ఒకనాడు తెల్లవారుఝామున కృష్ణుడు సాత్యకినీ, ఉద్ధవుణ్ణి వెంటబెట్టుకుని సభకు బయలుదేర బోతూండగా, ఎవరో ఒక మనిషి అతని దర్శనార్ధమై వచ్చాడు. ద్వారపాలకుల వెంట వచ్చిన ఆ మనిషి, "దేవా, మగధదేశాన్ని పాలించే జరాసంధుడు ఇరవై వేల మంది రాజులను జయించి, చెరలో పెట్టి, నానా హింసలు పెడుతుతున్నాడు. వారందరూ నిన్ను శరణు వేడుతూ, నన్ను తమ ప్రతినిధిగా పంపారు. మేమందరమూ నీ ప్రజలమే గనక, మమ్మల్ని రక్షించేభారం నీదే," అన్నాడు.
అదే సమయంలో ఆకస్మికంగా నారదుడు వచ్చాడు. కృష్ణుడు నారదుడికి అతిథి మర్యాదలన్నీ చేసి, విశేషా లేమిటని అడిగాడు. అప్పుడు నారదుడు, " పాండ వాగ్రజుడైన ధర్మరాజు రాజ్యం సంపాదించ గోరి రాజసూయం తలపెట్టాడు. దానికి నీవే ఆధ్వర్యం వహించాలని కోరుతున్నాడు. నీ రాక కోసం రాజులందరూ ఎదురు చూస్తున్నారు,” అన్నాడు.
ఒక వంక జరాసంధుడి చేత చెర పెట్టబడిన రాజులు కృష్ణుడి సహాయం అర్థిస్తూ దూతను పంపారు. అదే సమయంలో ధర్మరాజు చేసే రాజసూయానికి అధ్వర్యుడుగా ఉండమని నారదుడి ద్వారా పిలుపు వచ్చింది.
మనం ఈ రెంటిలో ఏది ప్రథమ కర్తవ్యంగా భావించాలి?” అని కృష్ణుడు ఉద్ధవుణ్ణి సలహా అడిగాడు.
"జరాసంధుణ్ణి చంపటానికి వేరే పని పెట్టుకుని వెళ్ళవలిసిన పని ఉండదు. ఎందుచేతనంటే, ధర్మరాజు రాజసూయం చేసేటప్పుడు ఎలాగూ అనేకమంది రాజులను జయించవలసి ఉంటుంది. పనిలో పనిగా జరాసంధుడి సంగతి కూడా చూడవచ్చు. రాజసూయానికి వెళ్ళటమే మంచిది. ఆ విధంగా రెండు కార్యాలూ నెరవేరుతవి," అన్నాడు ఉద్ధవుడు.
ఉద్ధవుడు మరొక సంగతి కూడా గుర్తు చేశాడు : జరాసంధుడి పైకి సేనలతో వెళ్ళి గెలవటం సాధ్యం కాదు. బలంలో ఆ జరా సంధుడికి తుల్యుడైన ఏ భీముడో ద్వంద్వ యుద్ధంలో జయించవలిసిందే. మరో మార్గం లేదు.
ఉద్దవుడి సలహా కృష్ణుడికి నచ్చింది. అతను బలరాముడి అనుమతి పొంది, స్త్రీలతో సహా ఇంద్రప్రస్థానికి ప్రయాణ సన్నాహాలు సాగించమని దారుకుడు మొదలైన వారికి ఉ త్తరువిచ్చాడు. కృష్ణుడు చతురంగ బలాలనూ, పల్లకీలలో రుక్మిణీ, సత్యభామా మొదలైన స్త్రీ జనాన్నీ వెంట పెట్టుకుని అట్టహాసంగా తరలి వెళ్ళాడు. బయలుదేరే ముందు నారదుణ్ణి పంపేసి, తన వద్దకు వచ్చిన దూతతో, "మీ రాజులను భయపడవద్దని చెప్పు. నేను తప్పకు జరాసంధుణ్ణి చంపించి, మీ రాజులకు స్వేచ్ఛ ఇస్తాను." అని అతన్ని కూడా సాగనంపాడు.
కృష్ణుడు వస్తున్న వార్త విని ధర్మరాజు ఎదురు వెళ్ళి, ఆనందబాష్పాలు కారుస్తూ కృష్ణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.
