2. శిలాప్రతిమ అపహరణ | శ్రీ జగన్నాధ చరిత్ర

writer
0
ఆ రోజు రాత్రి లలిత, గుహలోని దేవుణ్ణి చూడాలన్న తన భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. 

విశ్వావసు కోపంగా ఆమెకేసి చూశాడు. కాని, ఏమీ మాట్లాడలేదు.

కొంతసేపు మౌనం వహించి, లలిత, "నాన్నా, నేను మీకు ఏకైక సంతానం కదా ? మీ అనంతరం మీరు ఆరాధిస్తూన్న దేవుణ్ణి ఎవరు పూజించ గలరు? ఆ బాధ్యత మీ అల్లుడయిన విద్యాపతికి ఉన్నదికదా ? అలాంటప్పుడు, ఆ దేవుణ్ణి ఆయనకు చూపడంలో తప్పేమిటి ?" అని అడిగింది.

"నీ భర్త విద్యాపతి, ఈ అడవిలో మనతో శాశ్వతంగా వుండి పోగలడంటావా తల్లీ?" అని అడిగాడు, విశ్వావసు నెమ్మదిగా.

"మీరు ఆయన్ను మీ కుమారుడిలా అనురాగంతో చూసుకుంటే, ఉండక ఎక్కడికి పోతాడు ? " అని సమాధాన మిచ్చింది లలిత.

"విద్యాపతి మనకు భిన్నమైన వాతావరణానికి, ఆచార సంప్రదాయాలకూ, సంస్కృతికీ అలవాటుపడినవాడు. అయినా, నీ కోసం అతని కోరిక తీరుస్తాను." అంటూ విశ్వావసు ఆప్యాయంగా కుమార్తె తల నిమిరాడు.

తాను, దేవుణ్ణి పూజించే బాధ్యతను వేరొకరికి అప్పగించేప్పుడు మాత్రమే, ఆ గుహకు వెళ్ళే మార్గాన్ని చూపాలన్న నియమాన్ని మాత్రం అతిక్రమించలేనన్నాడు, విశ్వావసు.

అందువల్ల, కళ్ళకు గుడ్డ కట్టుకుని ఆయన వెంట వెళ్ళడానికి విద్యాపతి అంగీకరించాడు !

మరునాడు యధాప్రకారం సూర్యోదయానికి ఒక గంట ముందే, విశ్వావసు నిద్రలేచి సిద్ధమై, విద్యాపతి కళ్ళకు నల్లగుడ్డను కట్టి, అతని కుడిచేయి పట్టుకుని నడిపిస్తూ తిన్నగా గుహకు బయలు దేరాడు.

అయితే, విద్యాపతి ఎవరికీ తెలియకుండా, ఎడమ చేతిలో గుప్పెడు ఆవాలు తీసుకుని, దారి పొడవునా జారవిడుస్తూ, విశ్వావసు వెంటనడిచాడు.

"నాయనా, మనం గుహను సమీపించాము. తలను కొంచెం కిందికి దించు; గుహలో ప్రవేశించాలి." అంటూ విశ్వావసు అతని కళ్ళకు కట్టిన గుడ్డను మెల్లగా విప్పాడు.

విద్యాపతి నిదానంగా కళ్ళు తెరిచాడు. గాఢాంధకారం అలముకొని ఉన్నది. క్రమంగా అతని దృష్టి గుహ లోపల వున్న ఒక పెద్ద రాతిపీఠం మీద పడింది. విశ్వావసు ఆ పీఠంమీద కొన్ని పువ్వులు ఉంచాడు.

హఠాత్తుగా అక్కడ మెరుపులా నీలవర్ణ ప్రకాశం మెరిసింది. ఒక్క క్షణంలో విద్యాపతికి వేణువును ఊదుతూ వున్న శ్రీకృష్ణ రూప దర్శనం అయింది. ఆనందాశ్చర్యాలతో 'ఆహాఁ" అని అరిచాడు విద్యాపతి !

“ఏమయింది నాయనా?" అని విశ్వావసు విద్యాపతి వెన్ను చరిచాడు.

ఆ మాటలతో స్పృహలోకి వచ్చాడు. విద్యాపతి.

