30. కృష్ణ నిర్యాణం | Krishna’s Final Moments & Moksha | Lord Krishna Avatar Story in Telugu

writer
0
ద్రౌపదీ, కృష్ణుడి భార్యలూ, ఇతర స్త్రీ జనమూ తమలో తాము కబుర్లు చెప్పుకున్నట్టుగానే పురుషులంతా ఒక చోట చేరి వారి ముచ్చట్లు వారు చెప్పుకున్నారు. ఆ సమయంలో అనేకమంది మునులు బలరామ కృష్ణులను చూడ వచ్చారు. పాండవులూ, మిగిలిన రాజులూ గౌరవ పూర్వకంగా లేచి, మునులకు నమస్కారాలు చేశారు. అందరితోబాటు కృష్ణుడూ, బల రాముడూ కూడా వారిని శ్రద్ధాభక్తులతో పూజించారు.

మునులు కృష్ణుణ్ణి కీర్తించి, " నువు మానవ రూపం ధరించిన ఆదిదేవుడివి. మేము ఎంత తత్వవేత్తలమైనా నీ మాయకు కట్టుబడిన వాళ్ళమే,” అన్నారు.

వసుదేవుడు ఆ మునుల సలహా పైన యజ్ఞాలు చేసి దేవఋణం తీర్చుకుందామని సంకల్పించాడు. యాదవులు యజ్ఞానికి అవసరమైన సంబారాలన్నీ సమకూర్చారు. వసుదేవుడూ, ఆయనకు గల పద్దెనిమిది మంది భార్యలూ స్నానాలు చేసి, కొత్త బట్టలూ, ఆభరణాలూ ధరించి యజ్ఞ దీక్ష వహించారు. మునుల సహాయంతో ప్రకృతి యజ్ఞాలూ, వికృతి యజ్ఞాలూ చేసి, అన్ని యజ్ఞాలలోనూ యజ్ఞపురుషుణ్ణి ఆరాధించి, ఋత్విక్కులకు ఆవులనూ, భూమినీ, కన్యలనూ దక్షిణగా ఇచ్చి తృప్తి పరచాడు. యజ్ఞాలు పూర్తి అయిన అనంతరం అవ భృత స్నానం చేసి వసుదేవుడు తన బంధు జనాని కంతటికీ విందులు చేశాడు.

ఒకనాడు దేవకీ దేవికి ఒక ఆలోచన వచ్చింది. తన కొడుకులు బలరామ కృష్ణులు సామాన్యులు కారు, శక్తి సంపన్నులు వారు తమ గురువుకు గురుదక్షిణ కింద, చచ్చిపోయిన గురుపుత్రుణ్ణి తెచ్చి ఇచ్చారు. కంసుడు తన కొడుకులను వరసగా చంపేశాడు. అలాపోయిన తన కొడుకులందరివీ వాళ్ళు తిరిగి తీసుకువచ్చి తనకు చూపించలేరా?

ఆమె ఈ మాటే బలరామ కృష్ణులను అడిగింది. వాళ్ళు అలాగేనని దేవకీ దేవికి చెప్పి, యోగమాయ ధరించి, సుతలానికి వెళ్ళారు. అక్కడ బలిచక్రవర్తి వారికి ఘనమైన స్వాగతం తెలిపి, వారు వచ్చిన పని అడిగాడు.

"మహారాజా, పూర్వం స్వాయంభువ మన్వంతర కాలంలో మరీచి కొడుకులు ఆరుగురు, బ్రహ్మ సరస్వతిని మోహించగా చూసి నవ్వారు. అప్పుడు బ్రహ్మవారిని రాక్షసులుగా పుట్టమని శపించాడు. స్మరుడూ, ఉద్గథుడూ, పరిష్వంగుడూ, పతంగుడూ, క్షుద్రభువూ, ఘృణి అనే ఆ ఆరుగురూ మొదట హిరణ్యకశిపుడి కొడుకులై పుట్టి, అనంతరం మా తల్లి అయిన దేవకీ దేవి గర్భాన జన్మించి, కంసుడి చేత చంపబడి, ఇప్పుడు నీ రాజ్యంలో ఉన్నారు. వారిని నా వెంట పంపినట్టయితే, మా తల్లికి చూపి, ఆమె విచారాన్ని పోగొడతాను. ఆ తరువాత వారిని ఉత్తమ లోకాలకు పంపుతాను,” అని కృష్ణుడు బలితో అన్నాడు.

