అవంతీరాజ్యాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన ధర్మ పాలనలో ప్రజలు ఎటువంటి లోటూ లేకుండా సుఖశాంతులతో జీవించారు. వారికి యుద్ధభయం లేదు; పాడిపంటలకు కొదవలేదు. దానధర్మాలు చేయాలన్నా పుచ్చుకోవడానికి ఎవరూ వచ్చేవారుకారు. ఎందుకంటే, లేనివారంటూ ఆ రాజ్యంలో లేనే లేరు. ఇంద్రద్యుమ్నుడు కళాభిమాని గానూ, కవి పండిత పోషకుడు గానూ కీర్తి గాంచాడు. ఆయన ధర్మపాలననూ, సుగుణాలనూ పొగుడుతూ కవులు కావ్యాలు రచించారు.
ఇంత సాధించినప్పటికీ, రాజును ఎప్పుడూ ఏదో అసంతృప్తి వెంటాడ సాగింది. తనకు తీరని కోరిక ఏదీ లేదు. అయినా, తెలియని అసంతృప్తి తన నెందుకు ఇలా బాధిస్తున్నదన్న విషయం, రాజుకు మొదట అంతుబట్టలేదు. కారుమబ్బులు తొలగిపోగానే, ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్టు, క్రమంగా ఆయన మనసులోని కోరిక బయటపడింది. యధాలాపంగా ఆయన కొక ఆలోచన తట్టింది. భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి! ఆ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వమున్న అసంతృప్తి కాస్త తగ్గింది. అయినా, నిర్మించిన ఆలయంలో ఏ దైవవిగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురయింది.
రాజు ఒకనాడు రాత్రి పడుకునేముందు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ, అలాగే నిద్రపోయాడు. అప్పుడాయనకు ఒక కల వచ్చింది: "మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు, కాలం ఆసన్నమయినప్పుడు విగ్రహం దానంతట' అదే వస్తుంది!" అన్న దివ్య స్వరం వినిపించింది.
రాజు అమితానందంతో నిద్రలేచాడు. ఆయన మనసులోని విచారం మటు మాయమయింది. తెల్లవారగానే మంత్రులను పిలిపించి, తన మనోరథాన్ని తెలియ జేశాడు. వాస్తు శాస్త్రవేత్తలను పిలిపించి, ఆలయనిర్మాణానికి తగిన స్థల నిర్ణయం చేయమన్నాడు. జ్యోతిష్కులను రప్పించి, ఆలయ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని ఆదేశించాడు.
'ఒక శుభముహూర్తాన, సువిశాలమైన పూరీ సముద్రతీరంలో మేళతాళాలతో, వేద మంత్రాలతో, ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమయింది !
ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్ళను దూరప్రాంతాల కొండల నుంచి తెప్పించారు. సముద్రంగుండా, నదులగుండా, ఓడలలోనూ, పడవలలోనూ, ఏనుగులు పూన్చిన బళ్ళ మీదా వాటిని సముద్ర తీరానికి చేరవేశారు.
దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలకొలది శిల్పులూ, పనివాళ్ళూ రాత్రింబవళ్ళు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిండిన వాళ్ళ ఉత్సాహం; నిర్విరామపరి శ్రమ ఫలితంగా కఠిన శిలలలో అందమైన పువ్వులు పుట్టు కొచ్చాయి. అపురూప శిల్పాలు రూపులు దిద్దుకున్నాయి. కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయింది. కడలితరంగాలు స్పృశించే సాగరతీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు బ్రహ్మాండమైన ఆలయం ఎదిగింది !
ఆలయనిర్మాణం పూర్తికాగానే, గుడిలో దేవుడెక్కడ అని అందరూ ప్రశ్నించ సాగారు. రాజు కూడా ఈ విషయమై తీవ్రంగా ఆలోచించసాగాడు. దిగులుపడ సాగాడు.
ఒకనాడాయన ఆలయంలో ప్రవేశించి గర్భగుడి కేసి చూస్తూ కూర్చుని, "దేవా, ఈ గుడిలో ఏ రూపంలో కొలువు తీరాలని నీ సంకల్పం. ఆ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా ? ఇంకా ఎంతకాలమని వేచి వుండాలి ? ఇన్ని శ్రమలకోర్చి నిర్మించిన ఈ ఆలయం ఇలా శూన్యంగా వుంటే, నలుగురూ నన్ను చూసి నవ్వరా ?" అని కన్నీళ్ళతో ప్రార్థించాడు.
ఆ రోజు రాత్రి రాజు ఒక కలగన్నాడు: “ఇక్కడికి సమీపంలోనే దేవుడు శ్రీ కృష్ణ రూపంలో ఉన్నాడు. అన్వేషిస్తే ఆ కరుణా సింధువు నీ వశమవుతాడు!" అన్న దివ్య సందేశం అందింది.
