29. కుచేలుడి కథ | Kuchela and Krishna Friendship | Lord Krishna Avatar Story in Telugu

writer
0
శిశుపాలుడికి సాల్వుడనే స్నేహితుడున్నాడు. రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకు పోయే సందర్భంలో మిగిలినవాళ్ళతో బాటు ఈ సాల్వుడు కూడా ఓడిపోయాడు. అందుకని అతడికి పౌరుషం వచ్చి, లోకంలో యాదవులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ పట్టి, కేవలమూ మట్టి మాత్రమే తింటూ శివుణ్ణి గురించి దారుణమైన తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని, తనకు ఎదురులేని విమానం ఒకటి కావాలని కోరాడు. శివుడు చెప్పగా, విశ్వకర్మ నల్లని ఇనుప విమానం ఒకటి తయారు చేసి సాల్వుడి కిచ్చాడు. సౌభమనే ఆ విమానం ఎక్కి సాల్వుడు ద్వారక పైకి దాడికి వెళ్ళాడు. అతని సేనలు కూడా వచ్చి నగరాన్ని ముట్టడించాయి.

సాల్వుడు విమానం నుంచి రాళ్ళూ, చెట్లూ, ఆయుధాలూ నగరం మీద వేసి భీభత్సం చేశాడు. అతని సేనలు నగరపు ప్రాకారాలనూ, ద్వారాలనూ, తోటలనూ ధ్వంసం చెయ్యసాగాయి. అది చూసి ప్రద్యుమ్నుడు నాయకత్వం వహించి, సాత్యకి, చారుదేష్టుడూ, సాంబుడూ, అక్రూరుడూ, కృతవర్మా మొదలైన యోధులనూ, సైన్యాన్నీ వెంటబెట్టుకుని సాల్వుడి పైకి యుద్ధానికి వెళ్ళాడు. అప్పటికి కృష్ణుడింకా పాండవుల వద్దనే ఉన్నాడు.

సాల్వుడి పక్షానికీ, యాదవుల పక్షానికి మధ్య ఇరవై ఏడు రోజులపాటు తీవ్రంగా యుద్ధం జరిగింది. అప్పటికి కృష్ణుడు ద్వారకకు తిరిగివస్తూ యుద్ధ పరిస్థితి గ్రహించి, తన రథాన్ని తిన్నగా సాల్వుడి పైకి తోలించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. కృష్ణుడు సౌభవిమానాన్ని భగ్నం చేసి, సముద్రంలో పడేటట్టు చేసి, సాల్వుణ్ణి చక్రాయుధంతో చంపేశాడు.

సాల్వుడు చావగానే అతని స్నేహితుడైన దంతవక్త్రుడు గద ఒకటి తీసుకుని, ఒంటరిగా కృష్ణుడితో యుద్ధానికి వచ్చాడు. కృష్ణుడు దంతవక్త్రుడికి మేనమామ కొడుకే. అతను కూడా ఒక గద తీసుకుని దంత వక్త్రుడితో యుద్ధం చేస్తూ, రొమ్ము పగల గొట్టి అతన్ని చంపేశాడు. సాల్వుడు ప్రారంభించిన యుద్ధం తుదముట్టింది.

కృష్ణుడికి కుచేలుడనే బాల్య స్నేహితుడొకడుండేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గిరే చదువుకున్నారు. కుచేలుడు పెళ్ళాడి, గృహస్థాశ్రమం గడుపుతున్నాడు, కాని కటిక దారిద్య్రంతో బాధపడుతున్నాడు. దారిద్య్ర బాధ కుచేలుడికి కన్న అతని భార్యకు దుస్సహంగా ఉన్నది. అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో, "కృష్ణుడు నీకు స్నేహితుడే గదా? అతను బ్రాహ్మణులకు ఎడతెగని దానాలిస్తాడట. శరణు వేడిన వారిని తప్పక ఆదుకుంటాడట. అలాంటప్పుడు, స్నేహితుడివి, సంసారభారం మోస్తున్నవాడివీ అయిన నీకు సహాయం చెయ్యడా ? " అన్నది.

