ఇంద్రుడూ, కృష్ణుడూ ఇష్టాగోష్ఠి, ముగించి, శచీదేవినీ, సత్యభామను వెంటబెట్టుకుని అదితిని చూడబోయారు. వారందరూ అదితికి ప్రణామాలాచరించారు. అప్పుడు ఇంద్రుడు ఆమెకు ఆమె కుండలాలు ఇచ్చేస్తూ, కృష్ణుడు నరకుడి పై చూపిన పరాక్రమాన్ని వివరంగా వర్ణించి చెప్పాడు.
అదితి కృష్ణుడికి అనేక వేల దీవన లిచ్చి, "నాయనా, సాటిలేని నీ భుజబలంతో నా కష్టా లన్నిటినీ గట్టెక్కించావు. నీది అపూర్వమైన జన్మ. ఇంద్రుడి లాగే నువు కూడా దేవతలకు అండగా ఉండు. భూమి మీద నిన్నెవ్వరూ జయించలేక పోదురుగాక. స్త్రీలలో ఈ సత్యభామకు ఎవరూ ఈడు రారని ప్రసిద్ధి. నీ కి మానవావతారం ఎంత కాలమైతే ఉంటుందో అంత కాలమూ సత్యభామకు యవ్వనం నిలిచి ఉండు గాక,” అని దీవించింది.
తరవాత కృష్ణుడు అదితి వద్దా, ఇంద్రుడి వద్దా సెలవు పుచ్చుకుని, గరుడవాహన మెక్కి, సత్యభామా సమేతుడై సందనవనం మొదలుగా గల దేవోద్యానాలకు వెళ్ళి, అక్కడ విహారాలు చేశాడు. అక్కడ కల్ప వృక్షాలున్నాయి. వాటి పూల మీద తుమ్మెదలు ముసురుతున్నాయి. వాటి కొమ్మలను ఉయ్యాలలు చేసుకుని దేవకన్యలు ఊగుతున్నారు. లోకాలన్నీ తిరిగి వచ్చిన సిద్ధ మిధునాలు వాటి నీడన విశ్రాంతి తీసుకుం టున్నారు. అలాటి కల్పవృక్షాల మధ్య కృష్ణుడు పారిజాతాన్ని చూశాడు. అది దేవతలకు మహాపవిత్రమైనది. శచీదేవికి దాని మీద చాలా ప్రీతి. దాని కీర్తి మూడులోకాల లోనూ ప్రసిద్ధమైనది. దానికి సమీపంగా వెళ్ళిన వారికి జాతిస్మరణ కలుగుతుంది.
సత్యభామకు పారిజాత సౌరభం సోక గానే తాను దేవతాస్త్రీలలో అగ్రగణ్యురాల నన్న భావం కలిగింది. ఆమె అమితమైన ఆనందం పొందుతూ, ఆ చెట్టు తనకు కావాలని కృష్ణుణ్ణి వేడుకున్నది.
కృష్ణుడు వెంటనే పారిజాతాన్ని వేళ్ళతో సహా పెల్లగించి గరుత్మంతుడి వీపు మీద పెట్టి, బయలుదేరాడు. అప్పుడు దేవవనా లను కాపాడేవాళ్ళు అడ్డుపడి, అతనితో యుద్ధం ప్రారంభించారు. కృష్ణుడు తన బాణాలతో అవలీలగా వాళ్ళను చెండాడాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది.
కృష్ణుడు మూడులోకాలకూ రక్షకుడని తెలుసు, అతను పారిజాతం తీసుకుపోవటానికి అభ్యంతరం కూడా లేదు, అయినా ఇంద్రుడు తనను తాను నిగ్రహించుకోలేక, దేవగణాలతో బయలుదేరి కృష్ణుడికి అడ్డం వెళ్ళి, అతనిపై వజ్రాయుధం విసిరాడు. కృష్ణుడు దాన్ని దారిలోనే ఆపేశాడు. ఇంద్రుడి ఆటకట్టింది. కృష్ణుడు జీవించి ఉన్నంత కాలమూ పారిజాతం భూలోకంలో ఉండటానికి సమ్మతించి, ఇంద్రుడు తిరిగి వెళ్ళాడు. కృష్ణుడు కూడా ద్వారకకు బయలుదేరాడు.