భక్తులతో దాగుడు మూతలాడడం కృష్ణుడి స్వభావం గనక, అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు. ఆ మహానుభావుణ్ణి కనుగొనగలవాడు నిర్మల హృదయం గల వివేక సంపన్నుడయిన భక్తుడై వుండాలి. అందువల్ల ఆ మహాకార్యాన్ని రాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులకు అప్పగించాడు. నలుగురూ నాలుగు దిక్కులకు బయలుదేరారు.
ఆ నలుగురిలో చిన్నవాడయిన విద్యాపతి తూర్పుదిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి, ఆ తరవాత ఉత్తరం దిక్కుగా తిరిగాడు. అక్కడ అరణ్య, ప్రాంతం ఎదురయింది. మనసులో కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ. తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగత భావంతో, దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్టు భావిస్తూ అడవిలో ప్రవేశించాడు. పోను పోను అడవి మరీ దట్టం కాసాగింది.
అరణ్యం మధ్య చిన్న కొండ కనిపించింది. కొండ నుంచి లయబద్ధమైన సంగీతం వినవచ్చింది. ఇది సంగీత పర్వతం కాదు కదా అనుకుంటూ విద్యాపతి దానిని సమీపించాడు. మృదంగ ధ్వనులు. వేణునాదమూ, కరతాళ ధ్వనులూ కలిసి ఒక అద్భుత గానం వినిపించింది. కొండకు అవతలివైపు నుంచి సంగీతం వస్తున్నట్టు విద్యాపతి గ్రహించాడు.
అతడు మెల్లగా కొండ ఎక్కి చూశాడు. కొండనానుకొని అందమైన లోయ. అక్కడ కొందరు కోయ యువతులు పాడుతూ నృత్యం చేస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ, విద్యాపతి పక్కనున్న చెట్టు కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు. చాలా దూరం కాలి నడకనే రావడం వల్ల అలిసిపోయిన విద్యాపతికి ఆ దృశ్యం ఎంతో హాయిని కలిగించింది!
హఠాత్తుగా పులిగాండ్రింపు విని ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు విద్యాపతి. పులి గాండ్రిస్తూ అతనికేసి పరిగెత్తి వస్తున్నది. ఏమి చేయడానికీ తోచక హడలిపోయి అతడక్కడే స్పృహ తప్పి పడిపోయాడు!
'రాజా!' అన్న స్త్రీ కంఠస్వరం వినగానే పులి చటుక్కున ఆగిపోయింది.
"ఇలా తిరిగిరా !" అని పిలిచిందా స్త్రీ మళ్ళీ.
పులి వెనుదిరిగి మెల్లగా స్త్రీల కేసి వెళ్ళి తనను పిలిచిన యువతి పాదాల వద్ద కుక్కపిల్లలా పడుకుంది. ఆ యువతి పులి వీపుపై ఆప్యాయంగా తట్టింది. అక్కడున్న యువతు లందరిలోకీ ఆ యువతి ఎత్తుగానూ, ఎంతో అందంగానూ ఉన్నది. ఆమె పేరు లలిత: కోయదొర విశ్వావసు ఏకైక కుమార్తె !
లలిత చెప్పగానే, ఇద్దరు యువతులు పరిగెత్తిపోయి, స్పృహ తప్పి పడివున్న విద్యాపతికి అరటి ఆకులతో మెల్లగా వీచారు. ఇంకొక యువతి, దగ్గరున్న సెలయేటి నుంచి తామరాకుతో నీళ్ళు తెచ్చి, అతని ముఖం మీద చిలకరించింది. అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు. యువతులు తాగడానికి నీళ్ళిచ్చారు.
ఆ తరువాత లలిత అతన్ని సమీపించి, "నువ్వెవరో మాకు తెలియదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియదు. బహుశా అడవిలో దారి తప్పి ఇలా వచ్చి వుంటావు. నిన్నీ స్థితిలో పదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. మా వెంట, మా గూడానికి వస్తావా ?" అని అడిగింది.
ఆమె మాటలకు విద్యాపతి ఆనందించాడు. ఆమె వెంట వెళ్ళడానికి మౌనంగా లేచి నిలబడ్డాడు.
లలితముందు దారితీయగా, విద్యాపతీ, చెలికత్తెలూ ఆమె వెంట నడిచారు. లలిత ఒక యువతిని దగ్గరికి పిలిచి, తాము వస్తూన్న సంగతి తండ్రికి ముందుగా తెలియజేయమని చెప్పింది. ఆ యువతి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి చెట్లమధ్య మాయమయింది.
