2. కృష్ణ జననము | Birth of Lord Krishna | Lord Krishna Avatar Story in Telugu

writer
0
మేరుపర్వతం మీద జరిగిన దేవసభ నుంచి బయలుదేరిన నారదుడు తిన్నగా 'మధురా నగరానికి వెళ్లాడు. ఆయన కంసుడి మందిర ద్వారాన్ని చేరేసరికి, ప్రతీహారులు వచ్చి ఆయనను లోపలికి తీసుకు వెళ్లారు. నారదుడికి కంసు డెదురువచ్చి, ఎంతో వినయంతో అర్ఘ్య పాద్యాదులిచ్చి, పూజించి, తృప్తి కలిగించాడు.

అప్పుడు నారదుడు కంసుడి కేసి చూస్తూ, అందరూ వింటూండగా, “నాయనా, నేను తీర్థయాత్రలు చేసుకుంటూ, అలా మేరుపర్వతం కేసి వెళ్లాను. అక్కడ బ్రహ్మ మొదలైన దేవతలంతా పెద్ద సభ చేసి ఉన్నారు. ఏదో పెద్ద చర్చ జరుగు తున్న దని గ్రహించి నేనక్కడ కాస్సేపు నిలిచాను. ఏం చెప్పమన్నావు? వాళ్లందరూ చేరి, నిన్ను చంపడానికి పెద్ద పథకం ఆలో చిస్తున్నారు. మీ పెత్తండ్రి కూతురు దేవకీ దేవి ఉంది, చూశావూ? ఆవిడకు కలిగే ఎనిమిదో బిడ్డ నీకు మృత్యువు కలిగిస్తుం దట. దేవతల కందరికీ రక్షకు డైనవాడే అందుకు గాను అవతార మెత్తుతున్నాడట! కనక, నాయనా, నీ ప్రాణానికి హాని కలగ కుండా తగిన ఏర్పాటులు చేసుకో. ధర్మ మార్గం తప్పకుండా సుఖంగా జీవించు. నీ మేలు కోరినవాణ్ణి గనక ఈ ముక్క నీ చెవిని వేసి పోదామని వచ్చాను,” అని తన దారిన తాను వెళ్లిపోయాడు.

తరువాత కంసుడు తన భృత్యులను చూసి చిన్న నవ్వు నవ్వి, "తెలివిగలవాడని ఈ నారదుడంటే చాలా స్నేహ భావంతో ఉంటూ వచ్చాను. కాని నా బోటి సత్వవంతుణ్ణి ఇలా భయపెడతాడా? నేను బ్రహ్మను గాని, మరే దేవతలను గాని లక్ష్య పెడతానా? నాకే కోపం వచ్చిందంటే ఒక్క పిడికిటి పోటుతో దిక్కులనూ, దిక్పాలకులను అణగార్చగలను! కొండ లన్నీ అవిసినా, సముద్రాలన్నీ ఇంకినా నేను చలించేవాణ్ణి కాను ! అది అలా ఉంచండి. ఈ నారదుడికి కాలూ, నోరూ క్షణం ఊరుకోవు. ప్రతి చోటికి పోతూ, నోటికి వచ్చినదెల్లా అంటూ, ఒకరిమీదికి ఒకరిని రెచ్చగొట్టి, తంపులు పెట్టి తమాషా చూస్తాడు. ఆయన ఎలాటివాడైతే మనకేం? యదుకులం నుంచి అపాయం ఉందని ఆయన అంటున్నాడు గనక, మన అరిష్ట కేశి ప్రలంబ దేనుక పూతన కాళీయు లాది గాగల వాళ్ళందరూ చాలా జాగరూకులై ఉండి, నా శత్రువులను నాశనం చెయ్యాలి. తల్లిగర్భాన ఉన్నవాళ్లను సైతం వదిలి పెట్టరాదు. నేనుండగా నా భృత్యులెవరూ దేనికీ భయపడవలసిన పనిలేదు. అండగా నేనున్నాను గనక అందరూ స్వేచ్ఛగా సంచరించవచ్చు " అన్నాడు.

