విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక, అరణ్యం దాటి పచ్చటి మైదానాలను చేరుకున్నాడు. తను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ, చిన్న కొలను గట్టున దిగి, ఒక బండపై కూర్చుని, లలిత కట్టి పంపిన మూట విప్పి, అన్నం తిని చెట్టు కింద కొంత సేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత అరణ్యం కేసి ఒకసారి తిరిగిచూసి, విశ్వావసుకూ, లలితకూ మనసులో క్షమాపణలు చెప్పుకుని, మళ్ళీ గుర్రమెక్కి రాజధానీ నగరం కేసి బయలుదేరాడు.
సాయంకాలానికి అతడు రాజధానీ నగరం చేరుకుని తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళాడు. విద్యాపతిని దూరం నుంచే చూసిన ఒక అధికారి, అతని రాకను రాజుకు ముందుగానే తెలిపాడు. రాజు పరమానందంతో ఎదురువచ్చి, "నీ రాక కోసం ప్రతిక్షణం ఎదురుచూస్తున్నాను. వెళ్ళిన కార్యం జయప్రదమయింది కదా !" అని అడిగాడు.
"నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య ప్రతిమను తెచ్చాననే భావిస్తున్నాను. అయినా...." అని ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు విద్యాపతి.
"సంకోచం లేకుండా చెప్పు నాయనా. జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే అవరోధాలూ, ఆటంకాలూ తప్పవు. ఈ మహాకార్యం సాధించడానికి నీకు ఎదురైన సమస్య ఏమిటి? చెప్పు, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను." అన్నాడు రాజు.
“నా బాధను ఎవరూ తీర్చలేరు ప్రభూ. నేను అన్వేషిస్తూ వెళ్ళిన దివ్య వస్తువును దొంగిలించుకుని వచ్చాను. అదీ, నన్నెంతగానో ఆదరించి, తన ఏకైక కుమార్తె నిచ్చి వివాహం చేసిన పుణ్య మూర్తికి తెలియకుండా ఆ వస్తువును తెచ్చాను. నేను చేసిన దుష్కృత్యం రేపు వేకువజామునే వారి దృష్టికి రాగలదు. అప్పుడు వాళ్ళెంతగా తల్లడిల్లిపోతారో అని విచారంగా వున్నది!" అన్నాడు విద్యాపతి.
"నువ్వీక్షణం నుంచే ఇలాంటి ఆలోచ నలను వదిలిపెట్టాలి. ఎందుకంటే, మన
దేవాలయ నిర్మాణానికి దూరతీరాలనుంచి వచ్చిన వేలాదిమంది శిల్పులు, రేయింబవళ్ళు తమ శ్రమను ధారపోశారు. మనమూ దీనికెంతో ధనం వెచ్చించాము, పాటుపడ్డాము. లోకక్షేమం కోసం ఈ దైవకార్యం పూర్తికావడానికి ఇంకొకరు వేరొకదాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకు బాధపడవలసిన అవసరం లేదు! పైగా, సముద్రంలో ఒక దుంగ కొట్టుకువస్తున్నట్టు, నాకు కలద్వారా దివ్య సందేశం అందింది. ఆ దుంగతో దైవరూపాన్ని చెక్కి, దాని లోపల నువ్వు తెచ్చిన దివ్యప్రతిమను భ ద్ర ప ర చి ఆలయంలో ప్రతిష్ఠిద్దాం. దానిని దర్శించ డానికి, నీకు ఆతిథ్యమిచ్చిన ఆ మహాను భావుడు కూడా ఆనందించగలడు ?" అంటూ రాజు విద్యాపతిని ఓదార్చాడు.
మరునాడు సూర్యోదయానికి ఒక గంట ముందే విద్యాపతితో సహా రాజు, తన పరివారంతో బయలుదేరి సముద్రతీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయ సమయానికి, "అదిగో కనిపిస్తున్నది కదా ! అలల మీద తేలుతూ వస్తున్నది చూడండి.!" అని అన్నాడు రాజు పట్టరాని ఉత్సాహంతో.
అవునవును, కనిపిస్తున్నది గుండ్రటి పొడవాటి దుంగ ! అన్నారు మంత్రితో సహా అక్కడివారందరూ.