గరుత్మంతుడు పారిజాతంతో సహా సత్యభామా కృష్ణులను కృష్ణుడి మేడ పైభాగాన దింపాడు. కృష్ణుడు పాంచజన్యం పూరించి, తన రాక తనవారి కందరికీ తెలియబరిచాడు. అందరూ సంభ్రమంతో అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణుడు పెద్దలకు నమస్కరించి, చిన్న వాళ్ళను కౌగలించుకుని, పలకరించాడు. ప్రద్యుమ్నుడు వచ్చి పారిజాతాన్ని అంతఃపురంలోకి చేర్చాడు. దాని సమీపానికి వెళ్లిన వారందరికీ ఆశ్చర్యంగా పూర్వజన్మజ్ఞానం కలిగింది. దాని మహత్తు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తరువాత దాన్ని తీసుకుపోయి తగిన ప్రదేశంలో నాటారు.
నరకుడు చెరలో ఉండి, పల్లకీలలో ద్వారకకు చేరిన స్త్రీలందరినీ కృష్ణుడు తానే వివాహమాడాడు.
తరువాత కృష్ణుడు గరుత్మంతుణ్ణి తగిన విధంగా సన్మానించి, అతను దేవలోకానికి తిరిగి వెళ్ళటానికి అనుమతి ఇచ్చాడు. ఎప్పుడు తలచుకున్నా రాగలనని మాట ఇచ్చి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు.
అనంతరం కృష్ణుడు సభచేసి, నరకుణ్ణి చంపి తాను సంపాదించిన వస్తువులను ఉగ్రసేనుడికీ, ఆయన భార్యకూ, తది తరులకు పంచి, మిగిలినది ఖజానాలో పెట్టించాడు.
సత్యభామ రోజూ పారిజాత పుష్పాలతో తనను తాను అలంకరించుకుని, తన సవతులకు కూడా పంచిపెట్టుతున్నది. తన వనంలో పారిజాతం లేకుండా పోయిందని ఇంద్రుడు మాత్రం దీనంగా శచీదేవి కేసి చూస్తూ ఉండేవాడు.
ఒకసారి దుర్యోధనుడు హస్తినాపురంలో ఒక యజ్ఞం చేసి అనేకమంది రాజులను ఆహ్వానించాడు. యజ్ఞం పరిసమాప్తమయింది. ఆ యజ్ఞానికి వచ్చిన రాజులు కృష్ణుడి వైభవాన్ని గురించి ఎంతగానో విని ఉన్నవాళ్ళు కావటంచేత ద్వారకకు వస్తామని దూత ద్వారా కృష్ణుడికి కబురుచేశారు. తప్పక రావలసిందిగా కృష్ణుడు తన దూత ద్వారా వారిని ఆహ్వానించాడు. ధృతరాస్ట్రుడి నూరుగురు కొడుకులూ, వారి సామంతులూ, పాండవులూ పద్దెనిమిది అక్షోహిణుల సేనతో సహా బయలుదేరి వచ్చి, రైవత కాద్రి ప్రాంతంలో విడిశారు.
బలరాముణ్ణి, సాత్యకినీ, ప్రద్యుమ్నుడు మొదలైన కుమారులనూ, పెద్ద సేననూ వెంటబెట్టుకుని, కృష్ణుడు తన అతిధులను సన్మానించటానికి వచ్చాడు. అతను అందరినీ గౌరవించి, అందరికీ బట్టలు పెట్టి, " నేనూ, నా వాళ్ళూ మీ వాళ్ళమే. మీకేం కావాలన్నా అడగండి, సమకూర్చుతాం," అని అందరికీ సంతోషం కలిగించాడు. వారంతా కొంతకాలం గడిపి వెళ్ళిపోయారు.
ఒకసారి అర్జునుడు ధర్మరాజు అనుమతితో కృష్ణుణ్ణి చూడవచ్చి ద్వారకలో కొంతకాలం ఉన్నాడు. ఆ సమయంలోనే కృష్ణుడు ఒక యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞం' కొనసాగుతూ ఉన్న సమయంలో ఒక పల్లెటూరి బ్రాహ్మణు డక్కడికి వచ్చి, దీక్షలో ఉన్న కృష్ణుడికి ఎదురుగా నిలబడి దీనంగా, "అయ్యా, నా మొర ఆలకించండి. నా భార్య ప్రసవించిన మరుక్షణంలోనే బిడ్డలను ఎవరో కాజేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికి మూడుసార్లు జరిగింది. ఇప్పుడు నాలుగోసారి నా భార్య గర్భవతిగా ఉన్నది. కాన్పు పచ్చే సమయం దగ్గర పడింది. మమ్మల్ని నువే కాపాడాలి,” అని మొర పెట్టుకున్నాడు.
