17. రుక్మిణి అపహరణం | Rukmini Apaharanam | Lord Krishna Avatar Story in Telugu

writer
0
రుక్మిణికి మర్నాడు జరగనున్న వివాహం గురించి చెప్పి నారదుడు వెళ్ళిపోగానే, కృష్ణుడు తన వారితో, "నారదమహాముని మన శ్రేయస్సు కోరి చెప్పిన మాటలు మీరంతా విన్నారు కద! ఇంక ఆలస్యం దేనికీ? పనికి ఉపక్రమించుదాం - వెంటనే బయలుదేరి కుండిన పురానికి పోదాం. మీ మీ వాహనాలనూ, సేనలను ఆయత్తం చేసుకోండి. బలగం బయలుదేరేటప్పుడు ముందు సాత్యకి, మధ్యలో బలరాముడూ, చివరలో ఉగ్రసేన మహారాజూ ఉండేటట్టు చూడండి. నేను దారకుణ్ణి వెంట తీసుకుని, సమస్తమైన ఆయుధాలతో సహా ముందు వెళ్ళి, ఆ శిశుపాలుడు, రుక్మి, జరాసంధుడూ మొదలైన వాళ్ళ సంగతి అంతు చూసి, రుక్మిణిని సంపాదించుకుంటాను." అన్నాడు.

ప్రయాణ దుందుభి మోగించారు. యాదవులందరూ ఆర్భాటంగా ప్రయాణ సన్నాహాలు చేశారు. కృష్ణుడు తృప్తిపడి, తనను తాను చక్కగా అలంకరించుకుని రథంలో బయలుదేరాడు.

అతను పెళ్ళికొడుకు లాగా, మహా వైభవంతో ప్రయాణం చేసి, విదర్భదేశం చేరి, కుండిన పురాన్ని చేరబోతూండగా, రుక్మిణి తండ్రి అయిన భీష్మకుడు ఎదురు వచ్చి, ఆదరించి, నగరం బయట ఉన్న విడిధికి తీసుకుపోయి, అతిథి మర్యాదలన్నీ చేశాడు. 

పెళ్ళికి వచ్చిన రాజులందరూ కృష్ణుణ్ణి చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారు.

"శిశుపాలుడు కృష్ణుడికి మేనత్త కొడుకేగా? అతని పెళ్ళిగదా అని చూడవచ్చి ఉంటాడు," అన్నారు కొందరు.

"అదంతా ఏమీ లేదులే. ఈ కృష్ణుడికి జరాసంధ శిశుపాలు అంటే ఏ మాత్రమూ పడదు. అటువంటి వాడు ఎందుకు వచ్చినట్టు?” అన్నారు మరి కొందరు.

"అన్నట్టు, ఆ రుక్మిణికి కృష్ణుడంటే చాలా ప్రేమ అని చెప్పుకున్నారే?” అన్నారు మరికొందరు.

యాదవులనందరినీ వెంట బెట్టుకుని కృష్ణుడు వచ్చాడని వినగానే రుక్మిణికి, వేసవి ఎండలకు తెగ కాలి ఉన్న భూమి మీద వర్షం పడినంతగా పరమానందమయింది. "నన్నీ కష్టాల నుంచి ఉద్ధరించటానికే కృష్ణుడు వచ్చాడు, అందుకు సందేహమేమీ లేదు. నా జన్మ నిజంగా తరించింది, నా కోరిక ఈడేరింది. అతన్ని ఎప్పుడు కళ్ళ చూస్తానో!" అనుకున్నదామె. 

ఆమె కృష్ణుణ్ణి గురించి రకరకాలుగా ఊహించుకో నారంభించింది; చెలికత్తెలతో అతని కథలు మళ్ళీ మళ్ళీ చెప్పింది; ఆమెలో ముందుండిన దైన్యమంతా పోయి కొత్త కళ వచ్చింది.

కృష్ణుడు కూడా మిగిలిన విషయాలేవీ పట్టించుకోక రుక్మిణిని గురించిన ఆలోచనలలో మునిగిపోయాడు. ఆమెను తాను ఎలా చూస్తాడు? ఆమెను ఎలా అపహరిస్తాడు? తనకు అడ్డుపడే శత్రువుల నందరినీ ఎలా ఎదుర్కుంటాడు? ఇంతకూ ఆమెకు తన మీద మనస్సున్నదని విన్న మాట నిజమో కాదో ఎలా తెలుసుకోవటం?

"ఏమైనా కానీ, ఆమె నా కేసి ఆపేక్షగా చూసిందో, దేవతలు అడ్డపడేదిగాక, ఆమెను తప్పక సంపాదిస్తాను,” అనుకున్నాడతను. 