మరుక్షణమే, అక్కడే సిద్ధంగా వున్న పది పడవలు, సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలలోని మనుషులు దుంగను సమీపించి దానిని తీరం కేసి నెట్టడానికి ప్రయత్నించారు. కాని, అది కదలలేదు. ఆశ్చర్యంతో, కొందరు ఈతగాళ్ళు పడవలనుంచి నీళ్ళలోకి దూరి దుంగను ముందుకు తోశారు. కాని, అది ఏమాత్రం కదలలేదు. పడవలతో నెట్టి చూశారు. ప్రయోజనం కనిపించలేదు. దుంగకు తాళ్ళను బిగించి, పెద్ద పెద్ద పడవల నుంచి గట్టుకేసి లాగారు. దుంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు.
ఈ పరిస్థితిని చూసి రాజు విచారం చెందాడు. విద్యాపతికి గానీ, మంత్రులకు గానీ ఏమి చేయడానికీ తోచలేదు. అలలపై బెండులా తేలే దుంగ ఇలా కొండలాగా కదలకపోవడమేమిటి? దీనిని తీరానికి చేర్చకుండా వెనుదిరగడం లేదు — అన్న పట్టుదలతో రాజు అక్కడే వుండిపోయాడు.
సాయంకాలమై రాత్రి అయింది. బంగారు పల్లకీలో రాణి గుండిచాదేవి సముద్రతీరానికి వచ్చి రాజుతో, "ప్రభూ, తెల్లవారేవరకూ ఇక్కడే వుండి పోతారా!" అని అడిగింది.
"ఏమి చేయడానికి తోచడం లేదు రాణీ," అంటూ రాజు కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆలోచించి, "ఆపండి!" అన్నాడు సముద్రం కేసి చూస్తూ. ఆ తరవాత విద్యాపతిని దగ్గరికి పిలిచి, "దుంగ ఎందుకు కదలడం లేదో ఇప్పుడు నా కర్తమయింది. నువ్వు తీసుకువచ్చిన దివ్య ప్రతిమను, ఇంతకాలం అరణ్యంలో పూజిస్తూ వచ్చిన మహానుభావుడి వద్దకు నన్ను తీసుకుపో!" అన్నాడు.
విద్యాపతి దారి చూపగా, మంత్రి దండనాధులు వెంటరాగా రాజు, అరణ్య మధ్యంలోని కోయదొర విశ్వావసు గూడెం కేసి బయలుదేరాడు. మరునాడు మధ్యాన్నానికి వారు, కోయగూడేన్ని ఆనుకునివున్న కొండమీదికి చేరారు.
ఆ కోయగూడెం ఎప్పుడూ ప్రశాంతంగానే వుండేది. కాని, నిన్న ఉదయం నుంచి అది మరింత ప్రశాంతంగా, విషాదంతో నిండివున్నది. రోజూలాగే వేకువ జామున ఇల్లువదలి వెళ్ళిన విశ్వావసు కొంతసేపటికల్లా తిరిగి వచ్చి కూతురితో. "నీ భర్త ఎంతపని చేశాడు తల్లీ!" అని అంటూ వాకిట్లో పడి మూర్ఛపోయాడు. లలిత భయపడిపోయింది. బంధువులు విశ్వావసును ఇంటి లోపలికి చేర్చి ముఖం మీద నీళ్ళు చిలకరించారు. ఆయన మెల్లగా కళ్ళు తెరిచి, చుట్టుపక్కల కలయజూసి, మళ్ళీ బాధగా కళ్ళు మూసుకున్నాడు.
జరిగిన సంగతి లలితకు అర్థమయింది. తరతరాలుగా పూజిస్తూ వచ్చిన దివ్య ప్రతిమను విద్యాపతి అపహరించుకు పోవడం వల్లే తన తండ్రి ఇలా దిగ్భ్రాంతికి లోనై, శోకమూర్తి అయ్యాడని ఆమె గ్రహించింది. విద్యాపతి తననెంతగానో అభిమానించినప్పటికీ, అతడు అడవిలో తమతో గడపడానికి, అభిమానం ఒక్కటే -కారణం కాదనీ, మరేదో సాధించడానికే అతడు తమతో గడిపాడని ఆమె అనుకున్నది.
ఆ పగలూ, రాత్రీ విశ్వావసు మూసిన కళ్ళు తెరవలేదు. లలిత నిద్రాహారాలు మాని తండ్రి పక్కనే కూర్చున్నది. మర్నాడు వేకువజామున విశ్వావసు యధాప్రకారం గుహకేసి నడిచాడు. ఆయన వెంట లలిత, ఇతర బంధుగణం బయలుదేరారు. విశ్వావసు గుహ లోపలికి వెళ్ళి, రాతిపీఠాన్ని కౌగిలించుకుని విలపించసాగాడు. అందరూ ఎంత వేడుకున్నప్పటికి ఆయన అక్కడ నుంచి లేవడానికి ఒప్పుకోలేదు.