కుచేలుడికి కూడా, సహాయం కోరే వంకన కృష్ణుణ్ణి చూడాలనిపించింది. చూడటంవల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు. కనక అతను భార్యతో, "కృష్ణుణ్ణి చూడబోతాను, కాని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుక ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది. అందుకు తగిన దేమన్నా ఇంట్లో ఉన్నదా?'' అని అన్నాడు.

కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్ళ వారి నుంచి నాలుగు గుప్పిళ్ళు అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి, వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి, భర్త కిచ్చింది. కుచేలుడు ఆ అటుకుల మూట చేత బట్టుకుని ప్రయాణమై, ద్వారకకు చేరుకుని, కృష్ణుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు.

మంచం మీద పడుకుని ఉన్న కృష్ణుడు కుచేలుణ్ణి చూడగానే లేచి ఎదురు వచ్చి, గట్టిగా కౌగలించుకుని, తీసుకు వచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి, తానే స్వయంగా కుచేలుడి కాళ్ళు కడిగి, ఆ నీరు నెత్తిన చల్లుకుని, కుచేలుడి శరీరానికి గంధం రాచి, పూలమాలవేసి, దేవుణ్ణి చూసినట్టు చూశాడు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుని, చింకి బట్టలు ధరించి, శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మడికి తన భర్త అంత ఆదరం చూపటం గమనించి, రుక్మిణి వింజామర తీసుకుని కుచేలుడికి విసర నారంభించింది. కృష్ణుడు కుచేలుడి పట్ల చూపిన అభిమానానికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.

కృష్ణుడు కుచేలుడికి చెయ్య దగిన మర్యాదలన్నీ చేసి, గురుకులంలో చదివిన రోజులనాటి తమ అనుభవాలు నెమరువేయ నారంభించాడు.

ఒకసారి గురుపత్ని వాళ్ళను సమిధలు తెమ్మని పంపింది. వాళ్ళు ఒక మహారణ్యంలో ప్రవేశించారు. ఇంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమయింది. ఆకాశాన మెరుపులు మెరిశాయి. పిడుగులు పడ్డాయి. ఇలా మెరుపులూ, ఉరుములూ సాగుతూండగానే సూర్యాస్తమానమై పోయింది. సమిధల కోసం వచ్చినవాళ్ళు తడిసి ముద్ద అయిపోయారు. దారి తెలీదు. మిట్టపల్లా లేకమైపోయాయి. ఒకళ్ళ చేతులొకళ్ళు పట్టుకుని అరణ్యంలో తెల్లవార్లూ తిరగాడారు. మర్నాడు తెల్లవారింది. శిష్యులు అడవిలో చిక్కుపడి పోయారని తెలిసి సాందీపని గురువు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి, దైన్యస్థితిలో ఉన్న కుర్రవాళ్ళను చూసి, "మా కోసం ఎంత ప్రయాసపడ్డారు! ఇంతకన్న ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చెయ్యగలరు ? మీ భక్తికి సంతోషించాను. మీ కోరికలు ఈడేరుతాయి, ” అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను కృష్ణుడు కుచేలుడికి జ్ఞాపకం చేసి, "గుర్తు ఉన్నదా?” అని అడిగాడు.

"నీతో గురుకులవాస స్నేహం చేసిన నా బోటి వాడికి ఏ కోరిక తీరదు?" అన్నాడు కుచేలుడు.

కృష్ణుడా మాటకు నవ్వి,  "ఇంతకూ మీ ఇంటి నుంచి నాకేం తెచ్చావు?" అని అడిగాడు.

కుచేలుడు కంగారు పడ్డాడు. కృష్ణుడికి తాను తెచ్చిన అటుకు లివ్వాలంటే అతనికి చాలా సిగ్గు వేసింది. కృష్ణుడే బలవంతంగా కుచేలుడి చేతిలో ఉన్న గుడ్డ పేలిక మూట తీసుకుని, "ఇందులోది ఏమిటి ?" అని అడుగుతూ విప్పి, "అటుకులే? నా కెంత ఇష్టమనుకున్నావు!" అంటూ పిడికెడు నోట వేసుకుని, మరో పిడికెడు చేతిలోకి తీసుకున్నాడు..

"ఆ తిన్నవి చాలు !" అంటూ రుక్మిణి కృష్ణుడి చెయ్యిపట్టుకున్నది.

