20. నరకాసుర వధ | Krishna and Satyabhama Battle with Narakasura | Lord Krishna Avatar Story in Telugu

writer
0
కృష్ణుడు తమతో కుశల ప్రశ్నలు చేశాక మునులు చాలా సంతోషించి, తాము తెచ్చిన బదరీ ఫలాలను అతనికి కానుకగా ఇచ్చి, మేము పెద్ద పని మీదే నీ వద్దకు వచ్చాం. భూదేవి కొడుకైన నరకుడు రాక్షస నాయకుడు. వాడిది ఉద్దండ పరాక్రమం, వాడు సముద్రాలు ఇంకించ గలడు, భూమిని చలింపజేయగలడు, కొండలను అణగ దొక్కగలడు. వాడు లోకాలన్నిటినీ గగ్గోలు పరుస్తున్నాడు. ఒకసారి బదరీవనానికి వచ్చి, యజ్ఞకార్యంలో నియుక్తులమై ఉన్న మమ్మల్ని చూసి, దేవతలను గురించి యజ్ఞం చెయ్యవద్దనీ, తనను గురించి చెయ్యమనీ అడిగాడు. అందుకు మేము ఒప్పుకోక పోయేసరికి, వాడు అలిగి, తన అనుచరుల చేత మా అగ్నులు ఆర్పించి, మా వస్తువులన్నీ ధ్వంసం చేసి, మా స్త్రీలను చెరపట్టి తీసుకుపోయాడు. మా కర్మకాండకు భగ్నం కలగటమే గాక, మా మర్యాద మంట గలిసింది. మాకు తీరని దుఃఖమూ, భయమూ పట్టుకున్నాయి. మమ్మల్ని నువే కాపాడాలి," అన్నారు.

మునులు అన్న మాటలకు కృష్ణుడికి ఆశ్చర్యము, నరకుడి పైన ఆగ్రహమూ కూడా కలిగింది. కాని అతను ఏ మాటా అనకుండా కొంతసేపు నిశ్చలంగా ఉండి పోయి, ఆలోచనలో పడ్డాడు. అది చూసి మునులు భయపడ్డారు, అనుమానపడ్డారు, ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. 

అప్పుడు సాత్యకి మొదలైన యాదవ ప్రముఖులు కూడా కృష్ణుణ్ణి హెచ్చరించారు. కృష్ణుడు మునుల కేసి తిరిగి, "మీరు మరొక విధంగా అనుకోకండి. ఆ రాక్షసుడి చర్యలు విన్న కోపంలో 'నా మనసు క్షోభపడింది. నేను నిశ్చయంగా ఆ రాక్షసుణ్ణి నిర్మూలిస్తాను. మీ కేమీ భయం లేదు. మీరు వెళ్ళి మీ నిత్య కృత్యాలు కొనసాగించండి," అంటూ వారికి అభయం ఇచ్చాడు.

కృష్ణుడిచ్చిన మాటతో మునుల ముఖాలు వికసించాయి. వాళ్ళు కృష్ణుణ్ణి రకరకాల అభినందించి, వెళ్ళివస్తామని చెప్పి అతని వద్ద సెలవు పుచ్చుకుని, బదరికాశ్రమానికి తిరుగు ప్రయాణం సాగించారు.

మునులు వెళ్ళిపోయిన అనంతరం ద్వారకకు దేవేంద్రుడు, మిగిలిన దిక్పాల కులతో సహా దిగి వచ్చాడు. కృష్ణుడు వారికి ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. ఇంద్రుడు యాదవ ముఖ్యుల నందరినీ ఆలింగనం చేసుకుని, వారిపై తనకు గల అభిమానాన్ని ప్రకటించాడు. తరువాత సుధర్మ సభాభవనంలో అందరూ సభ చేశారు.

ఇంద్రుడు కృష్ణుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, " నేను నిన్ను చూడటానికి ఇలా బయలుదేరి వచ్చిన కారణం చెబుతాను విను. నరకుడనే దైత్య నాయకుడు బ్రహ్మ చేత వరాలు పొంది, విజృంభించి దేవతలను యుద్ధంలో చిత్తుగా ఓడించాడు. వాడి ధాటికి తట్టుకోలేక, ఇళ్ళూ వాకిళ్ళూ వదిలేసి, మనుష్య లోకానికి పారిపోయి వచ్చాం. మా ఇళ్ళలో ప్రవేశించి, వాడు మా సంపద లన్నిటినీ కొల్లగొట్టాడు. మా పాట్లు ఏమని చెప్పను? ఎవరికీ సాధ్యం గాని అదితిదేవి కుండలాలను కూడా వాడు కాజేశాడు. మునుల ఆశ్రమాల నన్నిటినీ వాడు భీభత్సం చేశాడు. జగద్రక్షణకు కంకణం కట్టుకుని నువు అనేకమంది రాక్షసులను చంపినట్టు విని వాడు నిన్ను ఓడించాలని మహా తహతహలాడుతూ. ఉన్నాడు. కనక నువు వెళ్ళి వాడి అంతు తేల్చటం మంచిది. అందువల్ల లోకాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఇడుగో గరుత్మంతుడు, నీకు వాహనం కావడానికి నాతో కూడా వచ్చాడు,” అంటూ గరుత్మంతుణ్ణి చూపాడు.

ఇలా అన్న దేవేంద్రుడితో కృష్ణుడు, "ఈ విషయాలన్నీ మునుల వల్ల ఇంతకు ముందే విన్నాను. నీ రాకతో నా నిశ్చయం మరింత దృఢమయింది. ఇప్పుడే బయలు దేరి ప్రాగ్జ్యోతిష పురానికి పోదాం,” అంటూ ఆసనం మీది నుంచి దిగి, యాదవ ప్రముఖులకు వీడ్కోలు చెప్పి, తన చక్రాయుధం మొదలైన ఆయుధాలు తీసుకుని, సత్యభామకు కబురు పంపి, ఆమెతో సహా గరుడవాహనం ఎక్కాడు. పెద్దలు దీవించారు, వందిమాగధులు స్తోత్ర పాఠాలు చదివారు. ఇంద్రుడు ముందు దారి తీస్తూంటే కృష్ణుడు వెనకగా బయలుదేరాడు. కొంత దూరం నేలమార్గాన వెళ్ళాక, ఇంద్రుడూ, కృష్ణుడూ కూడా ఆకాశ మార్గాన ప్రయాణం సాగించారు.

కృష్ణుడికి ఆకాశం నుంచి ప్రాగ్జ్యోతిష పురం కనిపించింది. అది ఎవరికి ప్రవేశించ సాధ్యం కానిది. దాని సైనికరక్షణలు ఎలా ఉన్నదీ కృష్ణుడు తెలుసుకున్నాడు. నరకుడి మందిరాన్ని రక్షించే రాక్షస వీరులను చూశాడు. కృష్ణుడు ఇంద్రుడికి వీడ్కోలు చెప్పి, ముందుకు వెళ్ళి, ఆ రాక్షసులను అనేకమందిని చెండాడాడు.

మురాసురుడు కృష్ణుడి తో తలపడి భయంకరమైన యుద్ధం సాగించాడు. కృష్ణుడు ఒక అస్త్రంతో మురాసురుడి తల తెగవేశాడు. తరువాత నినుందుడనేవాడు యుద్ధం ప్రారంభించి, సత్యభామ చేతిని గాయపరిచి, రక్తం కారేటట్టు' చేశాడు. కృష్ణుడు మండిపడి, బాణాలతో వాడి చేతులూ, తలా నరికేశాడు. హయగ్రీవుడూ, అఘోరపాలుడూ, విరూపాక్షుడూ, ప్రాపణుడూ, పంచజనుడూ మొదలుగా గల రాక్షస వీరులు ఎనభై నాలుగు వేల మంది కృష్ణుడి చేతిలో చచ్చారు.

నగరద్వారాన్ని రక్షించే రాక్షసు లందరినీ చంపి కృష్ణుడు ఆ ద్వారాన్ని సమీపిస్తూండగా రాక్షస సేనలు అతనిపై వచ్చి పడ్డాయి. కృష్ణుడు ఆ రాక్షస మూకను అవలీలగా చించి చెండాడాడు. ఇంతలో నరకుడే యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. అతను, ఒంటరిగా యుద్ధానికి వచ్చిన కృష్ణుణ్ణి చూసి, "నన్ను నరకు ఉంటారు. ఇంద్రుణ్ణి, ఇతర దేవతలను జయించి, మూడు లోకాలనూ సంక్షోభింప జేసినవాణ్ణి. నా దగ్గర ఎంతలేసి వీరుల పరాక్రమాలూ ఎందుకూ పనికిరావు. నువ్వు ఎవరివి? ఎందుకు వచ్చా విక్కడికి? ఈ పెద్ద పక్షి ఎక్కడిది? ఈ ఆడమనిషి ఎవరు? కొంచెం స్పష్టంగా చెప్పు. నిన్నిప్పుడే చంపి, ఈ స్త్రీని వశపరుచు కుంటాను. పారిపోక పోరాడు,” అన్నాడు.

కృష్ణుడీ మాటలకు నవ్వి, "నేను కూడా మూడు లోకాలలోనూ ప్రసిద్ధికన్నవాణ్ణి. నన్ను గురించి నువు విన్నావో, లేదో తెలీదు. నా పేరు వాసుదేవుడు. ఈమె పేరు సత్య భామ, నా భార్య. ఈ పక్షి పక్షిజాతికి రాజైన గరుత్మంతుడు, నా వాహనం. నే నిక్కడి కెందుకు వచ్చానంటే, నిన్ను చంపి లోకకల్యాణం కలిగించటానికి వచ్చాను,” అన్నాడు.

నరకుడు చిరునవ్వు నవ్వి, "నీవేనా వాసుదేవుడివి? నీతో యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఉబలాట పడుతున్నాను. నీ శక్తి కొద్దీ యుద్ధం చెయ్యి. నాకు దొరికి ప్రాణాలతో తప్పించుకు పోలేవులే," అంటూ కృష్ణుడితో యుద్ధం ప్రారంభించాడు. వారికి జరిగిన యుద్ధం రామరావణ యుద్ధంలాగా వర్ణించ శక్యంకానిది, మహా దారుణమైనది. ఈ యుద్ధంలో కృష్ణుడు తీవ్రంగా గాయపడి మూర్ఛపోయాడు.

అది చూసి సత్యభామ కంగారుపడక, కృష్ణుడి నుదుట గుచ్చుకున్న బాణాన్ని తీసి, రక్తస్రావం కాకుండా గాయాన్ని నొక్కి పెట్టి, కృష్ణుడికి ఉపచారాలు చేసింది. గరుత్మంతుడు తన రెక్కల గాలితో కృష్ణుడికి సేద తీర్చాడు. కృష్ణుడు స్పృహ వచ్చి సత్యభామ కేసి చూస్తూ, " నేను అలిసిపోయినాను. కాస్సేపు నువు యుద్ధం చెయ్యి,” అన్నాడు. సత్యభామ అతని విల్లూ, అమ్ముల పొదులూ తీసుకున్నది.

ఆమె తన పైన ఒక్కసారిగా బాణ వర్షం కురిపించేసరికి నరకుడు, "ఈ కృష్ణుడు తాను యుద్ధం చెయ్యటం మాని, నన్ను జయించటానికి ఆడదాన్ని నియోగిస్తాడా? ఛీ, ఛీ!” అనుకుని, సత్యభామ పైన తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. అవి సత్యభామ రొమ్ములోనూ, చేతులలోనూ, పక్కలలోనూ గుచ్చుకున్నాయి. ఆమె వాటిని లక్ష్యపెట్టక, అత్యంత రోషావేశంతో నరకుడి ధ్వజం విరగగొట్టి, రథాశ్వాలను చంపి, సారథిని చంపింది. నరకుడు బాణం ఎత్తినప్పుడల్లా దాన్ని విరగగొట్టింది. ఇలా మూడు బాణాలు విరిగిపోయేసరికి నరకుడు. గద ఒకటి తీసుకుని, బలంగా ఆమె మీద విసిరాడు. దాన్ని సత్యభామ మధ్యలోనే నలుసులకింద కొట్టేసింది. ఇదేవిధంగా ఆమె నరకుడు విసిరిన ప్రతి ఆయుధాన్నీ నుగ్గు చేసేసింది.

సత్యభామ చేసే అద్భుత యుద్ధానికి కృష్ణుడు తృప్తిపడి, ఆమెను కౌగలించు కుని, నుదుటి మీది చెమట తుడిచి, " అలసి పోయావు. ఇక యుద్ధం చాలించు,” అని ఆమెను ప్రశంసించి తన మెడలో ఉన్న రత్నాల హారాన్ని ఆమె మెడలో వేశాడు. ఆ హారాన్ని సంపాదించాలని రుక్మిణి, సత్య భామా కూడా కోరుకున్నారు. ఇంతవరకు ఇద్దరికీ అది లభించలేదు. అటువంటి హారం ఇప్పుడు సత్యభామకు లభించింది.

కృష్ణుడు సత్యభామ చేతి నుంచి విల్లు తీసుకుని తిరిగి యుద్ధానికి ఉపక్రమించాడు. ఈ లోపల నరకుడు మరొక రథం ఎక్కి, శరపరంపరలను కృష్ణుడి పైనా, సత్యభామ పైనా, గరుత్మంతుడి పైనా విసిరాడు. కృష్ణుడు అతని కొత్త రధాన్నీ, గుర్రాలనూ, సారథినీ వరసగా ధ్వంసం చేశాడు. అప్పుడు నరకుడు క్రోధావేశంతో గద తీసుకుని, నేల పైకి దిగి, కృష్ణుడి రొమ్ముకు గురిచేసి విసిరాడు, కృష్ణుడు అవ లీలగా దాన్ని ఖండించాడు. నరకుడు కృష్ణుడి పైన ఎన్నో ఆయుథాలూ, చివరకు చెట్లూ, రాళ్ళూ కూడా విసిరాడు, కాని ప్రయోజనం లేకపోయింది.

చిట్టచివరకు కృష్ణుడు నరకుడి పైన తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది నరకుణ్ణి నిలువునా రెండుగా చీల్చి పారేసింది. నరకుడి చావుతో భూమికి గొప్ప బెడద తీరిపోయింది. భూదేవి మానవా కారంతో వచ్చి, నరకుడి శవాన్ని కౌగలించుకుని, అతని చెవులకు గల దివ్య మణికుండలాలు తీసి, కృష్ణుడి వద్దకు వచ్చి, ఏడుస్తూ, చేతులు మోడ్పి, "నువే నా కి కొడుకును ఇచ్చావు, నువే వాణ్ణి లోక కంటకుడని భావించి చంపేశావు. ఇక దేవతలూ, ఋషులూ సుఖంగా ఉండనీ. ఇవి ఇంద్రుణ్ణి జయించి తెచ్చిన రత్నకుండలాలు. వీటిని తీసుకో. వీడి కొడుకును కాపాడి, వీడి రాజ్యం వాడికియ్యి,” అన్నది. 

కృష్ణుడు సరేనన్నాడు. భూదేవి అంతర్ధానమయింది. కృష్ణుడు నరకుడి కళేబరానికి అంత్య క్రియలు జరిపించి, అతని కొడుకైన భగదత్తుడికి రాజ్యాభిషేకం చేయించాడు. 

నగరంలోపల అంతులేని నిధులున్నాయి. అవి దిక్పాలకులను జయించి, నరకుడు తెచ్చుకున్నవి. నరకుడి కింది అధికారులు వాటి నన్నిటినీ కృష్ణుడి పరం చేశారు.

మణిశైలం వద్ద పదహారువేల నూరు మంది దేవతా స్త్రీలు నరకుడి చేత చెర పట్టబడి తెచ్చి ఉంచబడ్డారు. కృష్ణుడు సపరి వారంగా అక్కడికి వెళ్ళాడు. ఆ స్త్రీలు కృష్ణుణ్ణి చూసి, "మేము నరకుడి చేత చెర పట్టబడిన దేవ స్త్రీలం. ఒకసారి నారదుడు మా దుఃఖం చూసి, చింతించ వద్దనీ విష్ణు మూర్తి మానవావతారుడై వచ్చి, నరకుణ్ణి చంపి, మాకు భర్త అవుతాడనీ చెప్పాడు. మేము ఆ ఆశతోనే ఇంతకాలమూ మా కష్టాలను ఓర్చాం. ఇప్పుడు మేము ధన్యత్వం పొందాం," అన్నారు.

కృష్ణుడు వారి కోరికను మన్నించి, వారిని స్నేహంతో చూసి, వారి కోసం పల్లకీలు తెమ్మని రాక్షసకింకరులను నియోగించాడు. తరవాత కృష్ణుడు మణిశైల మంతా తిరిగి, దాని శిఖరం ఒకటి చెట్లతోనూ, పక్షులతోనూ సహా విరిచి, గరుత్మంతుడి పైన పెట్టాడు. గరుత్మంతుడు కూడా దాన్ని తేలికగా మోశాడు. కొండశిఖరంతో బాటు కృష్ణుడు కూడా ఎక్కి, ఇంద్రుడి నగరానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ శచీదేవీ, ఇంద్రుడూ ఉన్నారు. శచీదేవీ, సత్యభామా కౌగలించుకున్నారు. కృష్ణుడు ఇంద్రుడికి నమస్కారం చేసి, తాను తెచ్చిన కుండ లాలు అతనికి ఇచ్చాడు. కృష్ణుడు నరకుణ్ణి చంపినందుకు శచి సత్యభామను ప్రశం సించింది.

"నీ కిష్టమైన దేదైనా ఇవ్వాలని ఉన్నది. ఏమిటి నీ కోరిక?" అని శచీదేవి సత్య భామను అడిగింది.

"నాకే కొరతా లేదు. నీ స్నేహం తప్ప నా కింకేమీ అక్కర్లేదు,” అన్నది. సత్యభామ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)