తెల్లవారింది. తేనెటీగలు పద్మాల మీదికి ముసిరాయి. చక్రవాకాలకు గుడ్డి తనం పోయింది. హంసలు కొలనుల్లో విహరించసాగాయి. కలువలు ముడుచుకుపోయాయి. సూర్యోదయమయింది. కృష్ణుడు కాల కృత్యాలు తీర్చుకుని, చక్కగా అలంకరించుకుని, తన పరివారాన్ని వెంట బెట్టుకుని, విడిది నుంచి రథం మీద బయలు దేరాడు. రుక్మిణిని చూడాలన్న కోరిక అతన్ని తీవ్రంగా ఆవేశించింది.

రాజసౌథంలో రుక్మిణిని చెలికత్తెలు చక్కగా అలంకరించి ముస్తాబు చేశారు. అలంకరణ పూర్తి కాగానే ఆమె ఒక బంగారు పల్లకీలో ఎక్కి, చెలికత్తెలు వెంట రాగా, నగరం వెలపల ఉండే గౌరీదేవిని అర్చించి రావటానికి బయలుదేరింది. ఆమె ఆలయం దగ్గిర పల్లకి దిగి, లోపలికి చెలికత్తెల మధ్య నడిచి వెళ్ళి, దేవికి మొక్కి, "తల్లీ, నాకు కృష్ణుడే భర్త అయేటట్టు అనుగ్రహించు,” అని ప్రార్థించింది.

రుక్మిణి గౌరి ఆలయం నుంచి బయటికి వచ్చే సమయానికి కృష్ణుడు అక్కడికి వచ్చి, మొట్ట మొదటిసారిగా ఆమెను చూశాడు. ఆమె అప్పుడే పాలసముద్రం నుంచి పైకి వచ్చిన లక్ష్మిలాగా అతనికి కనబడింది. బ్రహ్మసృష్టిలో అంతటి సౌందర్య వతి మూడు లోకాలలో చూసినా ఉంటుందని అతనికి తోచలేదు. ఆమెను గురించి విన్నదానితో కలిగిన ఉద్రేకాన్ని ఎలాగో భరించాడు గాని, ఆమెను కళ్ళ ఎదట చూస్తూ ప్రేమోద్వేగాన్ని నిగ్రహించుకోవటం అతనికి సాధ్యంగా కనబడలేదు. 

రుక్మిణిని తన దాన్ని చేసుకోవటానికి తగిన చోటూ, సమయమూ దైవికంగా అతనికి కలిసి వచ్చాయి. ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకోవటం అవివేకం అని అతను తనలో అనుకున్నాడు.

ఇదే సమయంలో రుక్మిణి కూడా కృష్ణుణ్ణి మొదటిసారిగా చూసింది. అతనే కృష్ణుడని చెలికత్తె లామెకు చెప్పారు. ఆమె అతని కేసి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. ఇంతకాలమూ తాను విడవకుండా ధ్యానం చేస్తున్నవాడు అకస్మాత్తుగా తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమెకు అశ్చర్యమూ, కంపమూ, ఆనందమూ ఒకే సారిగా కలిగాయి. ఆమె కళ్ళు చల్లగా చెమ్మ గిల్లాయి. సమాధిస్థితిలోకి వెళ్ళి పోయిన యోగిలాగా ఆమె తనను తానే మరచిపోయింది. ఆమె అలా అయిపోవటం చూసి చెలిక త్తెలు భయపడ్డారు.

ఇంతలో బలరాముడు వచ్చి కృష్ణుణ్ణి కలుసుకున్నాడు. కృష్ణుడు తాను చేయదలచిన పనిని గురించి తన అన్నకు సంగ్ర హంగా చెప్పి, రుక్మిణిని అమాంతంగా కౌగలించుకుని, ఎత్తి తెచ్చి తన రథం మీద పెట్టాడు. రుక్మిణి చెలికత్తెలు కంగారు పడ్డారు. సమీపంలో ఉండే భటులు కృష్ణుడి మీదికి రాసాగారు. బలరాముడు చెట్టొకటి పీకి, మీదికి వచ్చే రథాలనూ, ఏనుగులనూ, గుర్రాలనూ, సైనికులనూ చావమోది, చెల్లా చెదరు చేశాడు.

