4. కృష్ణుడి శైశవక్రీడలు Krishna Childhood Butter Tales & Divine Miracles | Lord Krishna Avatar Story in Telugu

writer
0
రానురాను కృష్ణుడు చేసే ఆగడాలు మితి మీరిపోయి గోపకులను భీభత్సంలో ముంచెత్తాయి. ఏం చెయ్యాలో తోచక వాళ్ళు దిమ్మరపోయి చూస్తూ ఊరుకున్నారు. గోపికలు మాత్రం అలా ఊరుకోలేదు. వారంతా కూడబలుక్కుని, ఒక జట్టుగా యశోద వద్దకు వెళ్ళి ఆమె పైన విరుచుకు పడ్డారు.

"ఓయమ్మా, నువు కాగా ఒక గారాబు కొడుకును కన్నావు! వాడితో మేము పడే పాట్లు కూడా కాస్త చూడు మరీ! పోనీ చిన్నవాడు గదా అని చూస్తూ ఊరుకున్నందుకు ఇలాగా చేసేది? మీరు గొప్పవాళ్ళ యితే అవుదురు గాక! అసలు తప్పంతా నీదే. నువే వాణ్ణిలా తయారుచేసి మా మీదికి పంపకం చేశావు. నీ గుండెలో జాలి అనేది ఏ కోశానా ఉన్నట్టులేదు. నీ ముద్దుల కొడుకు ఏం చేశాడో చెవులారా విను" అని ఒకతె అంటుండగా మరొ కతె ముందుకు వచ్చి-

"ఏం చేశాడా? మా ఇంటో జొరబడి పది కడవల నెయ్యి, పెరుగూ, పాలూ తాగేశాడు ! 'కో' అంటూ కడవలన్నీ బోర్లా తోసేసి పారిపోయాడు. మా వంటి పేద వాళ్ళ కింత కన్న ఏం కావాలి? మే మెలా బతికేట్టు?” అన్నది.

అంతలో మరొక గోపిక ముందుకు వచ్చి, "ఓ తల్లీ, నీ కొడుకు రాక్షసుడు! నేను బానల్లోనూ, ఉట్ల మీదా వెన్న పెట్టి ఉంచితే, అంత వెన్నా తిని, బానలు పడదోసి, ఉట్లు తెంచాడు. మేము వీడితో ఎలా వేగాలి ? ఎక్కడికి పోవాలి ?” అన్నది.

మరొకతె అమితమైన కోపంతో, చేతులు తిప్పుకుంటూ, నాట్యంచేస్తున్న దాని లాగా యశోదను సమీపించి, " వెనకింట్లో ఎన్నో నేతిబానలున్నాయి. తలుపుకు తాళం పెట్టి ఉంచాను. నీ మాయదారి కొడుకు వచ్చి పడి, తలుపును తాళంతో సహా విరగదన్ని, లోపల జొరబడ్డాడు. నేను హడలిపోయి పారి పోయాను. నెయ్యంతా తాగాడో, ఏం చేశాడో, ఏమో! వెళ్ళి చూద్దునుగదా, ఒక్క బొట్టు నెయ్యి లేదు. దేశం గొడ్డుపోయిందా, తల్లి ? ఈ పాట్లు పడేకన్న ఈ పల్లెకు అగ్గి పెట్టేసి, మా పశువులతో ఇంకో చోటికి పోయి నిక్షేపంగా బతుకుతాం!" అన్నది.

ఈ మరొకతె వెనక నుంచి అందర్నీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి, "అదంతా ఏం వింటావు? మా యింట జరిగిన ఘోరం విను. నీ రాలుగాయి కొడుకు మా యింట జొరబడి పదికుండల నెయ్యి, పాలూ, పెరుగూ ఇల్లంతా ఈ లోతున విదజిమ్మి, ఖాళీ కుండలు చేతులా, కాళ్ళా తన్ని, వంట కుండల్లో ఉన్న అన్నమూ, కూరలూ పాయ సమూ కుర్రకారు చేత తినిపించి, కుండలన్నీ పగలగొట్టి, దూడలను ఆవుల వద్దకు విడిచాడు. ఇంటో ఏడిచే బిడ్డకు ఒక్క చుక్క వెన్న గాని, పాలు గానీ, పెరుగు గాని లేదు,” అన్నది.

మరొకతె ఏడుపు గొంతుతో, "నా మొగుడూ, పిల్లలూ తినాలని మోజుపడితే, పాలూ, పిండీ, కలకండా, వెన్నా కలిపి అట్లు వేసి, కుండల దొంతరలో పెట్టాను. నీ కొడుకు వచ్చి కుండలు దించి అన్నీ తినేశాడు. వాడి కడుపులో ఏం భూతా లున్నాయో ఏమో ! నిజం చెబితే నా మొగుడు నమ్ముతాడా, తల్లీ?" అన్నది.

