18. శంబరాసుర వధ | Lord Krishna’s Demon Slaying - Shambarasura Vadha | Lord Krishna Avatar Story in Telugu

writer
0
యాదవులు జరాసంధుడు మొదలుగాగల 'రాజుల సేనలను ఓడించి, విజయోత్సాహంతో సింహనాదాలు చేస్తూ, విజయ దుందుభులు మోగిస్తూ, బలరాముణ్ణి, సాత్యకినీ ముందుంచుకుని ద్వారకకు తిరిగిపోయారు.

కృష్ణుడు రుక్మిణిని తీసుకుని వెళ్ళి పోగానే శ్రుతపర్వుడు రుక్మిని తన రథం మీద కూర్చో బెట్టుకుని బయలుదేరాడు. అయితే రుక్మి, తన చెల్లెలైన రుక్మిణిని తీసుకురాకుండా కుండినపురం ప్రవేశించ నని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఆ ప్రతిజ్ఞ విఫలం అయింది గనక, అతను భోజకటక మనే నగరం నిర్మించి, అందులోనే ఉండిపోయాడు.

జరాసంధుడు. మూర్ఛ తెలియగానే, చెల్లాచెదరైన తన సేనలను తిరిగి ఏకం చేసుకుని, పూర్తిగా నవ్వుల పాలైపోయిన శిశుపాలుణ్ణి వెంట బెట్టుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు.

యాదవవృద్ధులు కృష్ణుడి వివాహానికి ముహూర్తం నిశ్చయించి, బంధుకోటికి, ఇతర రాజులకూ ఆహ్వానాలు పంపారు. రాచనగరుకు పెళ్ళిముస్తాబు జరిగింది. మణులు కూర్చిన గోడలను కుంకంపువ్వుతో తుడిచి ధగధగా మెరిసేటట్టు చేశారు. బంగారు స్తంభాలకు కట్టిన గుడ్డలు ఊడ దీసి, వాటి పై నున్న చెక్కడపు పనితనం అందరికీ కనపడేలాగు చేశారు. గచ్చునేలల మీద కస్తూరి నీరు పోసి రుద్ది మెరుగుపెట్టారు. రకరకాల ముత్యాల ముగ్గులు చక్కగా అలంకరించారు. అంతటా పోక మానులూ, అరటిచెట్లూ అమర్చి, లేత రావి ఆకులతోనూ, మామిడాకులతోనూ తోరణాలు గట్టి, చీనాంబరాలతో తయారు చేసిన ధ్వజా లెత్తారు.

కృష్ణుడి పెళ్ళికి అతని బంధువులూ, అనేకమంది రాజులూ తమ తమ వైభవాలు ఉట్టిపడేలాగా, రథాలనూ, ఏనుగులనూ, గుర్రాలనూ వెంట బెట్టుకుని ఎంతో స్నేహ భావంతో వచ్చారు. కృష్ణుణ్ణి చూసి తమ తపస్సులు ఫలింప జేసుకుందామని మునులు వచ్చారు. ఇంకా, నాలుగు వర్ణాలకూ చెందిన ప్రముఖులు నానా దేశాల నుంచి పెళ్ళికి తరలి వచ్చారు. వచ్చిన వారందరికీ సాత్యకి తగిన సత్కారాలు జరిపి, వసతులు ఏర్పాటు చేశాడు.

పెళ్ళిరోజు వచ్చింది. బ్రాహ్మణుల వేదా ధ్యయనము, రాజులకు వంది మాగధులు చేసే కైవారాలూ, స్త్రీలు తిరుగాడు తూంటే వారి ఆభరణాల ధ్వని, ఏనుగుల ఘీంకారాలూ, గుర్రాల సకిలింపులూ, పెళ్ళి బాజాలూ, ఆకాశాన దేవదుందుభులూ, అన్నీ కలిసి చాలా సందడిగా ఉన్నది.

నాలుగు బంగారు స్తంభాలతో కళ్యాణ మండపం కట్టి, మాణిక్యాలతోనూ, పువ్వుల తోనూ అలంకరించి, రంగవల్లులు చిత్ర విచిత్రంగా రచించి, అందులో మణిమయ మయిన వేదిక మీద కృష్ణుడు కూర్చున్నాడు. అతని చుట్టూ ఉగ్రసేనుడూ, వసుదేవుడూ, బలరాముడూ, యదు వృద్ధులూ, మునులూ కూర్చున్నారు. పురోహితుడు అగ్నిముఖం చేసి వేల్చుతున్నాడు . 