కృష్ణుడు పాండవులను తగిన విధంగా పరామర్శించి, జెండాలతోనూ, తోరణాలతోనూ, అరటి చెట్లతోనూ అలంకరించిన వీధుల వెంబడి ఇంద్రప్రస్థం ప్రవేశించాడు. కృష్ణుణ్ణి చూడటానికి పౌరులు వీధుల వెంబడీ, మిద్దెల మీదా గుమికూడారు.
ధర్మరాజు ఇంట కృష్ణుడు కుంతినీ ఆమె కోడళ్ళనూ చూశాడు.
పాండవులకు కృష్ణుడు ఎంతో అప్తుడు. కృష్ణార్జునులు స్నేహం లోకోత్తరమైనది. అర్జునుడు ఖాండవదహనం చేయించినప్పుడు 'కృష్ణుడు స్వయంగా అతనికి సారధ్యం చేశాడు; అతనికి దివ్యమైన రథమూ, గుర్రాలూ, అక్షయతూణీరాలూ ఇప్పించాడు; మయుడి చేత మయసభ నిర్మింపజేసి పెట్టాడు. అందుచేత ధర్మరాజు చాలాకాలం పాటు కృష్ణుణ్ణి సపరివారంగా తన వద్ద ఉంచుకుని, చివరకు ఒకనాడు, తాను తలపెట్టిన రాజసూయం గురించి నిండుసభలో కృష్ణుడితో ప్రస్తావించాడు.
కృష్ణుడు ధర్మరాజును అభినందిస్తూ, " నువు రాజసూయం చెయ్యటానికి ఆక్షేపణ ఏమున్నది? దిగ్విజయం చెయ్యటానికి దిక్పాలకుల వంటి నీ తమ్ములున్నారు. వాళ్ళు నీకు నాలుగుదిక్కులూ గెలిచిపెట్టగలరు,” అన్నాడు.
ఆ మాట విని ధర్మరాజు చాలా సంతో షించి, నలుగురు తమ్ములనూ నాలుగు దిక్కులూ జయించి రావటానికి పంపాడు. సహదేవుడు దక్షిణానికీ, నకులుడు పడమరకూ, అర్జునుడు ఉత్తరానికి, భీముడు తూర్పుకూ వెళ్ళి ఆయా దిక్కుల గల రాజులను గెలిచి, రాజసూయం కొనసాగించటానికి అంతులేని ధనాలను తెచ్చి ధర్మరాజు కిచ్చారు.
రాజులందరూ ఓడారు గాని, జరాసంధుడు ఓడలేదు. ఇది ధర్మరాజుకు విచార కారణ మయింది. అది చూసి కృష్ణుడు, "జరాసంధుడి విషయం దిగులుపెట్టుకో వద్దు. అతన్ని జయించే ఉపాయం నేనిక్కడికి బయలుదేరే ముందే ఉద్దవుడు చెప్పాడు. ఆ పని నేను నెరవేరుస్తాను,” అన్నాడు.
అతను భీముణ్ణి, అర్జునుణ్ణి వెంటబెట్టుకుని, జరాసంధుడి రాజధాని అయిన గిరిప్రజపురం వెళ్ళాడు. అక్కడ ముగ్గురూ బ్రాహ్మణ వేషాలు ధరించారు. జరాసంధుడు రోజూ బ్రాహ్మణ పూజ చేస్తాడు. అతను ఆ పనిలో నిమగ్నుడయి ఉండే సమయంలో వీళ్ళు అతని వద్దకు వెళ్ళి, "మేం దూరదేశం నుంచి వచ్చిన అతిథులం. మేము కోరినది ఇయ్యి," అన్నారు.
జరాసంధుడు వాళ్ళను శ్రద్ధగా చూశాడు. ఆ ముగ్గురి ఆకారాలూ, కంఠ స్వరాలూ పరిచితమైనవిగానే వున్నాయి. వాళ్ళ ముంజేతులు కాయలుగాచి ధనుర్బాణాలు ఉపయోగించే రాజుల కున్నట్టుగా ఉన్నాయి. వాళ్ళు నిస్సందేహంగా బ్రాహ్మణవేషాలు ధరించిన క్షత్రియులే!
అయినా జరాసంధుడు వాళ్ళ కోరిక తీర్చటానికే నిశ్చయించుకుని, "మీకేం కావాలి?” అని అడిగాడు.
"మాకు కావలసింది నీతో ద్వంద్వ యుద్ధం. ఇతను భీముడు. ఇతను అతని తమ్ముడు అర్జునుడు. నేను నీ పగవాణ్ణి, కృష్ణుణ్ణి,” అన్నాడు కృష్ణుడు.