అందుకు బలి అంగీకరించి ఆ ఆరుగురినీ కృష్ణుడి వెంట పంపాడు. తాను పోగొట్టుకున్న ఆ కొడుకులను చూసి దేవకీ దేవి ఎంతో సంతోషించింది. ఆమె వారిని కౌగలించుకుని, తన పాలు కూడా ఇచ్చింది. తరువాత ఆ ఆరుగురూ కృష్ణుడి అనుగ్రహం ఆ వల్ల ఊర్ధ్వలోకాలకు పోయారు.

కాలం గడిచిపోయింది. భారత యుద్ధంలో కౌరవ పాండవులు అపారమైన జనక్షయం కలిగించారు. యుద్ధంలో గెలిచిన ధర్మరాజును సింహాసనం పైన కూర్చోబెట్టి కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు.

ఒకనాడు కృష్ణుణ్ణి చూడటానికి విశ్వామిత్రుడూ, అసితుడూ, కణ్వుడూ, దూర్వాసుడూ, భృగువూ, అంగిరసుడూ, కశ్యపుడూ, వామదేవుడూ, అత్రి, వసిష్ఠుడూ, నారదుడూ మొదలైన మునులు వచ్చినప్పుడు కొందరు యాదవకుమారులు సాంబుడికి గర్భిణీ స్త్రీ వేషం వేసి వారి దగ్గిరికి తెచ్చి, ఎంతో వినయం నటిస్తూ, "ఈమె తనకే బిడ్డ కలిగేదీ మిమ్మల్ని అడగటానికి సిగ్గుపడుతున్నది. అందుచేత మేమే అడుగుతున్నాం. తమకు తెలియనిదంటూ లేదు గనక దయచేసి చెబుతారా?” అని మునులను అడిగారు.

మునులకు చాలా కోపం వచ్చింది. మూఢులారా, దీని కడుపున కులనాశన కరమైన ముసలం పుడుతుంది!" అని వారు శపించారు.

యాదవ కుమారులు భయపడి పారిపోయి, సాంబుడి బట్టలు విప్పి చూస్తే, అతని పొట్ట నుంచి ఒక ఇనపరోకలి బయటికి వస్తూ కనపడింది. వాళ్ళు దాన్ని బయటికి తీసి, "ఎంత పాపిష్ఠి పని చేశాం! ఈ సంగతి తెలిస్తే యాదవులందరూ ఏ మంటారో ? ' అని భయపడుతూ ఉగ్రసేనుడి వద్దకు పోయి, జరిగినదంతా ఆయనకు చెప్పారు.

ముసలం గురించీ, మునుల శాపం గురించీ యాదవుల కందరికీ తెలిసింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, భయపడ్డారు కూడా. ఉగ్రసేనుడు యాదవులతో, ఆ ముసలాన్ని అరగదీసి, దాని పొడిని సముద్రంలో కలపమన్నాడు. యాదవులు అలాగే చేశారు. ఆ పొడి సముద్రపు అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకు వచ్చి, అక్కడ తుంగ రూపంలో మొలిచింది. ముసలాన్ని అరగదీయగా చివరకు మిగిలిన సన్నని ముక్కను ఒక చేప మింగింది. ఆ చేప ఒక జాలరి వాడికి మరికొన్ని చేపలతో సహా దొరికింది. ఆ జాలరి ఆ చేప కడుపులో కనిపించిన ఇనప ముక్కను తీసుకుని, ఒక బాణానికి ములికిగా ఉపయోగించుకోవటానికి ఒక వేటగాడికి ఇచ్చాడు.

ఈ విధంగా యాదవ వినాశనానికి తగిన ఏర్పాట్లు పూర్తి అయాయి.