ముహూర్తం వచ్చింది. సౌకుమార్యానికీ, సౌందర్యానికీ, సౌభాగ్యానికి, సౌశీల్యానికి ప్రతిరూపంగా కనిపించే రుక్మిణిని కృష్ణుడు పాణిగ్రహణం చేశాడు. అతని మీద ముత్తయిదువులు అక్షతలనూ, ఆకాశం నుంచి దేవతా స్త్రీలు పుష్పాలనూ ఒకేసారి చల్లారు. బ్రాహ్మణులు ఆశీర్వచనం చేశారు. కృష్ణుడు తన తల్లిదండ్రులకూ, పెద్దలకూ నమస్కారం చేసి, వారి దీవనలు పొందాడు. తరవాత అతను అసంఖ్యాకులైన బ్రాహ్మ ణులకు ఎనిమిదివేల రథాలూ, పదకొండు వేల అయిదువందల ఏనుగులూ, అంతులేని గుర్రాలూ, ఆవులూ దానం చేసి, నగలనూ, బంగారాన్నీ, వెండినీ, దాసదాసీలను కాను కలుగా ఇచ్చి, సూతులూ, మాగధులూ, నర్తకులూ, వంది వైతాళికులూ మొదలైన వారికి అంతులేని బహుమానా లిచ్చి, అంద రికీ భోజనాలు పెట్టి సంతృప్తులను చేశాడు. పెళ్ళిరోజులు సుఖంగా వెళ్ళిపోయాయి. పెళ్ళికి వచ్చినవారు కృష్ణుడికి కట్నాలు చదివించి, అతని చదివింపులు అందుకుని, వెళ్ళిపోయారు.

కృష్ణుడు రుక్మిణితో దాంపత్య సౌఖ్యంలో ఓలలాడుతూనే, మిత్రవిందా, జాంబవతీ, సత్యభామా, కాళిందీ, సుదంతా అనే వారిని కూడా పెళ్లాడాడు.

కొద్ది కాలానికే కృష్ణుడి అగ్ర భార్య అయిన రుక్మిణి గర్భవతి అయింది. కృష్ణుడు తన హెూదాకు తగినట్టుగా ఆమెకు పుంస వనమూ, సీమంతమూ మొదలైన వేడుకలు జరిపాడు. కాలక్రమాన రుక్మిణి ఒక మగ శిశువును ప్రసవించింది. పూర్వం శివుడి మూడో కంటి మంటకు భస్మమైన మన్మ ధుడే రుక్మిణి కడుపున జన్మించాడు. అత నికి ప్రద్యుమ్ను డని పేరు పెట్టుకున్నారు. రుక్మిణి కడుపున పుట్టే ఈ బిడ్డ వల్ల తనకు చావున్నదని ముందే తెలిసి శంబరు డనే రాక్షసుడు, ఏడు రోజుల బాలింత పక్కలో పడుకుని ఉన్న ప్రద్యుమ్నుణ్ణి అర్ధ రాత్రి వేళ అపహరించి తీసుకు పోయి సముద్రంలో పారేశాడు. ఆ బిడ్డను ఒక పెద్ద చేప మింగింది. ఆ చేపను ఒక జాలరి వలలో పట్టి, అంత పెద్ద చేపను పట్టినందుకు సంతోషించి, దాన్ని తమ రాణి ఆయిన మాయావతికి కానుకగా ఇచ్చాడు. ఈ జాలరి ఇక్షుమతీ పురంలో ఉండే వాడే. ఆ ఇక్షుమతీ పురాన్నే శంబరుడు పాలిస్తు న్నాడు. మాయావతి శంబరుడి భార్య.

మాయావతి జాలరి ఇచ్చిన చేపను తానే స్వయంగా తరిగి, అందులో అందమైన పిల్ల వాడుండటం చూసి ఎంతో ముచ్చటపడి, వాణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసింది. తనకు పిల్లలు లేని కారణం చేత శంబరుడు కూడా ఆ పిల్లవాణ్ణి చూసి మురిశాడు.