ఈ విధంగా ఒకరిని మించి ఒకరు యశోదకు కృష్ణుడి పైన చాడీలు చెప్పారు. ఒకరింట బానలో కలిపి పెట్టి ఉంచిన పిండీ, పంచదారా తినేశాడు, అంతటితో పోక, కుండల్లో ఉన్న అన్నమంతా తినే శాడు ; ఇవి చిన్నపిల్లలు చేసే పనులేనా ? మరొకరి ఆవులనూ, దూడలనూ అడవిలోకి తరిమేశాడు, ఆ సమయానికి యింటి యజమానీ, కొడుకులూ ఇంట లేరు. అన్నీ అమానుషమైన పనులే! అందరూ అన్నీ చెప్పి, ఆఖరు మాటగా, "మే మెక్కడికన్నా వెళ్ళిపోతాం. నువూ, నీ కొడుకూ ఉట్టి కట్టుకు ఊరేగండి!" అని తేల్చి చెప్పారు.

అందరి మాటలూ విని యశోద ప్రతి ఒక్కరినీ ఓదార్చి, "మీకు కలిగిన నష్ట మంతా నేను అచ్చుకుంటాను, విచారించ కండి. కాని మీరు లేకుండా మా కెలా గడు స్తుంది? బిడ్డ ఇలాంటి రాక్షసప్పనులు చేశాడో, లేదో. మీ రేమో చేశాడంటున్నారు. మీ రైనా అబద్ధా లెందుకు చెబుతారు? ఇక చూడండి, పిల్లవాణ్ణి ఎలా అదుపులో వుంచుతానో! మీ రేమాత్రమూ సందే హించక మీ ఇళ్ళకు వెళ్ళిపొండి," అని గోపికలను పంపేసింది.

తరువాత ఆమె కృష్ణుణ్ణి చేరదీసి, "ఎందుకురా, బాబూ, వాళ్ళ ఇళ్ళకూ, వీళ్ళ ఇళ్ళకూ పోతావు? నీకు వెన్నా, పాలూ కరువయాయా? నే నిస్తాను, పాలు తాగు. గుక్కెడు తల్లిపాలకు పుట్టెడు ఇతర పాలు సమంకావంటారు. అయినవాళ్ళతో ఇలా పేచీలు తెస్తా వెందుకురా?" అంటూ తన కొడుక్కు పాలిచ్చి, చెక్కులు నొక్కి, తల వాసనచూసి, ముద్దులు పెట్టుకుని, చివరకు, "పొద్దున్నే లేచి నీ అల్లరి పనులు వినటంతోనే సరిపోయింది. అంత పనికి మాలినవాడివి, నిన్నే మనాలిరా? విడిచి పెట్టానంటే మళ్ళీ పోయి యాగీలు తెస్తావు. దుష్టుణ్ణి దయతలచరాదు,” అంటూ కృష్ణుణ్ణి రెక్క పట్టుకుని బండి సమీపానికి తీసుకుపోయి, పెద్ద రోలుకూ, పిల్లవాడి నడుముకూ పెయ్యతాడు కట్టి, బెత్తం ఒకటి తీసుకుని, "కదిలావా, మొత్తుతాను. ఎలా కదులుతావో నేనూ చూస్తాను,” అని తన ఇంటిపనులలో నిమగ్ను రాలయింది.

కొంచెం సేపు గడిచింది. కృష్ణుడు తాడు పట్టి రోటిని తన దగ్గిరికి ఈడ్చుకున్నాడు. పశువుల ఆవరణ ద్వారం సమీపంలో రెండు మద్దిచెట్లు దగ్గిర దగ్గిరగా ఉన్నాయి. కృష్ణుడు రోటిని ఒడుపుగా ఆ మద్దిమాను లకు చేరబెట్టి, తాను వాటి మధ్యగా దూరి అవతలికి వెళ్ళి, బలం కొద్దీ లాగాడు. రెండుమానులూ పెళపెళ విరిగి పడి పోయాయి. అనేకమంది గోపకులూ, గోపికలూ పరిగెత్తుకుంటూ వచ్చి, జరిగినది చూశారు. కొందరు గోపికలు యశోద వద్దకు పరిగెత్తి వెళ్ళి, "ఏం రాక్షసిబిడ్డమ్మా నీ కొడుకు ! వాణ్ణి ఎక్కడైనా రోటికి కట్టు తారా ? వాడు కాస్తా వెళ్ళి, ఇంతేసి చెట్లను విరిచి మీద పడేసుకుంటున్నాడు! చాలా తెలివిగా చేశాననుకుంటున్నావు కాబోలు, వెళ్ళి, బిడ్డకు ప్రమాదం రాకుండా చూసుకో ! " అని చెప్పారు.