తరువాత కొంత కాలానికి ద్వారకలో ఉత్పాతాలు కనిపించాయి. అప్పుడు " కృష్ణుడు సుధర్మ సభాభవనంలో యాదవులందరినీ సమావేశపరచి, వారితో ఇలా అన్నాడు:

"అయ్యా, ద్వారకలో మహా దారుణమైన ఉత్పాతాలు కాన వస్తున్నాయి. ఇవి కీడును సూచిస్తున్నాయి. మునులు యాదవ వంశాన్ని శపించిన సంగతి మీకు తెలిసినదే. అందుచేత మనం ఒక్క క్షణం కూడా ఈ ద్వారకలో ఉండటం మంచిది కాదు. స్త్రీలనూ, పిల్లలనూ, వృద్దులనూ శంఖ ద్వారానికి పంపేద్దాం. మిగిలిన వాళ్ళ మందరమూ సరస్వతీ నదీ తీరాన గల ప్రభాసతీర్థానికి వెళ్ళి, అక్కడ స్నానాలూ, ఉపవాసాలూ చేసి, దేవపూజ చేసి, బ్రాహ్మణులకు గోవులనూ, బంగారాన్నీ, వస్త్రాలనూ, ఏనుగులనూ, గుర్రాలనూ, గృహాలనూ దానం చేద్దాం. వారి చేత శాంతికర్మలు చేయింతాం. దేవతలనూ, బ్రాహ్మణులనూ, గోవులనూ పూజిస్తే అన్ని అరిష్టాలూ తొలగిపోగలవు. మనకు శుభం కలుగుతుంది.”

యాదవ ముఖ్యులందరూ కృష్ణుడు చెప్పిన దాన్ని ఆమోదించారు. స్త్రీలనూ, పిల్లలనూ, వృద్ధులనూ పంపేసి, యాదవు లందరూ ఓడల మీద సముద్రాన్ని దాటి ప్రభాసతీర్థాన్ని చేరుకున్నారు. కాని అక్కడ వారిని దైవమాయ ఆవరించింది. అందరూ కల్లుతాగి, ఆ మైకంలో కొట్లాటలకు దిగారు. అది తీవ్రమైన యుద్ధంగా పరిణమించింది. ఆ యుద్ధంలో ఏనుగులూ, గుర్రాలూ చచ్చాయి. రధాలు విరిగాయి. ప్రముఖ యాదవుల మధ్య ద్వంద్వ యుద్ధాలు సాగాయి. ప్రద్యుమ్నుడూ, సాంబుడూ పోరాడారు. అలాగే అక్రూరుడు భోజుడి తోనూ, అనిరుద్ధుడు సాత్యకితోనూ, సుభద్రుడు సంగ్రామజితుతోనూ, సుచారుడు గదుడితోనూ, సుమిత్రుడు సురధుడితోనూ యుద్ధాలు సాగించారు. ఇదే విధంగా మిగతా వారంతా కొట్లాటలకు తలపడ్డారు. బంధుభావమూ, మిత్రభావమూ లేకుండా పోయాయి. వెర్రెత్తిన వారిలాగా ఒకరినొకరు చంపుకోసాగారు.

కొంత సేపటికి బాణాలన్నీ అయిపోయాయి. విల్లులన్నీ విరిగిపోయాయి. మరి ఆయుధాలు లేవు. సముద్ర తీరాన ఏపుగా పెరిగిన తుంగ ఉన్నది. దాన్ని పీకి, దానితో ఒకరినొకరు చంపుకోసాగారు. కృష్ణుడు వారిని ఆపాలని చూశాడు. వాళ్ళు  అలిగి, బలరాముడి మీదా, కృష్ణుడి మీదా కలియబడ్డారు. కృష్ణుడికి మండిపోయింది. అతనే ఆ తుంగ పీకి, దానితో యాదవులను ఎడాపెడా చంపేశాడు. మునుల శాపం, కార్చిచ్చు వెదుళ్ళను కాల్చినట్టుగా, యాదవవంశాన్ని నిర్మూలించింది.

అందరూ చచ్చారు. కృష్ణుడు అంతటా కలయ జూసి, "భూభారం తగ్గిపోయింది," అనుకున్నాడు.

బలరాముడు సుముద్ర తీరాన యోగ సమాధిలో కూర్చుని ప్రాణాలు వదిలాడు. అది కళ్ళారా చూసి కృష్ణుడు ఒక రావి చెట్టు మొదట్లో, కుడి తొడమీద ఎడమ పాదం పెట్టి కూర్చున్నాడు. ఎర్రని ఆ ఎడమ పాదాన్ని చూసి, అదేదో జంతువు ముఖమనుకుని, జరుడనే వేటగాడు దాన్ని బాణంతో కొట్టాడు. ఆ బాణం ములికి ముసలాన్ని యాదవులు అరగదీయగా మిగిలినదే! 