మాయావతి పెంపకంలో పెరిగిన ప్రద్యు మ్నుడు రాక్షస మాయలన్నీ 'తెలుసుకున్నాడు; సకల విద్యలూ నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయాడు. చివరకు అతను ఎంత అందంగానూ, ఆకర్షణీయంగానూ, తయారయాడంటే, పసితనం నుంచీ  అతన్ని పెంచిన మాయావతికే అతని పైన మోహం పుట్టు కొచ్చి, తన కోరిక అతనితో చెప్పింది. అతను బుద్ధిమంతుడు కనక మాయాపతితో, "నువు తల్లివి, నేను కొడుకును. నా పైన నీ లాటి భావం ఎలా కలిగింది? దీని కేదన్నా కారణం ఉంటే చెప్పు,” అన్నాడు.

దానికి మాయావతి, "నీ తండ్రి యాదవ వంశోద్ధారకుడైన కృష్ణుడు. నీ తల్లి రుక్మిణి దేవి. పురిటిలోనే నిన్ను శంబరుడు సముద్రంలో పారేస్తే, దైవికంగా నువ్విక్కడికి చేరావు. నేను నిన్ను ఇంతకాలమూ రక్షించాను. నీ కోసం నీ తల్లి ఇంతకాలమూ బెంగపడి ఉన్నది. నువు వెళ్ళి ఆమె కళ్ళ ఎదట పడు, నేను నీ అందం చూసి ప్రేమించాను. నన్ను నిరాకరించకు. శంబరుణ్ణి నేను మాయా మోహితుణ్ణి చేసి అతని భార్యగా నటిస్తూ వచ్చాను. అతను విరోధి. అతన్ని చంపెయ్యి,” అన్నది.

మాయావతి అలా చెప్పేసరికి ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడు శంబరుడి పైన ఏడు మాయలు ప్రయోగించి, విఫలుడై, చివరకు ఎనిమిదవ మాయతో చంపేశాడు.

తరువాత అతను మాయావతిని వెంట బెట్టుకుని మాయా ప్రభావంతో ఆకాశ మార్గాన ప్రయాణం చేసి, కృష్ణుడి అంతః పురంలో దిగాడు. అకస్మాత్తుగా తమ మధ్య దిగిన ప్రద్యుమ్నుణ్ణి చూసి కృష్ణుడి భార్య లందరూ భయపడ్డారు. అతని అంద చందాలు చూసి సంతోషం కూడా పొందారు. రుక్మిణి ఆ యువకుణ్ణి చూసి, తనకు పుట్టిన ఓడ్డ బతికి ఉంటే ఈ పాటికి ఇంతవాడై ఉండే వాడు కదా అనుకున్నది. చూస్తున్న కొద్ది ఈ కుర్రవాడిలో కృష్ణుడి లక్షణాలు కనిపించి, ఒకవేళ తన కొడుకే బతికి ఉండి ఇలా వచ్చాడేమో అన్న అనుమానం కూడా కలిగింది. కృష్ణుడు కూడా ఆ కుర్ర వాణ్ణి ముఖమంతా కళ్ళు చేసుకుని చూస్తూ, ఆనందించ సాగాడు.

అంతలో నారదుడు అక్కడికి వచ్చి కృష్ణుడితో ప్రద్యుమ్నుడి కథ అంతా చెప్పాడు. అంతా స్పష్టమైపోయింది. ప్రద్యుమ్నుడు రుక్మిణి కొడుకే. మాయావతి కూడా పూర్వజన్మలో మన్మధుడి భార్య అయిన రతీదేవి. తిరిగి మళ్ళీ అతనికి భార్య అయింది. మన్మధుడు పోయాక ఆమె శంబరుడికి చిక్కి, మాయారూపం ధరించి శంబరుణ్ణి మభ్యపెడుతూ, తన పాతి ప్రత్యాన్ని కాపాడుకున్నది.

తన కొడుకు తనకు మళ్ళీ దక్కి నందుకు రుక్మిణి పరమానందం చెందింది. కృష్ణుడి భార్యలందరూ ఎంతో సంతోషించి, అంతఃపురంలో ఎన్నో విందులూ, వేడుకలూ చేసుకున్నారు.