తరువాత కంసుడు సభ చాలించి తన భవనానికి వెళ్ళి, తన ఆప్తులను రహ స్యంగా సమావేశపరచి, "ఇవాళ నుంచి మన దేవకీదేవికి అనేక మంది పరిచారి కలను ఏర్పాటు చేసి, కాపలా ఉంచండి. వాళ్లు వసుదేవుణ్ణి కూడా ఒక కంట కనిపెట్టి ఉండాలి. దేవకికి ఎప్పుడు గర్భధారణ జరిగినది, ఏయే నెలలు జరిగేది, ఎప్పుడు పురుడు వచ్చేదీ నాకు ఎప్పటి కప్పుడు తెలియజేస్తూ ఉండాలి. విసుగూ విరా మమూ లేకుండా అహోరాత్రాలు సాగాలి. దీనికంతకూ కారణమేమిటో ఎవ్వరికీ తెలియకూడదు,” అని వారిని హెచ్చరించాడు.

ఈ లోపల నారదుడు మధురానగరం నుంచి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, తాను ఏ విధంగా కంసుడి మనసులో విషబీజం నాటినదీ, దాని ఫలితంగా కంసుడు తల పెట్టిన నీచకార్యాలూ తెలిపాడు.

నారదుడు వెళ్లినాక విష్ణుమూర్తి, కంసుడి జాగ్రత్తలన్నీ తప్పించుకుని తాను అవత రించే ఉపాయాలాలోచించసాగాడు. ఆయ నకు ఒక పాత వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. అదేమిటంటే—పాతాళంలో కాలనేమి కొడుకులు ఆరుగురుండే వారు. వారు చావు లేకుండా బ్రహ్మ నుంచి వరాలుపొందాలని తపస్సు ప్రారంభించారు. ఆ సమయంలో మూడు లోకాలకూ తానే ఆధిపత్యం వహించి ఉన్న హిరణ్యకశిపుడు, ఈ సంగతి తెలిసి, "కులశ్రేష్టుణ్ణి నేనుండగా మరొకరి నుంచి వరాలు పొందాలని ఆశిస్తారా ? మిమ్మల్ని కని పెంచిన తండ్రిచేతనే చావండి," అని శపించాడు.

ఈ సంగతి స్మరణకు రాగానే విష్ణువు యోగమాయను పిలిచి, "నీ వల్ల ఒక పని కావలసి ఉన్నది. షడ్గర్భులనేవాళ్లు, కాలనేమి కొడుకులు ఆరుగురున్నారు. వాళ్ళను ఒక్కొక్కణ్ణి తీసుకుపోయి దేవకి గర్భంలో ప్రవేశ పెట్టు. వాళ్లు పుట్టిన వెంటనే కంసుడు చంపేస్తాడు. దేవకికి కలిగే ఏడవ గర్భాన్ని రోహిణికి మార్పు, దేవకికి ఏడవ సారి కంసుడి భయంచేత గర్భస్రావ మయిందని అందరూ అనుకుంటారు. ఆ బిడ్డ నాకు అన్నగా రోహిణి గర్భాన జనిస్తాడు. తరువాత దేవకీదేవి అష్టమగర్భంలో నేను ప్రవేశించేటప్పుడే, నువు కంసుడి గోవులకు పాలకుడైన నందుడి భార్య యశోద గర్భంలో ప్రవేశించు. మన మిద్దరమూ అర్ధరాత్రి వేళ జననం పొంది స్థానాలు మారుదాం. అటు తరువాత కంసుడు నిన్ను రాతి కేసి కొట్టి చంప యత్నించినప్పుడు ఆకాశానికి ఎగిరిపో. అటు తరువాత ఇంద్రుడు నీ కెదురు వచ్చి, తీసుకు పోయి, నిన్ను ఆదిశక్తిగా అభిషేకిస్తాడు. నీలమేఘచ్ఛాయా, నిండు చంద్రుడులాంటి ముఖమూ, ఎనిమిది చేతులలో శార్ ఙ్ఞము, చక్రము, గదా, ఖడ్గమూ, పద్మమూ, మధుకలశమూ, ముసలమూ, శూలమూ ధరించి, దివ్యా భరణ భూషితవై, నీలంరంగు గల పట్టు చీర ధరించి, సమస్త దేవతల చేత పూజింప బడతావు,” అన్నాడు.

యోగమాయ సరే నన్నది. ఆమె మహిమచేత దేవకీదేవి షడ్గర్భులను, ఒకరి తరవాత ఒకరుగా, తన గర్భాన ధరిస్తూ వచ్చింది. ఆమెకు ప్రసవకాలం సమీపించి మనుషులు వెళ్ళి నప్పుడల్లా కంసుడి కంసుడితో ఆ సంగతి చెప్పేవాళ్లు. కంసుడు వచ్చి, పుట్టిన బిడ్డను పుట్టినట్టే తీసుకు పోయి, దాని కాళ్లు పట్టుకుని రాతి మీద కొట్టి, మహాదారుణంగా చంపేసేవాడు.