ఆ రాత్రి కుచేలుడు కృష్ణుడి ఇంటనే స్నానమూ, భోజనమూ, నిద్రా సుఖంగా చేసి, తాను నిజంగా స్వర్గంలోనే ఉన్నాననుకున్నాడు.

మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణమయేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంతదూరం సాగనంపాడు. తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు. అతను తన మనసులో, "కృషుడు మహారాజు. నేనో హీనుడైన నిరుపేద బ్రాహ్మణ్ణి. బ్రాహ్మణ్ణి కదా అన్న ఆదరంతో నన్ను అతను కౌగలించు కున్నాడు. తన తమ్ముణ్ణి చూసినట్టు చూశాడు. తన భార్య పడుకునే మంచం మీద కూర్చోబెట్టాడు. తన భార్యచేత వింజామర వీయించాడు. దేవుడికి చెయ్యదగినంత మర్యాద చేశాడు. నాకు డబ్బిచ్చి నట్టయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మరిచిపోతాననుకుని కాబోలు ఆ పని చెయ్యలేదు, " అనుకున్నాడు. 

కాని కుచేలుడు తన ఇంటి కేసి వెళ్ళే సరికి, ఎట్టెదట కళ్ళు జిగేలుమనే రాజ భవనాలు కనిపించాయి. ఉద్యానవనాలూ, సరోవరాలూ కనిపించాయి. వాటిలో రక రకాల పక్షులూ, తామరలూ, కలువలూ కనిపించాయి. భవనంలో దాస దాసీలు తిరుగాడుతున్నారు.

"ఇది ఎవరి ఇల్లయి ఉంటుందీ? నా యిల్లు కాదే! ఇదంతా ఇక్కడ ఎలా వచ్చిందీ?" అని కుచేలుడు కుచేలుడు దిగ్భ్రామ చెంది ఉండగా, దేవతలా అన్నట్టున్న స్త్రీ పురుషులు మేళతాళాలతో అతనికి ఎదురు వచ్చి, భవనంలోకి అతన్ని తీసుకుపోయారు.

మారువేషంలో ఉన్న లక్ష్మీదేవి లాగా కుచేలుడి భార్య వచ్చి తన భర్తను చూసి, కన్నీరు తోసుకు వచ్చే కళ్ళను గట్టిగా మూసుకుని భర్తకు నమస్కరించి, మనసు లోనే అతన్ని ఆలింగనం చేసుకున్నది.

ఇదంతా చూసి కుచేలుడు తనలో, "నా కీ ఐశ్వర్యమంతా కృష్ణుణ్ణి చూసి రావటం చేతనే కలిగి ఉంటుంది. మరో కారణమేదీ కనబడదు. స్నేహితుడంటే అలాగే ఉంటాడు; తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు; తాను ఇచ్చేది ఎంతో గొప్పదే అయినా దాన్ని అల్పంగానే భావిస్తాడు, " అనుకున్నాడు.

అటు తరవాత సకలైశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ, బిడ్డలతోనూ సుఖంగా జీవించాడు.

ఒకప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అప్పుడు యాదవులందరూ, అని రుద్ధుణ్ణి ద్వారకకు రక్షకుడుగా ఉంచి, కురుక్షేత్రానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ కృష్ణుడికి. పాత చుట్టాలంతా కలిశారు. నందుడూ, యశోదా వచ్చారు. కుంతి వచ్చింది. భీష్మద్రోణులూ, ధృతరాష్ట్రుడూ, సంజయుడూ, విదురుడూ, కృపుడూ, దుర్యో ధనుడు మొదలైనవారూ, గాంధారీ, పాండవులూ, వారి భార్యలూ, అందరూ చాలా కాలానికి ఒక చోట సమావేశమయారు. అందరూ కబుర్లు చెప్పుకున్నారు. 

ఆ సమయంలో పాండవుల భార్య అయిన ద్రౌపది కృష్ణుడి అష్టభార్యలను, " మీకూ కృష్ణుడికి ఎలా వివాహాలు జరిగాయి ?” అని అడిగింది. 

"నన్ను శిశుపాలుడి 'కివ్వాలని జరాసంధుడు మొదలైన వారంతా నిర్ణయిస్తే, కృష్ణుడు వచ్చి, అందరినీ మట్టి కరిపించి, 'నన్ను ఎత్తుకుపోయి పెళ్ళి చేసుకున్నాడు,” అని రుక్మిణి తన వివాహ వృత్తాంతం చెప్పింది.