ఈ మాటలు విని జరాసంధుడు నిర్లక్ష్యంగా నవ్వి, "అలా అయితే ద్వంద్వ యుద్ధం చేస్తాను. కాని నీతో చెయ్యను. నన్ను చూసి మధుర నుంచి పారిపోయి, సముద్రంలో దాక్కున్న పిరికిపందవు! ఈ అర్జునుడి తోనూ యుద్ధం చెయ్యను. ఇతను నా కన్న చిన్నవాడు. అదీగాక బలంలో అతను నాకు చాలడు. నాతో భీముడు సమానుడు. అతనితో ద్వంద్వ యుద్ధం చేస్తాను,” అన్నాడు.
జరాసంధుడు ఒక ఉద్దండమైన గదను భీముడి కిచ్చి, అలాంటిదే తాను కూడా తీసుకున్నాడు. కృష్ణార్జునులతో సహా వారిద్దరూ నగరం దాటి యుద్ధభూమికి వెళ్ళారు. అక్కడ భీమ జరాసంధులు గదా యుద్ధం ప్రారంభించారు. ఒకరిదెబ్బలు ఒకరు తప్పుకుంటూ, అవకాశం దొరికినప్పుడు ఒకరి నొకరు గదలతో మోదుకుంటూ ఇద్దరూ రెండు మదించిన ఏనుగుల్లాగా పోరాడారు. చివరకు ఇద్దరి గదలూ విరిగి పోయాయి. అప్పుడు వారు ముష్టియుద్ధం సాగించారు.
జరాసంధుడు పుట్టినప్పుడు రెండు చీలి కలై పుట్టాడు. జర అనే పిశాచి ఆ రెండు చీలికలనూ కలిపింది. అందుచేత అతనికి జరాసంధుడనే పేరువచ్చింది. ఈ సంగతి కృష్ణుడు ఎరుగును. అతన్ని చంపటానికి కూడా రెండుగా చీల్చటమే మార్గమని భీముడికి తెలియ జెప్పటానికై, కృష్ణుడు ఒక పుల్ల తీసుకుని రెండుగా చీల్చాడు. ఈ సంకేతం భీముడికి అర్ధమయింది. భీముడు జరాసంధుణ్ణి కింద పడదోసి, ఒక కాలిని తన కాలితో తొక్కి పెట్టి, రెండోకాలు పట్టుకుని జరాసంధుణ్ణి నిలువుగా చీల్చాడు.
యుద్ధాన్ని చూడవచ్చిన జనులు రెండు చీలికలైపోయిన జరాసంధుణ్ణి చూసి హాహాకారాలు చేశారు.
కృష్ణార్జునులు భీముణ్ణి కౌగలించుకుని, అభినందించారు.
జరాసంధుడు చచ్చిన మీదట కృష్ణుడు జరాసంధుడి కొడుకైన సహదేవుణ్ణి మగధ రాజ్యానికి రాజుగా అభిషేకించి, సంధుడు చెరపెట్టిన రాజులందరినీ విడిపించాడు. కృష్ణుడు చెప్పిన మీదట సహదేవుడు ఆ రాజులందరికీ స్నానపానాలు ఏర్పాటు చేసి, మంచి కానుకలిచ్చి సత్కరించి, వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపేశాడు.
కృష్ణుడు భీమార్జునులను వెంట బెట్టుకుని ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి, జరాసంధుడి మరణవార్త ధర్మరాజుకు చెప్పాడు. తన కోరిక సిద్ధించినందుకు ధర్మరాజు సంతోషించి, కృష్ణుణ్ణి రకరకాల స్తోత్రం చేశాడు.
తరవాత ధర్మరాజు రాజసూయ యాగం ఆరంభించాడు. దానికి ఋత్విక్కులు కృష్ణ ద్వైపాయనుడూ, భరద్వాజుడూ, వసిష్ఠుడూ, విశ్వామిత్రుడూ, గౌతముడూ మొదలు గాగలవారు అనేకమంది వచ్చారు.
యాగానికి ధర్మరాజు భీష్ముణ్ణి, ధృతరాష్త్రుణ్ణి, ఆయన కొడుకులనూ, ద్రోణుడూ, కృపుడూ, విదురుడూ మొదలైన వారినీ పిలిపించాడు. అనేకమంది రాజులూ, నాలుగు కులాలవారూ కూడా వచ్చారు.