బాణం వేసి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ వేటగాడు, తాను మృగమనుకున్నది మనిషి పాదమని తెలుసుకుని, కృష్ణుడితో, "అయ్యా, పొరపాటు జరిగిపోయింది, నన్ను క్షమించు,” అన్నాడు.

కృష్ణుడు జరుడితో, "విచారించకు. నేను కోరుకున్నదే జరిగింది,” అని వాణ్ణి పంపేశాడు.

ఈలోపల దారుకుడు రథంలో, కృష్ణుణ్ణి వెతుక్కుంటూ అటు వచ్చి, కృష్ణుణ్ణి చూసి, రథం దిగి దగ్గిరికి వచ్చాడు. కృష్ణుడు దారుకుడితో, “నువు ద్వారకకు వెళ్ళి, మనవాళ్ళతో అందరూ చచ్చారనీ, బల రాముడు పోయాడనీ, నేను ఈ స్థితిలో ఉన్నాననీ చెప్పు. మీరెవరూ ఇంక ద్వారకలో ఉండకండి. నేను పోయాక సముద్రుడు దాన్ని ముంచేస్తాడు. నా తల్లి దండ్రులూ, మిగిలినవాళ్ళూ ఇంద్రప్రస్థానికి వెళ్ళి, అర్జునుడి అండన ఉంటారు. నువు జరిగిన దాన్ని గురించి నిర్లిప్తంగా, జ్ఞాననిష్ఠలో బతుకు,” అని చెప్పాడు.

దారుకుడు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి, చిన్నబోయిన మనసుతో ద్వారకకు వెళ్ళిపోయాడు. అక్కడికి చేరి అతను ఏడుస్తూ ఉగ్రసేనుడి కాళ్ళమీదా, వసుదేవుడి కాళ్ళ మీదా పడి, యాదవులంతా చచ్చిపోయిన సంగతి తెలియజేశాడు. అందరూ గుండెలు బాదుకుంటూ యాదవులు చచ్చిన చోటికి వెళ్ళారు. వసుదేవుడూ, దేవకీ, రోహిణీ తమ కొడుకులైన బలరామ కృష్ణుల కోసం ఎంతో వెతికారు. కాని వాళ్ళ శరీరాలు కనిపించ లేదు. ఆ ముగ్గురూ గుండెలు పగిలి అక్కడే ప్రాణాలు విడిచారు.

యాదవుల భార్యలందరూ తమతమ భర్తలతో సహగమనం చేశారు. బలరాముడి భార్యలు కూడా బలరాముడి చితి మీదనే కాలిపోయారు. వసుదేవుడి భార్యలూ, కృష్ణుడి భార్యలూ కూడా అలాగే చేశారు.

అర్జునుడు వచ్చి, చచ్చిపోయిన బంధు గణానికి ఉత్తరక్రియలు చేయించాడు. అదే సమయంలో ద్వారకానగరం సముద్రంలో ముణిగిపోయింది. నగరంలో ఉన్న దేవాలయం ఒక్కటి మాత్రం నీటి మీద కనబడుతూ నిలిచింది.

అర్జునుడు, చాపగా మిగిలిన స్త్రీలనూ, బాలలనూ, వృద్ధులనూ వెంట బెట్టుకుని ఇంద్రప్రస్థానికి వచ్చి, వజ్రుడికి పట్టాభిషేకం చేశాడు. అటు తరువాత పాండవులు ద్రౌపదితో సహా మహాప్రస్థానం వెళ్ళారు.

కృష్ణుడు నిర్యాణం చెందే సమయంలో అక్కడికి బ్రహ్మా, ఇంద్రుడూ, తదితర దేవతలూ, ప్రజాపతులూ, సిద్ధులూ, విద్యాధరులూ, అప్సరలూ వచ్చారు. ఆకాశమంతా వారి విమానాలతో నిండి పోయింది. విమానాల నుంచి పుష్పవర్షం కురిసింది. కృష్ణుడు దివ్యమైన విష్ణువు రూపం ధరించి, తనను చూడవచ్చిన వారినందరినీ ఒకసారి చూసి, సత్యమూ, ధర్మమూ, ధృతి, శ్రీ, కీర్తి తనవెంట రాగా, వైకుంఠానికి బయలుదేరాడు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)