అతడు మౌనంగా తల వంచుకున్నాడు. తాను ఆశ్చర్యంతో కేక పెట్టిన కారణం చెప్పడానికి విద్యాపతి సుముఖంగా లేడని విశ్వావసు పసిగట్టాడు. అందువల్ల ఆ విషయం గురించి మళ్ళీ ఆయన అడగలేదు. అతణ్ణి గుహ దగ్గరికి తీసుకు వచ్చిన విధంగానే, మళ్ళీ కళ్ళకు గుడ్డ కట్టి, నడిపించుకుంటూ, గూడెం కేసి బయలుదేరాడు.

వారి రాకకోసం ఎదురు చూస్తూన్న లలిత, "గుహలోపల ఏం చూశారేమిటి ?'' అడిగింది భర్తను ఎంతో ఉత్సా అని హంగా.

"చీకటి గుహలోపల ఏం అద్భుతం వుంటుంది. చెప్పుకోతగిందేమీ అక్కడ కనిపించలేదు." అన్నాడు విద్యాపతి గంభీరంగా.

తాను గుహలోపల చూసిన అద్భుత దృశ్యాన్ని, భార్య లలితకు చెప్పడానికి కూడా విద్యాపతి సంశయించాడు. అయితే, ఈ రహస్యాన్ని తనలో దాచుకోవడానికి అతడు ఎంతో శ్రమపడ్డాడు. ఇలాంటి సంకట పరిస్థితి అతనికి ఇంతకు ముందెన్నడూ ఏర్పడలేదు.

ఇంద్రద్యుమ్న మహారాజు దైవప్రేరణతో, భావితరాల క్షేమం కోసం ఒక మహాకార్యాన్ని నెరవేర్చడానికి దీక్షబూని, ఎంతో నమ్మకంతో ఒక గొప్పకార్యాన్ని తనకు అప్పగించాడు. రాజు ఆనతి ప్రకారం, దైవకార్యం నిర్వర్తించడానికి వచ్చి, తను మార్గమధ్యంలో లలితను చూసి పెళ్ళాడాడు. అందువల్ల, లలితకు రహస్యం తెలియజేయడం కన్నా. తను వచ్చిన కార్యం పూర్తి చేయడమే ప్రధాన కర్తవ్యంగా భావించాడు విద్యాపతి.

అయితే, రహస్యాన్ని లలిత నుంచి దాచినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. విశ్వావసు పూజిస్తున్నది శ్రీ కృష్ణ రూపమని అతడు గ్రహించాడు. తను వచ్చిన పని సఫలం కావాలంటే, విశ్వావసు పూజిస్తూన్న శిలారూపాన్ని తీసుకుని రాజధానీ నగరం చేరుకోవాలి ! అలా చేయడం, తనను ఆదరించి ఆప్యాయత చూపేవారి నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది. నమ్మకద్రోహానికి పాల్పడడం ధర్మమా ?

అయినా, విశ్వావసు తనను ఎక్కడ నమ్మాడు? అసలు నమ్మి ఉన్నట్టయితే, కళ్ళకు గుడ్డకట్టి తనను తీసుకు పోతాడా ? అందువల్ల గుహ నుంచి దైవ రూపాన్ని తీసుకువెళ్ళడం నమ్మక ద్రోహం అవుతుందా?

ఇలా విద్యాపతి రకరకాలుగా ఆలోచించసాగాడు. ఇలాంటి ఆలోచనలతో పగలంతా పరధ్యానంగా గడిపేవాడు. రాత్రులలో కంటిమీదికి కునుకు వచ్చేది కాదు. అయినా ఏ సమస్యకుగాని, కేవలం వాదోపవాదాలే పరిష్కారాలు కావుకదా !

విద్యాపతిలో వచ్చిన మార్పును గమనించిన లలిత దిగులు చెందింది. తనను పెళ్ళాడినందుకు పశ్చాత్తాప పడుతున్నాడా ? నగరంలోని ఆడంబరాలు దూరమయ్యాయని విచారపడుతున్నాడా? అసలు విషయం తెలుసుకోవాలని, ఆమె ఒకనాడు విద్యాపతిని అడిగింది.

"నగరంలోని ఆడంబరాలు లేవని బాధపడటం లేదు. అయినా, రాజధాని లోని నా తల్లిదండ్రులను వదిలి వచ్చి చాలా కాలమయింది. నేనేమయ్యానో అని వాళ్ళు బెంగ పెట్టుకుని వుంటారు. త్వరగా వెళ్ళి, వృద్ధులయిన నా తల్లి దండ్రుల క్షేమం చూడవలసింది కన్న బిడ్డగా నా ధర్మం కాదా ? అయినా, నిన్ను ఇక్కడే వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు. కానీ, నిన్ను నా వెంట తీసుకు వెళ్ళానంటే అక్కడ వున్న వాళ్ళందరూ నిన్ను వింతగా చూస్తారేమో, అని అనుమానంగా ఉన్నది. పైగా నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న నీ తండ్రి నిన్ను వదిలి పుండగలడా?'' అన్నాడు విద్యాపతి.

