద్రి.