మధ్యాన్న సమయానికి, ఒక కోయ యువకుడు గుహకేసి పరిగెత్తుకుంటూ వచ్చి, “కొండపై నుంచి కొందరు మన గూడెం కేసి వస్తున్నారు. వాళ్ళలో రాజు కూడా ఉన్నాడు!" అని చెప్పాడు.
మరి కొంతసేపటికి మరొక యువకుడు పరిగెత్తుకువచ్చి, "వాళ్ళలో విద్యాపతి కూడా వున్నాడు!'' అని చెప్పాడు.
"ఆహాం, మనవద్ద వున్న దివ్య ప్రతిమను అపహరించుకు పోయినప్పటికీ తృప్తి కలుగలేదన్నమాట! ఇప్పుడు మనకున్నదంతా దోచుకుపోవడానికి వస్తున్నట్టుంది!" అన్నాడు ఒక మధ్యవయస్కుడు.
“కాదు, కాదు. వస్తున్న వారెవరివద్దా ఆయుధాలు లేవంటున్నారుకదా! మన దొరను పరామర్శించడానికే. రాజుగారు వస్తున్నారు !" అన్నాడు ఒక వృద్ధుడు.
విశ్వావసు లేచి గుహ నుంచి వెలుపలికి వచ్చి, చేతులు జోడించి నిలబడ్డాడు. రాజు వచ్చీ రాగానే ఆయన్ను అమాంతం కౌగిలించుకుని, "మహాత్మా, అసలు దొంగను నేను; నీ అల్లుడు కాదు. నన్ను క్షమించు," అన్నాడు.
విశ్వావసు కన్నీళ్ళు తుడుచుకుంటూ, రాజుకు, పక్కనే వున్న ఒక బండను చూపాడు. రాజు దాని మీద కూర్చుని, "విశ్వావసు, నేను చెప్పేదంతా దయతో విను." అంటూ, దైవప్రేరణతో తను పూరీ సముద్రతీరంలో ఆలయం నిర్మించిన విధమూ, ఆలయంలో ప్రతిష్ఠించడానికి విగ్రహం కోసం పండితులను పంపిన సంగతీ, విద్యాపతి చేసినపనీ వివరించి, "విశ్వావసూ, ఇన్ని తరాలుగా ఆ దేవుడు మీ వంశస్థుల పూజలందు కున్నాడు. ఇకమీదట భక్తులందరి పూజలూ అందుకోవాలన్నది భగవత్సంకల్పం. ఆ దివ్యప్రతిమను దుంగతో చేసే విగ్రహం లోపల భద్రపరుస్తున్నాము. అందుకు నీ అనుమతిని అర్థిస్తున్నాను." అన్నాడు. విశ్వావసు మౌనంగా తలాడించాడు. ఆ తరవాత రాజు మళ్ళీ, సముద్రం అలలపై తేలుతూన్న దుంగ, తీరం కేసి కదలకపోవడం గురించి చెప్పి. "భక్తుడయిన నీ అధ్వర్యంలోనే విగ్రహ ప్రతిష్ఠాపన జరగాలన్నది దైవసంకల్పం. కాబట్టి నువ్వు మా వెంట వచ్చి, దుంగను తాకి దైవకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి సాయపడాలి !" అన్నాడు.
విశ్వావసు కొంతసేపు మౌనం వహించి, "మీ ఆజ్ఞానుసారం మీ వెంట రావడానికి సిద్ధంగా వున్నాను." అన్నాడు.
రాజు పరమానందంతో ఆనంద బాష్పాలు రాలుస్తూ విశ్వావసును మళ్ళీ ఒకసారి కౌగిలించుకుని, పక్కనే వున్న లలిత కేసి తిరిగి, "తల్లీ, నీ భర్తను అపార్థం చేసుకోవద్దు. మహోన్నత కార్యం సాధించడానికే అతడు నీ నుంచి రహస్యాన్ని దాచాడు." అన్నాడు.
పక్కనే వున్న విద్యాపతి, ‘"నీకు తెలియ కుండా, నా కర్తవ్యం నెరవేర్చినందుకు నన్ను క్షమించు. త్వరలో వచ్చి నిన్ను రాజధానికి వెంటబెట్టుకుని వెళతాను, అంత వరకు ఓర్పు వహించు, "అన్నాడు లలితతో.