ఆ మాటకు కృష్ణుడు, " ఎవరు కాపాడ మన్నా వెంటనే ఆ పని చెయ్యటం నా విధి. కాని నేనీ క్షణాన యజ్ఞదీక్షలో ఉండి పోయాను. ఏం చెయ్యాలో తోచకుండా ఉన్నది,” అన్నాడు.
ఇదంతా వింటున్న అర్జునుడు, " ఎందు కాలోచన? నన్ను పంపించరాదా? నేనీ బ్రాహ్మణుడి వెంట వెళ్ళి, ఆయనకు కలిగిన ఆపద తొలగించి, నిన్ను సంతోష పెడతాను," అని కృష్ణుడితో అన్నాడు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఈ పని నీ వల్ల అవుతుందా ?" అన్నాడు.
అర్జునుడి కీ మాటతో తల తీసేసినట్టయి, తల వంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, " అయినా ఏంటే, ఒక్కడివే వెల్లకు. బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, మరికొందరు యాదవవీరులనూ, సాత్యకినీ, సేననూ వెంటబెట్టుకు వెళ్ళు,” అన్నాడు. అర్జునుడు మిగిలిన యోధులనూ, పెద్ద సేననూ వెంటబెట్టుకుని, బ్రాహ్మణుడు దారి చూపుతూండగా రధంలో బయలుదేరి ఆ బ్రాహ్మణుడి గ్రామం చేరాడు.
అంతలో నక్కలు కూయటం విన పడింది. ఆకాశాన సూర్యుడి కాంతి క్షీణించి, సాయంకాలం అవుతున్న ట్టనిపించింది. భయంకరమైన ధ్వనితో ఉల్క ఒకటి భూమి పైన పడింది. అదే సమయంలో బ్రాహ్మణుడి భార్యకు నొప్పు లారంభ మయాయి. ఆ సంగతి బ్రాహ్మణుడు వచ్చి చెప్పగా మహాయోధు లందరూ 'విల్లులూ, బాణాలూ సిద్ధంగా పట్టుకుని పురిటింటి దగ్గర చేరారు.
అర్ధరాత్రి అయింది. బ్రాహ్మణి ప్రసవించింది కాబోలు, చంటిబిడ్డ ఏడుపు వినిపించింది, అంతలోనే ఆడవాళ్ళు, "అయ్యో, పోయె ! పోయె ! " అని ఆర్తనాదాలు చేశారు. చంటిబిడ్డ ఏడుపు ఆకాశం దిక్కు నుంచి వినిపించింది.
అర్జునుడూ, మిగిలిన యోధులూ ఆకాశాన్ని బాణాలతో నింపేశారు. ఆకాశాన వారి కేమీ కనిపించలేదు. ఒక్క బాణం కూడా ఎవరికీ తగలలేదు, అందరూ దిగ్భ్రాంతులై, కొయ్యబారిపోయి నిలబడ్డారు.
ముసలివాళ్ళూ, ముత్తవ్వలూ అర్జునుడు మొదలైన వాళ్ళను నానా మాటలూ అన్నారు. బ్రాహ్మణుడు పట్టరాని కోపంతో అర్జునుడి వద్దకు వచ్చి, "గొప్ప శూరుడి లాగా కృష్ణుడి ముందర ప్రగల్భాలాడి, కార్యభారం మీద వేసుకుని వచ్చావు. కృష్ణుడి వల్ల తప్ప కాని పని నీ వల్ల అవుతుందా? నీకూ అతనికి సాపత్య మేమిటి? ఇంకెన్నడూ దంభాలు పలుకకు. కాపాడతానని వచ్చి, కాపాడలేక పోయావు. జరిగిన ధర్మహాని వల్ల కలిగే పాపంలో నీకు నాలుగో వంతు చెందుతుంది. నీ గాండీవం వృథా, నీ పరాక్రమం వృథా. ఇక చల్లగా వచ్చిన దారి పట్టు,” అన్నాడు.
ఆయన వెంటనే కృష్ణుడి దగ్గిరికి మళ్ళీ బయలుదేరాడు. ఆయన వెనకగా అర్జునుడు మొదలైనవాళ్ళు కూడా బయలు దేరారు. సిగ్గుతో తల వంచుకుని, కంటతడి పెట్టుకుంటూ తన ఎదటికి వచ్చి నిలబడిన అర్జునుణ్ణి చూసి కృష్ణుడు, "ఈ మాత్రానికే ఇంత విచారం దేనికి? దీని కంతా వేరే కారణం ఉన్నది. దాన్ని నీకు తరువాత చెబుతాను," అని, దారుకుణ్ణి పిలిచి రథం ఆయత్తపరచమన్నాడు.