యశోద కీ మాట వినగానే గుండె ఝల్లు మన్నది. "అమ్మయ్యా!" అని కేకపెట్టి, పైట జారిపోయేదీ, జుట్టుముడి ఊడి పోయేదీ కూడా తెలియకుండా పరుగు తీసింది. గోపికలు ఆమె వెంట పరిగెత్తారు.

ఈలోపుగా నందుడూ, ఇతర గోపకులూ అక్కడికి వచ్చి, విరిగిపడి ఉన్న చెట్ల మధ్య కృష్ణుడు, మేఘాల మధ్య చంద్రుడి లాగా, నవ్వు ముఖంతో కూర్చుని ఉండటం చూశారు. నందుడు చప్పున వచ్చి, పిల్లవాడి నడుముకు కట్టి ఉన్న పలుపుతాడు విప్పి, కుర్రవాణ్ణి ఎత్తుకుని, " వీడి నడుము కీ తాడేమిటి? తాటికి రోలేమిటి? దీన్ని ఈడ్చు కుంటూ వీడింత దూరం ఎలా వచ్చాడు? ఇంత పెద్ద మానులు ఎలా విరిగిపడ్డాయి? ఏమిటిదంతా?” అని అడిగాడు.

యశోద వచ్చి తానే కుర్రవాణ్ణి రోటికి తాడుతో కట్టానని చెప్పింది. నందుడు తన కొడుకు బలసత్వాలకు లోలోపల ఆశ్చర్య పోయి, పరమానందం చెందాడు.

ముసలి గోపకులకు ఇదేమీ అంతుచిక్క లేదు. "ఒక గాలి లేదు, పిడుగుపాటు లేదు, ఏ ఏనుగూ ఇటు కేసి రాలేదు, పోనీ సేనలన్నా రాలేదు; ఇలాటి సబబైన కారణాలేమీ లేకుండా, చంటి వెధవ ఇంతేసి చెట్లను పడగూల్చాడు గదా, ఇంతంటే ఉత్పాతం ఏం కావాలి ? ఇదేమన్నా మొదటి సారి కనకనా? రాక్షసి పూతన అమాంతం చచ్చింది. అంత లావు బండి అకారణంగా ముక్కలు ముక్క లయింది. ఇక్కడ ఉండటమే ప్రమాదంగా వుంది. కాని పుట్టి పెరిగిన ఈ చోటు విడిచి ఎక్కడి కని పోతాం ? ” అని తమలో తాము అనుకుంటూ తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

రోజులు గడిచాయి. బలరాముడికి ఎనిమిదేళ్ళూ, కృష్ణుడికి ఏడేళ్ళూ నిండాయి. వాళ్ళు తమ యీడు గోపబాలకులతో కూడి ఆడుతూ, దూడలతో ఆడుకుంటూ ఉత్సా హంగా కాలం గడుపుతున్నారు. చేతుల్లో చద్ది చిక్కాలు, చెరణాకోలలూ తీసుకునే వాళ్ళు, కాళ్ళకు కర్రచెప్పులు తొడిగేవాళ్ళు; పొట్టి జుట్టు ఎగరేసుకుంటూ బయలుదేరేవాళ్ళు; చుట్టుపక్కల ఉండే భూముల్లో గట్టిగా కేకలు పెడుతూ తోడేళ్ళను తరిమేవాళ్ళు, సరదాగా పాటలు పాడేవాళ్ళు, కూతలు పెట్టేవాళ్ళు, చెట్లెక్కేవాళ్ళు; తేనెపట్లు కనిపిస్తే తేనె తాగేవాళ్ళు, తెచ్చుకున్న అన్నాలు తినే వాళ్ళు. ఆ యాదవ బాలకులకు జీవితం మధురమైన ఆటవిడుపు లాగా సాగింది.

ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు. కృష్ణుడు బలరాముడితో ఇలా అన్నాడు.

"అన్నా, మనం ఈ వనం లోనే పుట్టాం, ఇనాళ్ళూ ఇక్కడే పెరిగాం. మందలూ, గోపకులూ ఇంత కాలంపాటు ఒకేచోట ఉండటం మంచిదా? మేత బిళ్ళన్నిటినీ పశువులు మట్టగించేశాయి. చెట్లు నరుకుడు పడి ధ్వంసమయాయి. చెరువులూ, మడు గుల్తూ రొంపి గుంటలయాయి. కూరలూ, కట్టెలూ కావాలంటే చాలా దూరం వెళ్ళ వలిసి వస్తున్నది. కనక మనం ఈ ప్రదేశం వదిలిపెట్టి బృందావనానికి వెళ్ళిపోదాం. అది చాలా అందమైన వనమని చెబుతారు. అక్కడ గోవర్ధనగిరి ఉన్నడట. దాని పైన భాండీర మనే పేరుగల మహా వటవృక్షం ఉన్నదట. బృందావనం మధ్యగా కాళిందీ నది ప్రవహిస్తూ వుంటుందట. అక్కడికి వెళ్ళిపోయి సుఖంగా బతుకుదాం. ముసలి వాళ్ళు ఈ చోటు విడవటానికి ఇష్టపడ కుండా ఉన్నారు. వాళ్ళను అదరగొట్టటానికి ఒక ఉపాయం చేస్తాను, చూడు.” 