బంగారు నాగళ్ళతో యజ్ఞభూమి దున్ని, వేదిక మొదలైనవి ఏర్పాటు చేసి, ఋత్విక్కులు ధర్మరాజు చేత యజ్ఞ దీక్ష ధరింపజేశారు. రాజసూయం చాలా వైభవంగా జరిగింది. యజ్ఞకర్త సదస్యులనూ, యాజకులనూ సత్కరించవలసిన రోజు వచ్చింది. ఆ రోజు ధర్మరాజు సదస్యులను, "తమ అందరిలోనూ ప్రధమ పూజార్హుడెవరో నిర్ణయించండి," అని అడిగాడు.
కాని ఆ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఎందుచేతనంటే సభలో ఎందరో మహాత్ములున్నారు. అందరూ నోళ్ళు కట్టుపడి ఉన్న సమయంలో సహ దేవుడు, సభను ఉద్దేశించి, "దీని కింత ఆలోచన దేనికి ? భగవంతుడైన కృష్ణుడే ప్రధమ పూజార్హుడు. అతన్ని పూజిస్తే సర్వ భూతాలనూ పూజించినట్టే, " అన్నాడు.
సహదేవు డన్న ఈ మాటకు సభాసదులందరూ తమ ఆమోదం తెలిపారు. ధర్మరాజు వెంటనే కృష్ణుడి కాళ్ళు కడిగి, అతనికి పచ్చని పట్టుబట్టలూ, ఆభరణాలూ పెట్టాడు. మిగిలిన రాజులందరూ కృష్ణుడికి నమస్కారాలు చేశారు.
కాని ఇదంతా దమఘోషుడి కొడుకైన శిశుపాలుడికి కొంచెం కూడా నచ్చలేదు. అతను చివాలున లేచి నిలబడి, చెయ్యెత్తి, "కాల ప్రభావం కాకపోతే ఆ కుర్రకుంక చెప్పటమేమిటి, మీరంతా అవుననటమేమిటి? ఇంతమంది మేటి తపస్వులున్న ఈ సభలో, కులపాంసనుడైన ఈ గొల్లవాడికి ప్రథమ పూజ చేయవచ్చునా? యయాతి శాపం పొందిన యాదవులు పరమ హీనులు గద?" అంటూ పేలాడు.
కృష్ణుడు చలించలేదు. కాని మిగిలిన వారిలో కొందరు చెవులు మూసుకుని సభ నుంచి లేచిపోయారు. మరి కొందరు శిశుపాలుడితో యుద్ధానికి తలపడ్డారు. కృష్ణుడు వారినందరినీ వారించి, తన సుదర్శన చక్రం ప్రయోగించి, శిశుపాలుడి తల నరికేశాడు. గగ్గోలు పుట్టింది. శిశుపాలుడి పక్షం వారంతా పారిపోయారు.
ధర్మరాజు. అందరికీ సక్రమంగా దానాలు చేసి, అవభృత స్నానం చేసి యజ్ఞం పరిసమాప్తి చేశాడు.
రాజసూయం చూడటానికి వచ్చిన రాజులందరూ వెళ్ళిపోయాక కూడా, ధర్మరాజు కోరికపై కృష్ణుడు ఉండిపోయాడు.
ఈలోపల దుర్యోధనుడు అసూయతో కుమిలి పోసాగాడు. ఎందుకంటే, ధర్మరాజు విభవాన్ని తాను కళ్ళారా చూశాడు. రాజసూయం మహా గొప్పగా జరిగింది. మయుడు ధర్మరాజుకు అద్భుతమైన సభ నిర్మించాడు. ఆ సభలో పాండవులకు ఎక్కడెక్కడి రాజులూ కైంకర్యం చేశారు. అందులో కృష్ణుడి భార్యలు విహారాలు చేశారు. ఆ సభలోనే దుర్యోధనుడు పరాభవం కూడా పొందాడు. అందులో ఎక్కడ నీరున్నది, ఎక్కడ నేల ఉన్నదీ సరిగా తెలియరాలేదు. దుర్యోధనుడు నీరులేని చోట బట్టలు పైకి తీసుకున్నాడు; నీరున్న చోట బట్టలు తడిసేలాగ దిగబడ్డాడు. కృష్ణుడు నవ్వాడు. అది చూసి అందరూ, స్త్రీలతో సహా నవ్వారు. ధర్మరాజు నవ్వ వద్దని వారించాడుగాని, ఎవరూ లక్ష్య పెట్టలేదు. పుట్టెడు అవమానం పొంది దుర్యో ధనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.