దారుకుడు కృష్ణుడి రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనే నాలుగు గుర్రాలను పూన్చి, గరుడధ్వజం ఎత్తి తీసుకు వచ్చాడు. అర్జునుణ్ణి రథం తోలమని, కృష్ణుడా రథంలో ఎక్కి, ఉత్తరంగా బయలుదేరాడు. రధం అరణ్యాలనూ, కొండలనూ, నదులనూ దాటి వెళ్ళి సముద్రతీరాన్ని చేరింది.
సముద్రుడు ప్రత్యక్షమై, కృష్ణుడికి అర్ఘ్యమిచ్చి, "మహానుభావా, ఏమిటి నీ ఆజ్ఞ ? ” అని అడిగాడు.
"మరేమీ లేదు. నా రథానికి మార్గం ఇయ్యి, " అన్నాడు కృష్ణుడు.
దానికి సముద్రుడు, " దేవా, నేను తమకు దారి ఇచ్చినట్టయితే మిగిలిన వారికి తేలిక అయిపోనా? 'నేను దాటరాని వాణ్ణిగా సృష్టి చేసింది తమరే గద?" అన్నాడు. "నాతో ఒకరికి పోటీ ఏమిటి? నేను చేసే పనులు మరొకరు చేయగలరా? నా కోసమూ, ఒక బ్రాహ్మణుడి కోసమూ నువు దారి యివ్వక తప్పదు. నేను వెళ్ళి పోయాక దారి మళ్ళీ మూసేసి, ఎప్పటి. లాగే ఉండు," అన్నాడు కృష్ణుడు.
సముద్రుడు సమ్మతించి దారి ఇచ్చాడు. కృష్ణుడి రథం ఉత్తర కురుభూములు దాటి గంధమాదన పర్వతం కేసి వెళ్ళసాగింది. అప్పుడతనికి ఆరు పర్వతాలు - జయంతం, వైజయంతం, నీలం, శ్వేతం, ఇంద్రకూటం, కైలాసం అనేవి—రంగురంగుల ధాతువు లతో అలంకరించి ఉన్న శరీరాలతో ఎదురై, "దేవా, ఏమిటి నీ ఆజ్ఞ ?" అని అడిగాయి.
"నా రధానికి దారి ఇయ్యండి, అన్నాడు కృష్ణుడు.
అప్పుడా పర్వతాలు ఒదిగి, కృష్ణుడి రధానికి దారి ఇచ్చాయి.
మేఘాల మధ్యగా నడిచే సూర్యుడిలాగా కృష్ణుడి రధం కొండల మధ్యగా చాలా దూరం పోయేసరికి, అంతటా అంధకారం ఆవరించింది. అర్జునుడు భయపడ్డాడు. గుర్రాలు నిలిచి పోయాయి. చుట్టూ రాయి లాగా పేరుకు పోయిన అంధకారాన్ని కృష్ణుడు తన సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలు చేసి, "రధం పోనీ," అని అర్జునుడితో అన్నాడు.
చాలాదూరం వెళ్ళగా, వెళ్ళగా ఎట్టెదట కోటి సూర్యుల కాంతి ఒక్క చోట పోగు చేసినట్టు కనబడింది. కృష్ణుడు రథం దిగి, ఆ కాంతిలోకి వెళ్ళిపోయాడు.
"ఈ వెలుతురేమిటి ? ఇందులోకి కృష్ణుడు ఒంటరిగా ఎందుకు పోయాడు? ఏం కానున్నది?" అని అర్జునుడూ, బ్రాహ్మ ణుడూ భయపడుతూండగానే కృష్ణుడు ఆ కాంతిలో నుంచి తిరిగి వచ్చాడు. అతని వెంట ముగ్గురు బ్రాహ్మణ కుమారులూ ఉన్నారు. అతని చేతిలో కొత్తగా పుట్టిన శిశువు కూడా ఉన్నాడు.
కృష్ణు డా పిల్లలు నలుగురినీ బ్రాహ్మ ణుడి కిచ్చాడు. బ్రాహ్మణుడు పొందిన ఆనందానికీ, అర్జునుడు పొందిన ఆశ్చర్యానికీ మేరలేదు.
రథం వెళ్ళిన దారినే కృష్ణుడి ఇంటికి తిరిగి వచ్చేసింది. కృష్ణుడా బ్రాహ్మణుడికి కాసుకలిచ్చి పంపి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు.