కాళిందీ తీరాన ఒక గొప్ప గొల్లపల్లె ఉన్నది. ఆవులతోనూ, దూడలతోనూ, ఎద్దులతోనూ, రకరకాల పనులలో ముణిగి ఉన్న గోపస్త్రీల తోనూ, పురుషులతోనూ అక్కడ చాలా సందడిగా ఉన్నది. వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా ఆ వ్రేపల్లెకు వచ్చి చేరాడు. అక్కడి వృద్ధులలో ముఖ్యులు అతనికి ఎదురువెళ్ళి, అభినందించారు. నందుడు కూడా వారితో కుశలప్రశ్నలు జరిపి, అందరినీ పేరుపేరా పలకరించి, వారి వెంట వ్రేపల్లె చేరుకున్నాడు. వృద్ధ గోపికలు నందుడి ఇంటికివచ్చి యశోదకూ, ఆమె కన్న బిడ్డకూ పురిటివేడుకలన్నీ జరిపారు. రోహిణి వచ్చింది. నందుడామెకు తగిన మర్యాదలు చేశాడు.
గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోపకులంలో పెరుగుతున్నాడు. కొన్ని రోజులు గడిచాయి.
గర్భస్రావాలూ, శిశుహత్యలూ చెయ్యటానికై కంసుడు అనేకమంది రాక్షసులను నియోగించాడు. వారిలోకెల్లా గొప్పది, పూతన అనేది మహాభయంకరమైన ఆకారం కలది. ఆమె రాత్రివేళ పసిపిల్ల లను వెతుక్కుంటూ వస్తూ, నందగోపుడి బండి కింద, తల్లి పక్కన పడుకుని వున్న కృష్ణుణ్ణి చూసి ఆగింది. పిల్లవాడు మంచి తేజస్సుకలిగి, అద్భుతంగా కనబడు తున్నాడు. అందరు పిల్లల్లాగా లేడు. ఒక వేళ కంసుణ్ణి చంపటానికి పుట్టినవాడు వీడేనేమో!
ఇలా అనుకోగానే పూతనకు కోపావేశం వచ్చేసింది. ఆ రాక్షసి పళ్ళు పటపటా కొరికింది. దాని మిడిగుడ్ల నుంచి నిప్పులు రాలాయి. కనుబొమలు ముడుచుకున్నాయి. నుదుట చెమట పట్టింది. ఊపిరి తీవ్రంగా ఆడింది. ఆమె ఆ పిల్లవాణ్ణి తల్లి పక్క నుంచి బలాత్కారంగా లాక్కుని, విషం పూసి ఉన్న తన చనుమొనలు వాడి నోట కుక్కింది. కృష్ణుడు కెవ్వున ఏడుస్తూ పూతన చనుమొనలు నోట గట్టిగా పట్టుకుని, బలంకొద్దీ పాలతోపాటు పూతన శరీరం లోని సప్తధాతువులనూ పీల్చాడు. నిజానిక తను పూతనను మించిన రాక్షసుడు. అందుచేత పూతన అతి వికారమైన ఆర్తనాదం చేసి, విరుచుకు పడిపోయింది.
ఆ భయంకరమైన కేకకు మండలోగల గోపకులంతా తుళ్ళిపడి నిద్రలేచారు. కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్రలేచింది. ఆమె మేలుకుంటూనే పక్కలో పిల్లవాడు కనపడక పోయేసరికి భయపడి, నందుణ్ణి కేక పెట్టింది. నందుడు వచ్చేసరికి మిగిలిన గోపులుకూడా రానే వచ్చారు. వారికి భయం కరమైన పూతనకళేబరం కనిపించింది, దాని ఒడిలో పిట్టలాగా వాలి ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు.
యశోదానందులు తమ కొడుకును చూస్తూనే, "అయ్యో నా తండ్రీ! "అంటూ చప్పున వచ్చి బిడ్డను ఎత్తుకున్నారు.
"ఏమిటిది? ఈ రాక్షసి ఇక్కడికెలా వచ్చింది? అది వచ్చి బిడ్డనిలా చేస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు ?" అని నందుడు తన భార్య నడిగాడు.
" బిడ్డకు కడుపునిండా పాలిచ్చి నిద్ర పుచ్చాను. దివిటీ వెలుగుతున్నది. చాలా సేపు మేలుకునే ఉండి, ఒక్కక్షణంపాటు కన్నుమూశాను. అదికూడా ఎంతో సేపు కాలేదు. ఈ రాక్షసి ఎలా వచ్చిందో, పిల్లవాణ్ణి ఏం చెయ్యబోయిందో, ఇదేం మాయో నాకేమీ తెలీదు. ఈ రాక్షసికి చిక్కికూడా నా బిడ్డ ఏ కీడూ లేకుండా తిరిగి నాకు దొరికాడు. వీడికి వెయ్యేళ్ళాయుస్సు," అన్నది యశోద.
కృష్ణుడికి గొప్ప గండం తప్పిందని గోపకులంతా ఎంతో సంతోషించి, పూతన కళేబరాన్ని దూరంగా లాగేశారు. నందుడు తన కొడుకు నెత్తుకుని, వాడికి దిష్టి తీసి, దిష్టితీసి, ఏవో మంత్రాలు చదివి, ఆశీర్వదించాడు.
రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు.
ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గుడనే బ్రాహ్మణుణ్ణి అతి రహస్యంగా గోకులానికి పంపాడు. ఆయన వచ్చి రోహిణి కొడుకుకూ, యశోద కొడుకుకూ జాత కర్మలు జరిపి, ఆ పిల్లలిద్దరికీ రాముడూ కృష్ణుడూ అని పేరుపెట్టి, ఎంత రహస్యంగా వచ్చాడో అంత రహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు.
నందుడి ఆనందానికి మితిలేదు. అతను బ్రాహ్మణులను పిలిపించి, షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి, గోపులూ, వస్త్రాలూ దానం చేశాడు. పెద్ద ఉత్సవం జరిగింది. గోకు లంలో గల బంధువులందరికీ నందుడు బట్టలు పెట్టాడు. గోపూజ చేశాడు. గోవాటం అలంకరింప చేశాడు. గోపకాంతలు యశో దను, పండంటి కొడుకును కన్నందుకు అభినందించారు. అలాగే గోపకులు కూడా నందుణ్ణి అభినందించారు.
అక్కడ మధురాపురంలో కంసుడికి పూతనకు పట్టినగతి తెలియ వచ్చింది. అతని భృత్యులయిన రాక్షసులు జరిగిన దంతా అతనికి తెలిపారు. నందగోపుడి కొడుకు పైన కంసుడి అనుమానం కేంద్రీ కృతమయింది. అతనికి కొంత కంపరం కూడా కలిగింది. అందుచేత అతను తన భృత్యులైన రాక్షసులను అనేకమందిని పిలిచి, నందగోపుడి కొడుకును తుద ముట్టించమని హెచ్చరించాడు. ఆ రాక్షసులలో శకటుడనేవాడు వెళ్ళినందుడి సొంత బండిలో అదృశ్యరూపంలో ప్రవేశించి అవకాశం కోసం నిరీక్షించసాగాడు.
యశోద కృష్ణుణ్ణి నిద్రపుచ్చి, ఆ బండి కిందనే పక్కపరిచి పడుకోబెట్టి, మిగిలిన గోప స్త్రీలతో సహా నదిలో స్నానంచేసి రావటానికి బయలుదేరి వెళ్ళింది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి బిడ్డ మేలుకున్నాడు. దగ్గిర ఎవరూ లేకపోయేసరికి, రెండు చేతులూ నోట్లో కుక్కుకుంటూ ఏడ్చి, ముఖమంతా కళ్ళకాటుకతో కూడిన తడిచేసుకున్నాడు. కాళ్ళు తన్నుతూ ఎగిరెగిరి పడ్డాడు. అలా కాళ్ళు తన్నుకుంటూనే బండిని ఒక కాలితో తన్నేసరికి, బండి పక్కకు పడి ఛిన్నాభిన్నమయింది.
ఇంతలో యశోద స్నానం చేసి పచ్చి, పిల్లవాణ్ణి గురించి తొందరపడుతూ, గబగబా వచ్చింది. బోల్తాకొట్టి బద్దలైపోయిన బండి ఆమెకు కనిపించింది. ఆమె వెంటనే కెవ్వున అరిచి, పిల్లవాణ్ణి ఎత్తుకుని రొమ్మును అదుముకుంటూ, "అమ్మయ్యో, బిడ్డ నిద్ర పోతున్నాడుగదా అని స్నానానికి వెళ్ళాను. గాని, ఇప్పుడు మీ నాన్న వచ్చి, ఇదిచూసి, ఎన్నిమాటలంటాడో ఏమో. ఈ బండి ఇలా ఎందుకయిందో ఎవరు చెబుతారు? భర్త అడిగితే నేనేం చెప్పాలి?” అనుకుంటూ, ఆమె కృష్ణుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకుని పాలివ్వసాగింది.
ఇంతలో నందగోపుడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని, జుట్టంతా చెదరి, చేత కణుపుల కర్ర పట్టుకుని, గోపులతో కబుర్లు చెబుతూ అక్కడికి వచ్చాడు. వస్తూనే ఊడి పోయిన చక్రాన్నీ, విరిగి పోయిన ఇరుసునూ చూసి ఒక్కసారిగా వణికిపోయాడు. ఎందుకంటే, తన కొడుకు ఎప్పుడూ ఆ బండి కిందనే గదా పడుకుంటాడు ? బండి ఇంత ఛిన్నా భిన్నమై విరిగి పోయిందిగదా, బిడ్డ ఏమైనట్టు ?
మరుక్షణమే అతను తన భార్యనూ, ఆమె దగ్గిన పాలుతాగుతూ, ముఖాన సంతోషమూ, చూపులు తల్లి ముఖానాగల కృష్ణుణ్ణి చూశాడు. నందుడి ప్రాణం కుదట పడింది. అతను గుండె నిమురుకుంటూ, "బండి ఇలా అయిపోయిందేం?" అని భార్యను అడిగాడు. ఏవైనా ఎద్దులు బండిని పడదోసి తొక్కాయో, లేక పెద్ద గాలి వీచిందో అని నందుడికి అనుమానం కలిగింది. " ఏమైతేనేం లే? బిడ్డడు క్షేమంగా ఉన్నాడు. అంతేచాలు," అన్నాడు మళ్ళీ నందుడు.
యశోద గద్గదకంఠంతో, "అసలు తప్పంతా నాదేలే. బిడ్డ నిద్రపోతుంటే, ఈ బండి కింద పక్క మీద పడుకోబెట్టి, దగ్గిరేగదా అని ఏటికి వెళ్ళి, స్నానం చేసి తిరిగి వచ్చి చూతును గదా ఇలా అయింది. అదృష్టం బాగుండి అబ్బాయి కి గండం గడిచింది,” అన్నది.
ఇంతలో కొంతమంది కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి, "ఏమమ్మోయి, మేమిక్కడ ఆడుకుంటుంటే, మీ కృష్ణుడు కాలు చాచి ఒక్క తోపు తోసేసరికి, బండి ఇలా విరిగి పక్కకు పడింది. ఎంత చిత్రమో చూసుకోండి," అన్నారు.
యశోదానందుల ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. వాళ్ళు తమ కొడుకును ముద్దాడి, ఇంత మట్టి తీసి పిల్లవాడికి దిగ దుడిచి పారేశారు. తన కొడుకును కాపాడుతూ ఉండమని నందుడు దేవతలకు దణ్ణం పెట్టుకున్నాడు. ఈలోపల పదిమందీ చేరి, జరిగిన సంగతి విని, చూసి, నిశ్చేష్టు లైపోయారు. తరవాత, విరిగి పోయిన బండిని తిరిగి కూర్చి, బాగుచేసి, ఎప్పటి లాగా చేసేశారు.
రోజులు గడుస్తున్నాయి. కృష్ణుడు పెరుగుతున్నాడు. బోరగిలపడి, మంచం అంచులకు దేకు తున్నాడు. కితకితలు పెడితే కిలకిలా నవ్వి కేరింతలు కొడుతున్నాడు. నిలబెట్టి వేళ్ళు పట్టుకోవటానికిస్తే తప్పటడుగులు వేస్తున్నాడు. చప్పట్లు కొట్టి, "దా, దా," అని పిలిస్తే దగ్గిరికి వస్తున్నాడు. చూసినవాళ్ళు అతన్ని ఎత్తుకుని ముద్దాడ కుండా ఉండలేరు. అందుకని మువ్వలు గలగల్లాడిస్తూ, దొంగచూపులు చూస్తూ ఎటో పారిపోతాడు. చూసేవాళ్ళు పరమానందం చెందుతారు.
తల్లి కృష్ణుడికి వెన్న గోరుముద్దలుగా చేసి రోజూ తినిపించేది. చేతి జిడ్డూ, మూతి జిడ్డూ, ఒళ్ళంతా పట్టించేది. ఉదయం పూట తల్లి కడుపు నిండా వెన్నపెట్టి గృహ కృత్యాలు చూసుకోవటానికిపోతే, తప్పటడు గులు వేసుకుంటూ వెనకనే వెళ్ళేవాడు. ఆడవాళ్ళ దగ్గిరికిపోయి వెన్న పెట్టమని బతి మాలేవాడు. ఎంత పెట్టినా ఇంకా పెట్టమని వేధించుకు తినేవాడు. వెన్న చిలికేవాళ్ళ దగ్గిరికి వెళ్ళి, కవ్వం తాడు పట్టుకుని కవ్వం ఆడకుండా చేసేవాడు, జుట్టుముడి ఊడ తీసేవాడు, చీరెకొంగు పట్టుకుని లాగేవాడు.
"వెన్న పెడతాను గాని కాస్త ఆట చూపించరా, బాబూ, ” అని గోపికలు అడిగితే మువ్వలూ, మొలగంటలూ గల గలలాడుతూ ఆడేవాడు. గోపికలు చల్ల చెయ్యటం మానేసి చూసి ఆనందించే వాళ్ళు. అస్తమానమూ గోకులంలో ఉండే ఇళ్ళన్నీ తిరిగేవాడు. వాడితో వేగలేక గోపి కలు నలుగురూ నాలుగు పక్కలనుంచి, "పట్టుకోండి, పట్టుకోండి," అంటూ ఒకరి నొకరు హెచ్చరించుకుంటూ వచ్చి, పట్టుకుని యశోదకు అప్పజెప్పేవాళ్ళు.
కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణుడి ఆటలు మారి పోతున్నాయి. గోపబాలకు అందరూ బలరామ కృష్ణుల చుట్టూ చేరేవాళ్ళు. అందరూ కలిసి ఒక దండులాగా వ్రేపల్లె అంతా చెడ తిరిగేవాళ్ళు. కృష్ణుడు కుండ ల్లోనూ, చట్లలోనూ ఉండే పాలూ, నెయ్యీ తాగేవాడు, తాగినంత తాగి, మిగిలినది నేలమీద పోసి, కాళ్ళతో మట్టగించేవాడు. అలాటి చిలిపి చేష్టలు చెయ్యకుండా ఆపటం ఎవరివల్లా అయేదికాదు. పాలసముద్రం మధించగా వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచినట్టుగా, కృష్ణుడు గోపికల ఇళ్ళలోని పాలూ, మీగడా తాను తినటమే గాక తన వెంట ఉన్న కుర్రకారు కంతకూ పంచిపెట్టేవాడు. ఉట్లు తెంచేవాడు. బానలు దొర్లించేవాడు, కడవల్లో పాలు సగం తాగి వాటిని చల్లతో మళ్ళీ నింపేవాడు. నెయ్యి తీసుకుపోయి నిప్పులోపోసి భగ్గున మంటలు లేపేవాడు. పెరుగులో పాలూ, వెన్నలో పెరుగూ, చల్లలో నెయ్యి కలిపేసేవాడు. దూడలను విప్పి ఆవుల పాలు తాగెయ్య నిచ్చేవాడు. కొన్నిటిని కట్లు విప్పి వదిలేసే వాడు. కావళ్ళ తాళ్ళు తెంచేసేవాడు. పిల్ల లందరినీ చేర్చి ఆటలాడేవాడు. ప్రతి ఆట లోనూ అందరిని ఓడించి, వీపు పగిలేటట్టు కొట్టేవాడు, ఒక్కొక్కడి వీపునా ఎక్క మోయించుకునేవాడు. ఆటల్లో ఎంత మొన గాణ్ణయినా ఏడిపించుకు తినేవాడు.
ఈ విధంగా కృష్ణుడు గోకులాన్నంతా ఒక కొలిక్కి తెస్తుంటే గోపకులు ఏం చెయ్యాలో తోచక నిశ్చేష్టులైపోయారు.