“ఇప్పటిలాగానే మీరు నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నంతకాలం ఎవరే మనుకున్నా నాకు బాధ లేదు." అని, లలిత కొంతసేపు మౌనం వహించి ఆ తరవాత, “అయినా, నేను మీ వెంటవస్తే మా తండ్రినెవరు చూసుకుంటారు? అదే విచారంగా వుంది !" అన్నది కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ.

"అవును. ఎన్నటికీ మీ తండ్రిని వదిలి రాకూడదు. అందుకే. నువ్వు అనుమతించావంటే, నేను వెళ్ళి మా తల్లిదండ్రులను చూసి, త్వరలో ఇక్కడికి తిరిగి వస్తాను." అన్నాడు విద్యాపతి చిన్నగా నవ్వుతూ.

"నిజంగా మీరు తిరిగి రాగలరా?'' అని అడిగింది లలిత దిగులుగా.

"నేను నిన్ను వదిలి వుండగలనా?" అన్నాడు విద్యాపతి.

"అలా అయితే, నిశ్చింతగా వెళ్ళిరండి. మా అత్తమామల ఆశీస్సులు పొందే సుదినం కోసం నేను ఎదురు చూస్తున్నట్టు వారికి తెలియజేయండి." అన్నది లలిత.

లలిత భర్త కోరికను తండ్రికి తెలియజేసింది. విశ్వావసు కూడా అందుకు సమ్మతించి, విద్యాపతి కోసం అనేక కానుకలు సిద్ధం చేయసాగాడు. కాని విద్యాపతి అడ్డుపడి, “కానుకలు తీసుకు పోవడానికి ఇది సమయం కాదు. లలితను రాజధానికి వెంటబెట్టుకుని వెళ్ళేప్పుడు కానుకలతో వెళ్ళడం ఉచితంగా వుంటుంది. మొదట, మా వివాహం గురించి, మా తల్లి దండ్రులకు తెలియచేయాలి కదా?'' అన్నాడు విద్యాపతి,

అతని మాటలు విశ్వావసుకు సబబుగా తోచాయి. ఆయన అల్లుడి ప్రయాణానికి ఒక బలమైన గుర్రాన్ని ఏర్పాటు చేశాడు.

విశ్వావసు లలితల వద్ద సెలవు తీసుకుని, విద్యాపతి గుర్రం మీద రాజధానికి బయలుదేరాడు.

లలిత విద్యాపతికి కన్నీళ్ళతో వీడుకోలు పలికింది !

కొన్నాళ్ళక్రితం, విద్యాపతి రహస్యంగా జారవిడుస్తూ వెళ్ళిన ఆవగింజలు మొలకలెత్తి, స్పష్టంగా కనిపిస్తున్నవి. వాటిని అనుసరిస్తూ కొంతదూరం వెళ్ళాక అతడొక గుహను సమీపించాడు.

గుహ ముఖ ద్వారం వెలుపలికి కనిపించకుండా పెద్ద పెద్ద బండలు అడ్డదిడ్డంగా అమర్చబడి వున్నాయి.

విద్యాపతి గుర్రం పైనుంచి కిందికి దిగి, జాగ్రత్తగా గుహలోపలికి ప్రవేశించాడు. అక్కడ అతడు మరొకసారి అద్భుతమైన అనుభూతికి లోనయ్యాడు. “దేవా, నీ మీద భారం వేసి, ఉత్తమమని తోచిన నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను. అపరాధమయితే క్షమించి, రక్షించు.” అని మనసులో ప్రార్థిస్తూ, విశ్వావసు పువ్వులు ఉంచిన రాతిపీఠం మీది చిన్న శిలాప్రతిమను తీసుకుని కళ్ళకద్దుకుని సంచిలో వేసుకుని, విద్యాపతి వెలుపలికి వచ్చి, గుర్రమెక్కి, ఎటు పోవాలో మార్గం తెలియక పోయినప్పటికీ, ఆ భగవంతుడే దారి చూపగలడన్న దృఢ విశ్వాసంతో, గుర్రాన్ని ముందుకు అదిలించాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)