ఈ ఆర్భాటం విని, ఉగ్రసేనుడూ, సాత్యకి, శతద్యుమ్నుడూ, విదూరథుడూ, ప్రసేనజిత్తు మొదలైన యదువృష్టి భోజాంధక వీరులు తమ తమ బలాలతో వచ్చి బలరాముడికి అండగా నిలబడి, కృష్ణుడితో, "నువ్వా పిల్లను తీసుకుని ద్వారకకు వెళ్ళిపో. ఇక్కడ ఉండే వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం,” అన్నారు.

వీరంతా యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే, రుక్మిణి అంగరక్షకులైన భటులలో చావగా మిగిలిన వాళ్ళు వెళ్ళి, రుక్మిణి అపహరణం గురించి భీష్మకుడికి, జరాసంధుడికి, శిశుపాలుడికి, వారి వెంట వచ్చిన రాజులకు తెలిపారు. అందరూ ఈ వార్త విని ఆశ్చర్యపడుతూ, "ఇంతమంది మహా యోధులిక్కడ ఉండగా కృష్ణుడింత పని చేశాడే! వాడి కెంత పొగరు, ఎంత సాహసం, ఎంత ధైర్యం!" అనుకున్నారు.

జరాసంధుడు కోపంతో దహించుకుపోతూ, కళ్ళ నిప్పులు రాల్చుతూ, "ఒక గొల్లవాడి కొడుకు మహా జగదేక వీరుడల్లే వచ్చి నా ప్రయత్నమంతా పాడు చేశాడు. నేను నా సేనతో సహా బయలుదేరి వెళ్ళి వాడి మీద దాడి చెయ్యబోతున్నాను. ఇష్టమైతే మీరు కూడా సహాయం రండి," అని మిగిలిన వారితో అన్నాడు. సముద్రమే కోటగా గల ద్వారకలో ప్రవేశించినా సరే, కృష్ణుణ్ణి అతడి బంధువుల నందరినీ హతమార్చి, ద్వారకను ధ్వంసం చేసి, రుక్మిణిని తెస్తానని ఆ జరాసంధుడు ప్రతిజ్ఞ చేశాడు.

పౌండ్రక వాసుదేవుడు జరాసంధుణ్ణి వారిస్తూ, "నీ భృత్యుణ్ణి నేనుండగా నీకెందుకు శ్రమ? నేను వెళ్ళి, ఆ కృష్ణుణ్ణి ముక్కలు ముక్కలుగా సరికి, అడవి పక్షులకు ఆహారంగా వేస్తాను. భూమి మీద ఇద్దరు వాసుదేవులెలా ఉంటారు? ఈ పొర పాటు సరి చెయ్యటానికి, నీకు ఆనందం చేకూర్చటానికి గొప్ప అవకాశం నాకు దొరి కింది. ఇంకేం కావాలి?" అన్నాడు.

అంతలోనే శిశుపాలుడొక పెద్ద పరిఘ చేత-బట్టి నిలబడి, అందరూ వినేటట్టుగా, "ఆగండి! ఎవరూ కదలవద్దు! ఈ అవమానం నాది. పెళ్ళి చేసుకుందామని ఉబలాటంతో వచ్చి చివర కిలా భంగపాటు పొందిన వాణ్ణి నేను. ఈ ఒక్క పరిఘతోనే ఆ కృష్ణుణ్ణి, మిగిలిన యాదవులనూ రూపుమాపి, జరాసంధుడి భృత్యుడుగా గొప్ప కీర్తి సంపాదించుకుంటాను. నిజంగా క్షత్రియుడైనవాడు మరొకడి భార్య కోసం ఇలా ఆశపడతాడా? ఈ యాదవ గోత్రీకుడు చాలా హీనుడై ఇలా చేశాడు. వాడు పెరిగినది వావివరసాలేని పశువుల మధ్య. అందుచేత, కృష్ణుణ్ణి చంపి రుక్మిణిని తీసుకురావటం నా పని,” అన్నాడు

తరవాత జరాసంధుడు మొదలైన రాజులందరూ, కవచాలు ధరించి, రథా లెక్కి, యుద్ధసన్నద్ధులయారు. అదే విధంగా సేనలన్నీ భేరీలూ, శంఖాలూ మొదలైన వాద్యాలు మోగించుకుంటూ అట్టహాసంగా బయలుదేరాయి. త్వరలోనే వారు, రథం మీద రుక్మిణిని తీసుకొని పోతున్న కృష్ణుణ్ణి, అతని వెనకగా పోతున్న యాదవ సేనలనూ చేర వచ్చారు.