"నన్ను మా తండ్రి సత్రాజిత్తు మరెవరికో ఇద్దామనుకున్నాడు. అంతలో నా పిన తండ్రి చనిపోయాడు. అది కృష్ణుడి పనేనని మా తండ్రి ఒక అపవాదు వేశాడు. అప్పుడు కృష్ణుడు బయలుదేరి వెళ్ళి, మా పిన తండ్రిని చంపిన సింహాన్ని చంపి శ్యమంతకమణిని తీసుకుపోయిన జాంబవంతుణ్ణి జయించి, మణిని తెచ్చి మా తండ్రి కిచ్చి, నన్ను పెళ్ళాడాడు," అన్నది సత్యభామ.

"మా తండ్రి జాంబవంతుడు ఇరవై అయిదు రోజులు కృష్ణుడితో పోరిన మీదట, ఆనాటి రాముడే ఈ కృష్ణుడుగా అవతరించాడని గ్రహించి, ఆయన కాళ్ళు పట్టుకుని, సింహాన్ని చంపి తెచ్చిన శ్యమంతకమణితోపాటు నన్ను కూడా కృష్ణుడికి అర్పించాడు," అన్నది జాంబవతి.

"నేను తన కోసం తపస్సు చేశానని తెలిసి, అర్జునుణ్ణి వెంట పెట్టుకుని నా దగ్గిరికి వచ్చిన కృష్ణుడు నన్ను పెళ్ళాడాడు," అని కాళింది చెప్పింది.

"నాకు స్వయంవరం ఏర్పాటయినప్పుడు అనేకమంది రాజులు వచ్చారు. కృష్ణుడు ఆ రాజు లందరినీ, జయించి నన్ను పెళ్ళాడాడు," అని భద్ర చెప్పింది.

"మా తండ్రి ఏడు ఆబోతులను ఎవరు గెలిస్తే వారికి నన్నిచ్చి పెళ్ళి చేస్తానన్నాడు. కృష్ణుడు వాటిని మేకపిల్లలనులాగా అవలీలగా నిగ్రహించి, నన్ను పెళ్ళాడాడు, " అని నీళ చెప్పింది.

"నాకు కృష్ణుడు మేనమామ కొడుకే. నాకు అతన్నే పెళ్ళాడాలని ఉన్నదని తెలిసి మా తండ్రి నన్నతనికిచ్చి పెళ్ళి చేశాడు, " అన్నది మిత్రవింద.

చివరకు లక్షణ తన వివాహ వృత్తాం తాన్ని ఇలా చెప్పింది :

"మీ తండ్రిలాగే మా తండ్రి బృహత్సేనుడు కూడా కూడా ఒక మత్స్యయంత్రం ఏర్పాటు చేసి దాన్ని కొట్టినవారికి నన్నిచ్చి పెళ్ళి చేస్తానని ప్రకటించాడు. నీ తండ్రి ఏర్పాటు చేసిన మత్స్యయంత్రం బయటికి కనిపించక పోయినా, లోపలికి కనిపించింది. కాని మా తండ్రి ఏర్పాటు చేసినది బయటా, లోపలా కూడా కనిపించక, నీటిలో దాని ప్రతిబింబం మాత్రమే, అది కూడా అస్పష్టంగా, కనిపించింది. దాన్ని కొట్టటానికి మా తండ్రి ఏర్పాటు చేసిన బాణాన్ని చాలామంది ఎక్కు పెట్టలేకనే పోయారు. ఎక్కుపెట్టలేకనే జరాసంధుడూ, శిశుపాలుడూ, భీముడూ, దుర్యోధనుడూ, కర్ణుడూ విల్లు ఎక్కు పెట్టి కూడా నీటిలో ప్రతిబింబాన్ని కనిపెట్టలేక పోయారు. అర్జునుడు ప్రతిబింబాన్ని కనిపెట్టి కూడా కొట్టలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి, విల్లు ఎక్కుపెట్టి, మత్స్యయంత్రాన్ని కొట్టి, నన్ను పెళ్ళాడాడు."

ద్రౌపదితో బాటు ఈ కథలన్నీ విన్న స్త్రీలందరూ ఎంతో ఆనందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)