రుక్మిణి తొలి కాన్పుకు ప్రద్యుమ్నుణ్ణి కనటమే గాక, వరసగా తొమ్మిదిమంది కొడుకులను కని, చిట్ట చివర కొక కూతుర్ని కూడా కన్నది. ప్రద్యుమ్నుడి అనంతరం రుక్మిణి కన్న తొమ్మిదిమంది కొడుకుల పేర్లు చారుధేష్ణుడూ, సుధేష్ణుడూ, సుషేణుడూ, చారుగుప్తుడూ, చారువాహనుడూ, చారు విందుడూ, చారుభద్రుడూ, చారుగర్భుడూ, చారుడూ; కడ గొట్టు పిల్ల పేరు చారుమతి. కృష్ణుడికి ఇతర భార్యలయందు భానుడూ, భానువిందుడూ, సంగ్రామజిత్తూ, దీప్తి మంతుడూ, వృకుడూ మొదలుగాగల అనేకమంది కొడుకులూ, మిత్రవతి మొద లైన అనేకమంది కూతుళ్ళూ కలిగారు,

ప్రద్యుమ్నుణ్ణి రుక్మిణి కన్న నెల లోపునే బాంబవతి సాంబుడనే కొడుకును కన్నది. అతను ప్రసిద్ధుడు. పసితనంలోనే బల రాముడు అతన్ని చేరదీసి, తన కొడుకు లాగా పెంచాడు, అతనికి యుద్ధవిద్యలన్నీ నేర్పాడు. బలరాముడికి రేవతి యందు నిశాతుడూ, ఉల్మకుడు అనే కొడుకులు కలిగారు. ఈ విధంగా బలరామకృష్ణులు పెద్ద బలగాన్ని కని, ఎంతో సుఖంగా జీవిస్తూ వచ్చారు.

విదర్భదేశంలో రుక్మిణి అన్న అయిన రుక్మికి శుభాంగి అని ఒక కూతురున్నది. ఆ శుభాంగి యుక్త వయస్కురాలయింది. ఆ పిల్లకు తగిన వరుణ్ణి సంపాదించటం కోసం రుక్మి స్వయంవరం ఏర్పాటు చేసి,

భూమి మీద ఉండే రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు. ఆ స్వయంవరానికి ఎంద రెందరు రాజులో వెళ్ళారు; తన తల్లి దండ్రుల అనుమతి పొంది ప్రద్యుమ్నుడు కూడా సపరివారంగా బయలుదేరి వెళ్ళాడు. స్వయంవరం యధావిధిగా జరిగింది. శుభాంగి అదివరకే ప్రద్యుమ్నుడి అంద చందాలను గురించి విని, అతన్ని వరించటానికి నిశ్చయించుకుని ఉండటం చేత అతని మెడలోనే వరమాల వేసింది. స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులందరూ ఆమె నిర్ణయాన్ని మెచ్చుకుని, వధూవరులు ఒకరి కొకరు తగి ఉన్నారని శ్లాఘించారు.

ప్రద్యుమ్నుడు శుభాంగిని పెళ్ళాడి ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలానికి ఆ దంపతులకు అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధుడు పెరిగి పెద్దవాడవుతూ సమస్త శాస్త్రాలూ, శస్త్రాస్త్ర విద్యలూ నేర్చి యుక్త వయస్కు డయాడు. అతనికి పెళ్ళి యీడు వచ్చింది.

రుక్మికి రుక్మవతి అనే మనమరాలు, కొడుకు కుమార్తె, ఉన్నది. ఆ పిల్లను అనిరుద్ధుడికి అడగమని కృష్ణుడు సూచించగా ప్రద్యుమ్నుడు దూత ద్వారా రుక్మికి కబురు పంపాడు.

రుక్మి కూడా, పాత పగలు మరచి, సరే నన్నాడు. పెళ్ళి నిశ్చయమయింది. పెళ్ళికి బలరామకృష్ణులూ, ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులూ, అనిరుద్ధుడూ, రుక్మిణి, అనేక మంది యాదవ ముఖ్యులు తరలి వెళ్ళారు. వివాహం వైభవంగా జరిగింది. 

అందరూ మహెూల్లాసంగా ఉన్న సమయంలో వేణుధారీ, శ్రుతపర్వుడూ, అంశు మంతుడూ, జయత్సేనుడూ మొదలైన దాక్షిణాత్యులు తమ మిత్రుడైన రుక్మితో, "నువు జూదంలో నేర్పరివి గద. బలరాముణ్ణి కదిలించి చూడు. అతను కాస్త వ్యసన పరుడు. అతన్ని ఓడించి మనం ప్రతిష్ఠ సంపాదింతాం," అని బోధించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)