బలరాముడు మొదలైన యాదవ వీరులు తమ సేనలను ఆపి, జరాసంధుడి బలాలతో యుద్ధం ప్రారంభించారు. యాదవ సేన చిన్నది, జరాసంధుడి సేనలు పెద్దవి. అయినా జరాసంధుడి సేనలోనే హెచ్చుగా రక్షపాతం జరిగింది. ఉభయ పక్షాల వీరులూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. సాత్యకి, జరాసంధుడూ మహా దారుణమైన యుద్ధం చేశారు. శక్రదేవుడూ, అక్రూరుడూ కలిసి దంతవక్త్రుడితో యుద్ధం చేశారు. శిశుపాలుడు ముగ్గురు యాదవ వీరులతో ఒకేసారి పోరాడాడు. కృతవర్మకూ పౌండ్రక వాసుదేవుడికీ యుద్ధం జరిగింది.

అందరికన్న బలరాముడు మహా భయం కరంగా శత్రునాశనం చేశాడు. అవతలి పక్షాన జరాసంధుడు కూడా చాలా దారుణంగా యుద్ధం చేశాడు. చివరకు బలరాముడే అతన్ని గదా యుద్ధంలో మూర్ఛపోగొట్టాడు. వెంటనే జరాసంధుణ్ణి అతని సారథి రథం మీద పెట్టుకుని, దూరంగా తీసుకుపోయాడు. అది చూసి సేనలు పలాయనం సాగించాయి. ఆ పారిపోయే వాళ్లను సాత్యకి మరింత తరిమాడు. సాత్యకి శంఖం పూరించటం విని కృష్ణుడు, జరాసంధుడు పారిపోయినట్టు గ్రహించి, తన పాంచజన్యాన్ని ఊదాడు.

కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోతున్నాడన్న వార్త విని జరాసంధుడు మొదలైన రాజులు తమ విడిది నుంచి సైన్యాలతో సహా బయలుదేరే సమయంలోనే, రాజభవనంలో ఉన్న రుక్మి కూడా ఆ వార్త విని, మండిపడి, యుద్ధంలో కృష్ణుణ్ణి చంపి, రుక్మిణిని తీసుకురాకుండా తిరిగి నగరంలో అడుగు పెట్టనని తన తండ్రి ఎదటా, బంధువులు ఎవటా శపథం చేసి, గదుడూ, కైశికుడూ మొదలైన యోధులనూ, సేనలనూ వెంటబెట్టుకుని, యుద్ధసన్నద్దుడై బయలుదేరాడు. అతనితో బాటు దక్షిణ దేశాల రాజులు కూడా ఉన్నారు.

వారికి కృష్ణుడి రధం నర్మదాతీరం వెంబడి ఒంటరిగా నడుస్తూ అంత దూరాన కనిపించింది. రుక్మి మిగిలిన వారందరినీ వెనకనే వదిలేసి, అతి వేగంగా తన రథాన్ని తోలించి, కృష్ణుడి రథానికి ఎదురు వెళ్ళి, "ఎక్కడికి పోతావురా, గొల్లవాడి కొడకా! ఇతరుడి భార్యను అపహరించే వాడా! నేను రుక్మిని! విదర్భరాజు కొడుకును! ప్రాణాలు దక్కించుకో దలిస్తే రుక్మిణిని తక్షణం వదిలెయ్యి, లేదా నాతో యుద్ధం చెయ్యి," అంటూ కృష్ణుడి పైన బాణవర్షం కురిపించాడు. కృష్ణుడు క్షణంలో అతని సారధిని చంపి, అతని శరీరం నిండా బాణాలు గుచ్చాడు.

రుక్కి దుస్థితి చూసి దక్షిణదేశపు రాజులు తమ మిత్రుణ్ణి కమ్ముకుని కృష్ణుడితో యుద్ధానికి పూనుకున్నారు. కృష్ణుడికీ, వారికీ మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. కొంత సేపటికి రుక్కి తిరిగి బలం తెచ్చుకుని, మరొక రధం మీద వచ్చి, కృష్ణుడిపై తలపడ్డాడు. 'కృష్ణుడు అతని రొమ్ము లో దిగే లాగు మూడు బాణాలు కొట్టి, రుక్మిని మూర్ఛపోగొట్టాడు. నేల మీద స్పృహ తప్పి పడిపోయిన అన్నను చూసి రుక్మిణి కృష్ణుడి రథం మీద కూలబడిపోయి, దుఃఖించసాగింది.

కృష్ణుడు రుక్మిణిని కౌగలించుకుని, ఓదార్చి, రుక్మిని ఏమీ చేయనని అభయ మిచ్చి, రథాన్ని తిరిగి వెనక్కు తిప్పించి, తన నగరానికి బయలుదేరాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)