మరి కొంత సేపటికి ఎదురుగా వున్న చిన్న కొండమీద ఆజానుబాహుడైన కోయ దొర విశ్వావసు ఎదురై, విద్యాపతికి చేతులెత్తి నమస్కరిస్తూ, "నీకు మా హృదయ పూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము." అన్నాడు గంభీరంగా.
విద్యాపతి ప్రతినమస్కారం చేస్తూ, "ఇంద్రద్యుమ్న మహారాజు పంపగా ఒక దైవకార్యార్థం నేను ఇటు వచ్చాను." అన్నాడు.
విద్యాపతిని గౌరవమర్యాదలతో తమ గూడానికి తీసుకుపోయి, అతనికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు విశ్వావసు. ఇంతలో, విద్యాపతి గొప్ప పండితుడని గ్రహించి, ఆయన పరమానందం చెందాడు. కొన్నాళ్ళు అక్కడే వుండి, వేదాంత రహస్యాలు తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు!
విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు. అక్కడే కొంతకాలం వుండాలన్న భావం అతని మనసులో ఏర్పడింది. విద్యాపతి, శృతుల నుంచీ, స్మృతుల నుంచీ శ్లోకాలు చెబుతూ, వాటి అర్థతాత్పర్యాలను ఉదాహరణలతో వివరించసాగాడు. ఆయన వివరణలను విశ్వావసు, లలిత చాలా ఆసక్తిగా విన్నారు.
ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపడం విద్యాపతి గమనించాడు. కాని, తాను సాధించాలని బయలు దేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది. అందువల్ల అతడు దాని మీదే మనసు లగ్నం చేసి, తరచూ భగవధ్యానంలో గడిపేవాడు!
ఉన్నట్టుండి విద్యాపతికి జబ్బు చేసింది. ఆ సమయంలో లలిత, దగ్గరే వుండి పరిచర్యలు చేసింది. ఒకరికొకరు సన్నిహితులయ్యారు. ఆ సమయంలో, లలిత మాత్రమే కాదు; తను కూడా ఆమెను అభిమానిస్తున్నట్టు విద్యాపతి గ్రహించాడు. ఇరువురికీ వివాహం జరిపించాలని విశ్వావసు ఆశించాడు. అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు.
వసంతరుతువు రాకతో ప్రకృతి పచ్చదనంతోనూ, రకరకాల పువ్వులతోనూ నిండిపోయింది. కోయిల పాటలు, కోయ యువతులు ఆటపాటల మధ్య లలితా, విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది !
సంతోషంగా కొన్నాళ్లు గడిచిపోయాయి. లలితను పెళ్ళాడినందుకు విద్యాపతి సంతోషించినప్పటికీ, తను రాజధాని నుంచి వచ్చిన దైవకార్యం ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని అనుక్షణం వేధించసాగింది !
ఈ సమయంలో అతడొక విషయం గమనించాడు. విశ్వావసు రోజు తప్పకుండా వేకువజామున నిద్రలేచి, ఎక్కడికో వెళ్ళి, సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు. గాలీ, వానా, తుఫాను ఏది వచ్చినా అతడు వెళ్ళడం మానడం లేదు. విశ్వావసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు. విశ్వావసు అలా ఎక్కడికి వెళ్ళివస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి ఎక్కువయింది. లలితను అడిగాడు.
"అది మా వంశానికి సంబంధించిన రహస్యం. దానినెవరికీ చెప్పకూడదు. అయినా, భర్తవైన నీ నుంచి ఎటువంటి రహస్యాలూ దాచలేకుండా వున్నాను. ఇక్కడికి సమీపంలో ఒక గుహ వున్నది. ఆ గుహలోపల, తరతరాలుగా మా పెద్దలు పూజిస్తూన్న దేవుడున్నాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికే మా తండ్రి రోజు తప్పకుండా వెళ్ళివస్తాడు. మా తండ్రిలాగానే, మా తాత ముత్తాతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెబుతారు. అన్నది లలిత.
"నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది!" అన్నాడు విద్యాపతి ఉత్సాహంగా.
"ఆ దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి. అలాంటప్పుడు చూడడమంటే ఇంకేమైనా వుందా? దయచేసి ఆ కోరికను వదులుకోండి," అన్నది లలిత ప్రాథేయ పడే ధోరణిలో.
"నిన్ను పెళ్ళాడిన తరువాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా?'' అని అడిగాడు విద్యాపతి బాధగా.
లలిత కొంతసేపు మౌనం వహించి, "సరే, నిన్ను ఆ గుహ దగ్గరికి తీసుకు వెళ్ళి, దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను. నిశ్చింతగా వుండు!" అని చెప్పింది లలిత !