నీళ్ళునిండిన కళ్ళతో లలిత విద్యాపతిని చూసింది.
మరునాడు సాయంకాలానికి రాజు తన పరివారంతో సముద్రతీరం చేరుకున్నాడు. విశ్వావసు పడవపై సముద్రంలోకి వెళ్ళి దుంగను తాకాడు. మరుక్షణమే ఆ దుంగ అలలపై తేలుతూ తీరానికి చేరింది. రాజ భటులు దానిని రాజభవనానికి చేర్చారు.
తెల్లవారగానే రాజు, ఆస్థాన శిల్పులనూ, శిల్పాచార్యులనూ పిలిపించి, "ఈ దుంగతో ఏ దైవవిగ్రహం చెక్కితే మంచిది ? " అని అడిగాడు.
అందుకు శిల్పులు. "శిలలను దైవ విగ్రహాలుగా చెక్కడం మాకు తెలిసిన విద్య. అయితే, దుంగతో విగ్రహాలు రూపొందించడం అన్నది మాకు అనుభవం లేనిది !" అన్నారు వినయంగా.
సరిగ్గా ఆ సమయానికి అక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, “రాజా, మీరు నిర్మించిన ఆలయంలో అన్నా చెల్లెళ్ళయిన బలభద్ర, సుభద్రలతో కలిసి శ్రీ కృష్ణరూపంలో కొలువుతీరాలన్నది భగవత్సంకల్పం ! తమరు అనుమతించారంటే ఈ దుంగతో నేనా విగ్రహాలను రూపొందించగలను.
అయితే, ఒక విన్నపం. కావలసిన పని ముట్లతో ఈ దుంగతోపాటు నేను ఏకాంత స్థలంలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటాను. విగ్రహాల రూపకల్పన పూర్తయ్యాక నేనే తలుపులు తెరుచుకుని వస్తాను. ఈలోగా మధ్యలో ఎవరు గాని నన్ను పిలువకూడదు,'' అన్నాడు వృద్ధుడు.
"మరి మీ ఆహారం మాటేమిటి ?" అని అడిగాడు రాజు.
"పని పూర్తయ్యాక తీసుకుంటాను!" అన్నాడు వృద్ధుడు.
రాజు అందుకు అంగీకరించి, రాజ భవనంలోనే ఒక విశాలమైన గదిని వృద్ధ శిల్పికి ఏర్పాటు చేశాడు. వృద్ధుడు దుంగతో సహా ఆ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకున్నాడు. వెలుపలినుంచి తలుపుకు చెవి ఆనించి వింటే సుత్తి. ఉలి చప్పుళ్ళు వినిపించేవి. రాణి గుండిచాదేవి ఉత్సాహం కొద్దీ తరచూ అలా వినేది. కొన్నాళ్ళు గడిచింది. ఒకనాడు చప్పుడు వినిపించలేదు. మర్నాడు కూడా శబ్దం రాలేదు. అన్నపానీయాలు లేక వృద్ధుడికి ఏమయిందోనన్న అనుమానం కొద్దీ రాణి తలుపు తెరిచి చూసింది.
దీక్షతో విగ్రహాలు రూపొందిస్తూన్న శిల్పి, ఆమె కేసి తలెత్తిచూసి ఆ క్షణమే అంతర్థానమయ్యాడు. విగ్రహాలు అసం పూర్తిగా మిగిలిపోయాయి. దేవశిల్పి విశ్వకర్మ, వృద్ధశిల్పి రూపంలో వచ్చాడని అందరూ భావించారు. తను చేసిన పనికి రాణి బాధపడింది. కాని, అంతా దైవ నిర్ణయం అని భావించిన రాజు, విద్యాపతి తెచ్చిన దివ్యప్రతిమను కృష్ణవిగ్రహంలో రహస్యంగా భద్రపరచి, లోకకల్యాణం కాంక్షించి, కృష్ణవిగ్రహంతోపాటు బలభద్ర, సుభద్ర విగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించాడు. విద్యాపతి వంశస్థులను ఆలయ పూజారులుగా నియమించాడు. ఆనాటి నుంచి పూరీ శ్రీజగన్నాధ మందిరం మనదేశంలోని విష్ణు క్షేత్రాలలో ముఖ్యమైనదిగా వెలుగొందుతున్నది.