దేవకీదేవి ఏడవసారి గర్భిణిగా ఉండగా యోగమాయ ఆ గర్భాన్ని తీసుకుపోయి, గోకులంలో ఉన్న రోహిణి గర్భాన ప్రవేశ పెట్టింది. రోహిణికి నెలలు నిండి, పూర్ణ చంద్రుడితో సమానమైన పుత్రుడు కలిగాడు. గర్భసంకర్షణం చేత పుట్టిన కారణాన ఇతను సంకర్షణుడయాడు. ఇతనే బలరాముడు. 

బలరాముడు పుట్టిన అనంతరం దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించింది. అందులో విష్ణుమూర్తి అంశ ప్రవేశించింది. ఆ నాడే గోకులంలో నందుడి భార్య యశోద కూడా గర్భం దాల్చింది.

తొమ్మిది మాసాలు గడిచి, పదోమాసం ప్రవేశించింది. శ్రావణమాసంలో, కృష్ణ పక్షంలో, అష్టమినాటి అర్ధరాత్రి, అయిదు గ్రహాలు ఉచ్చలో ఉండగా విష్ణువు అంశన కృష్ణుడు దేవకీ గర్భాన జననం పొందాడు. ఆ క్షణంలో దేవకీ వసుదేవుడూ తప్ప ఇతరు లెవరూ మేలుకుని లేరు. కావలి వాళ్ళు గాఢనిద్రలో ముణిగి, శవాలలాగా పడి ఉన్నారు.

తనకు కొడుకు కలిగాడన్న భావం ఎలాగో మనస్సులో కలిగి వసుదేవుడు దేవకి ఉన్న చోటికి ఆ అపరాత్రివేళ గబగబా వచ్చాడు. అక్కడ చంద్రోదయమైనట్టుగా ఉన్నది. పుట్టిన బిడ్డ, దట్టమైన వెంట్రుకలూ, మేఘ వర్ణమూ కలిగి, ఒంటిన ఎక్కడా ఒక్క మరకగాని, మాలిన్యం గాని లేకుండా, కళ్లు విచ్చి చుట్టూరా పరికించి చూస్తూ అద్భు తంగా కనిపించాడు.

దుర్మార్గుడైన కంసుడు ఈ శిశువుకు హాని చేస్తే ఎలా చూడగలను? ఇప్పుడే వీణ్ణి తీసుకుపోయి ఎక్కడైనా దాస్తాను,” అనుకున్నాడు వసుదేవుడు తన మనస్సులో.

దేవకి ఆ బిడ్డను ప్రసవవేదన లేకుండా కన్నది. అయితే ఇక చేయవలసిందేమిటో ఆమెకు తోచలేదు. వసుదేవుడు తనకు కలిగిన ఆలోచన దేవకికి చెప్పి, ఆమె తొడ మీద ఉన్న బిడ్డను తన చేతులలోకి తీసుకుని, చప్పున అంతఃపురం దాటివచ్చి, తిన్నగా నందుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ యశోద అంతకుముందే ఆడపిల్లను కని ఒళ్లు తెలియని నిద్రలో ఉన్నది. వసుదేవు డామె పక్కన తన కొడుకును పడుకోబెట్టి, ఆమె కన్న ఆడ పిల్లను ఎత్తుకుని తన ఇంటికి తిరిగి వచ్చి, ఆ బిడ్డను దేవకి పక్కలో పడుకోబెట్టి, కంసుడి వద్దకు వెళ్ళి, దేవకి బిడ్డను కన్నదని చెప్పాడు.

కంసుడు కంగారుగా నిద్రలేచి, జుట్టు ముడీ, బట్ట కుచ్చెళ్ళూ ఊడుతూ, గబగబా వచ్చి, పురిటి గది వాకిట నిలబడి, "బిడ్డ నిలాతే, తే!" అని కేకలు పెట్టాడు.

దేవకి ఆ బిడ్డను తన రొమ్ముకు అదుము కుంటూ, అన్నా, ఆగ్రహించకు. ఈ సారి నేను కన్నది ఆడపిల్ల. నీలాటి లోకైక వీరుణ్ణి ఈ ఆడ బిడ్డ ఏం చెయ్యగలదు? దీన్ని రక్షించు. ఇంతకు ముందు పుట్టిన వాళ్ళంతా మగవాళ్ళు కావటంచేత, వాళ్ళ వల్ల నీకేం కీడు కలుగుతుందో అని నిన్ను నేను వారించలేదు. ఈసారి నా పైన ఉంచు,” అన్నది.