ఇలా అంటూండగానే కృష్ణుడి శరీరం నుంచి వందల సంఖ్యలోనూ, వేల సంఖ్య లోనూ తోడేళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరి, చుట్టుపక్కల ప్రదేశమంతటా పరిగెత్తసాగాయి. గోపాలకులకూ, గోవులకూ గాభరా పుట్టిపోయింది. ఈ తోడేళ్ళ దౌష్ట్యం అసాధారణంగా కనబడింది. వాటిని వేటాడటం గోపకులకు ఎంతమాత్రమూ సాధ్యం కాలేదు. పులులను సైతం నిలవ వేయగల ఆబోతులను అవి చంపాయి. కాచే వాళ్ళు తల తిప్పి చూసే లోపుగా ఎటు నుంచో వచ్చి అవి దూడలను కాజేసుకు పోయాయి. ఈ ఉత్పాతానికి తోడు రాత్రి సమయాలలో పులుల రంకెలూ, సింహ గర్జనలూ, వినిపించ సాగాయి. పెద్ద పెద్ద పందులు వచ్చి, ఎక్కడబడితే అక్కడ గుంటలు తవ్వుతున్నాయి.

గోపకులు పెద్దలంతా చేరి చర్చించారు. ఇదివరకు జరిగిన ఉత్పాతాలకే బెదిరి కూడా, వాళ్ళు ఉన్న చోటు విడిచిపెట్టలేక వాటిని సహించి ఊరుకుంటే, ఇప్పుడు వాటన్నిటినీ మించిన ఉత్పాతం వచ్చి పడింది. ఏం చెయ్యాలి ?

"బృందావనం చాలా దివ్యంగా ఉంటుందని అందరూ తెగచెబుతున్నారు. కాని అక్కడ కూడా దుర్గమ ప్రాంతాలున్నా యట; వాటిలో రాక్షసు లుంటారట. ఏమైనా, ఏదో ఒకటి చెయ్యాలి. ఎక్కడికైనా వెంటనే పోవలిసిందే గాని ఇక్కడ ఒక్క క్షణం ఉండటం సాధ్య పడదు. క్షణక్షణానికీ ఏదో నష్టం జరుగుతూనే ఉన్నది," అని గోప వృద్ధులు తేల్చారు.

వారందరూ ఈ విధంగా అనుకుంటూం డగా అక్కడికి నారదుడు వచ్చి, నంద గోపుణ్ణి పిలిచి, దూరంగా తీసుకుపోయి, "మీరందరూ కలిసి బృందావనం వెళ్ళాలనుకుంటున్నారు. కాని అక్కడ రాక్షసులున్నారనీ, నీ కొడుకుకు ప్రమాదం చేస్తారేమోననీ నువు భయపడుతున్నావు. అవునా? విను. నీ కొడుకును మనుష్య మాత్రుడుగా భావించకు. అతను రాక్షసులను చంపటానికే అవతారమెత్తిన ఆది నారాయణుడు. కృష్ణుడూ, బలరాముడూ కూడా నారాయణాంశన పుట్టినవాళ్ళే. కృష్ణుణ్ణి చంపటానికి రాక్షసులు పూతన రూపంలో వచ్చీ, బండిలో దాగీ, మద్దిచెట్ల రూపం ధరించి, అతన్ని చంపలేకపోగా, తామే అతని చేతిలో చచ్చారు. నువు ప్రత్యక్షంగా చూశావుకద? అందుచేత, ఏమాత్రమూ సంకోచం లేకుండా మీ అందరి నివాసము బృందావనానికి మార్చు. తప్పక మేలు కలుగుతుంది,” అని చెప్పాడు.

నారదుడు కృష్ణుణ్ణి కూడా చూసి, అదే మాట చెప్పి వెళ్ళిన తరవాత, నందగోపుడు మిగిలిన గోపకులతో, "మనమంతా బృందావనానికి తరలిపోతున్నాం. అదే నిశ్చయం. అందరూ అందుకు గాను ప్రయాణ సన్నాహం ప్రారంభించండి," అన్నాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)