కంసుడు వినిపించుకోకుండా పురిటింట జొరబడుతుంటే కావలి ఉండే స్త్రీ లందరూ హాహాకారాలు చేశారు. అతను బలాత్కారంగా దేవకి చేతుల నుంచి బిడ్డను లాగేసి, ఎప్పటిలాగే రాతి కేసి కొట్టి చంపటానికై పై కెత్తాడు. పై కెత్తిన ఆ బిడ్డ కంసుడి చేతిలో నుంచి జారి, పై కెగిరి, ఆదిశక్తి రూపం ధరించి ఆకాశాన నిలిచి, పానకాలశం నుంచి మధువు తాగి, అట్టహాసంగా 'నవ్వుతూ, కంసుణ్ణి చూసి, "ఓరి దుర్మార్గుడా! "ఓరీ ! నన్నిలా రాతి కేసి కొట్టి చంపాలని చూసినందుకు, నిన్ను నీ ఘోరశత్రువు చంపి నప్పుడు నేను మృత్యుదేవత రూపంలో వచ్చి, నీ ప్రాణాలూ, నెత్తురూ ఆహరిస్తాను. ఇంకెందుకు మిడిసి పడతావు? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు," అంటూ అదృశ్య మయిపోయింది.

"వెంటనే కంసుడు దేవకీదేవి వద్దకు వచ్చి, చేతులు జోడించి, "అమ్మాయీ, ప్రాణ భయంతో నేను మహా పాపం చేశాను. నీ బిడ్డలందరినీ చంపి, నీకు గర్భశోకం కలిగించాను. ఇంతకూ నా ప్రయత్నం నెరవేరనేలేదు. తుచ్ఛమైన మనుష్య యత్నంతో బ్రహ్మలిఖితాన్ని మార్చటం సాధ్యమా? మనం నిమిత్త మాత్రులమే గాని, అసలు చంపేదీ, పోషించేదీ కాల పురుషుడు. అందుచేత నీ దుఃఖాన్ని విడిచి పెట్టు, నీ కాళ్ళూ, చేతులూ పట్టుకుని వేడు కుంటున్నాను,” అన్నాడు.

దేవకీదేవి ఏడుస్తూ, "నాకీ శోకం రాసి పెట్టి ఉండగా నువు మాత్రం ఏం చెయ్యగలవులే, అన్నా!" అని కంసుణ్ణి ఓదార్చి పంపేసింది.

తెల్లవారకుండానే వసుదేవుడు నందగోపుడి ఇంటికి వెళ్ళాడు. నందుడు కొడుకు పుట్టిన సంబరంలో ఉన్నాడు. అతన్ని చూసి వసుదేవుడు, " ఆహా, ఎంత చక్కని కొడుకును కన్నావయ్యా! అదృష్టవంతుడివి. నీ కొడుకుతో సహా మీ స్వస్థానమైన గోకులానికి వెళ్ళు. అక్కడ నా భార్య రోహిణికి పుట్టినవాడున్నాడు. వాణ్ణి నీ పెద్ద కొడుకుగానూ, వీణ్ణి నీ రెండో కొడుకుగానూ చూసుకుంటూ పెంచు. ఆ అడవి ప్రాంతంలో వీళ్ళను జాగ్రత్తగా, ఏమరుపాటు లేకుండా పెంచు సుమా. పాపిష్ఠివాడు కంసుడు దేవకి కన్న పిల్లలందర్నీ పొట్టన పెట్టు కున్నాడు. రోహిణి కన్న ఆ నలుసే దక్కింది. వాణ్ణి పెంచేభారం నీదే. కంసుడు పిల్లల్ని చంపమని నియోగించిన పూతనకు పసి పిల్లల కోసం వెతకటమే పని. తెల్లవారక ముందే బయలుదేరి వెళ్ళి మందను చేరు. నువ్వీ నగరానికి కప్పం కట్టటానికిదా వచ్చావు? ఆ పని కూడా తీరిపోయింది. గనక మరి ఆలస్యం చెయ్యకుండా ప్రయాణంకా,” అన్నాడు.

వసుదేవుడిలా అనగానే నందుడు పురిటి పాపణ్ణి తొట్టెలో పెట్టి మోయించుతూ, తన భార్యతో సహా, పొట్టి ఎద్దులు కట్టిన బండి మీద ఎక్కి వేగంగా మందలుండే చోటికి చేరుకున్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)